
క్వార్టర్స్లో సానియా జంట
న్యూఢిల్లీ : రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ సానియా మీర్జా తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం రాత్రి జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-1తో ఇరీనా కామెలియా బేగూ-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జంటను ఓడించింది.
తమ సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయిన ఈ ఇండో-స్విస్ జంట ప్రత్యర్థి సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగం తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట 6-3, 6-4తో లియోనార్డో మాయెర్-యువాన్ మొనాకో (అర్జెంటీనా) జోడీపై గెలిచింది.