మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చెందిన రెండు క్రికెట్ అకాడమీలపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఏడాది పాటు సస్పెన్షన్ విధించింది.
కోల్కతా: మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చెందిన రెండు క్రికెట్ అకాడమీలపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఏడాది పాటు సస్పెన్షన్ విధించింది. తప్పుడు వయసు ధృవీకరణతో తమ అకాడమీకి చెందిన ఆటగాళ్లను వివిధ టోర్నీల్లో ఆడించడమే దీనికి కారణం. ఓవరాల్గా రాష్ట్రంలోని 13 అకాడమీలపై ఈ వేటు పడింది.
ఇందులో బెంగాల్ జట్టు మాజీ కెప్టెన్ సంబరన్ బెనర్జీకి చెందిన రెండు అకాడమీలు కూడా ఉన్నాయి. 42 మంది ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం విధించింది. వయసు విభాగాల్లో జరిగే క్రికెట్ టోర్నీల్లో ఈ జాడ్యాన్ని అరికట్టేందుకు క్యాబ్ క్రికెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోసారి ఇలాంటి తప్పులు చేస్తే చాలా కఠినంగా ఉంటామని, కోచింగ్ సెంటర్లపై జీవిత కాల నిషేధం, ఆటగాళ్లపై పదేళ్ల నిషేధం విధిస్తామని క్యాబ్ హెచ్చరించింది.