
సోనియాకు రజతం
అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్ ఒక్క పతకంతో సరిపెట్టుకుంది. 57 కేజీల విభాగంలో సోనియా లాథెర్ రజత పతకంతో సంతృప్తి పడింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సోనియా 1-2 తేడాతో అలెస్సియా మెసియానో (ఇటలీ) చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. దీంతో వరుసగా మూడోసారి భారత్ ఈ ఈవెంట్లో పసిడిని నెగ్గలేకపోయింది. చివరిసారి 2010లో మేరీకోమ్ (48 కేజీలు) ఈ పోటీల్లో భారత్కు స్వర్ణం అందించింది.
రియో ఒలింపిక్స్కు చివరి అర్హత టోర్నమెంట్ అయిన ఈ పోటీల ద్వారా భారత్కు రియో బెర్త్ దక్కలేదు. ఫలితంగా ఈసారి ఒలింపిక్స్ మహిళల విభాగంలో భారత ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 51 కేజీల విభాగంలో ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా అర్హత పొందిన చైనా, చైనీస్ తైపీ బాక్సర్లు ప్రపంచ చాంపియన్షిప్లో సెమీఫైనల్కు చేరుకొని ఉంటే... భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్కు రియో బెర్త్ దక్కేది. కానీ చైనా, చైనీస్ తైపీ బాక్సర్లు సెమీఫైనల్కు చేరుకోవడంలో విఫలం కావడంతో భారత రియో బెర్త్ ఆశలు ఆవిరయ్యాయి.