
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భారత క్రీడాకారుల హవా కొనసాగుతోంది. తొలి రోజు మెన్స్ విభాగంలో రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణం సాధిస్తే, రెండో రోజు వుమెన్స్ విభాగంలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పసిడితో మెరిశారు. ఇక మూడో రోజు భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి స్వర్ణ పతకాన్ని సాధించారు. మంగళవారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భాగంగా ఫైనల్ పోరులో సౌరభ్ చౌదరి 240.7 పాయింట్లు సాధించి పసిడిని ఖాతాలో వేసుకున్నారు. తొలి రౌండ్ నుంచే ఆకట్టుకున్న 16 ఏళ్ల సౌరభ్.. ఏషియన్ గేమ్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రికార్డు స్కోరు సాధించి స్వర్ణాన్ని ఒడిసి పట్టుకున్నాడు.
కాగా, ఇదే విభాగంలో మరో భారత షూటర్ అభిషేక్ వర్మ కాంస్య పతకాన్ని సాధించాడు. మొత్తంగా 219.3 పాయింట్ల స్కోరు సాధించి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. ఫలితంగా భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు క్యాంస్యలు ఉన్నాయి.
చదవండి: ‘పసిడి’ కాంత
Comments
Please login to add a commentAdd a comment