
న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో యువ ఆటగాడు శుబ్మన్ గిల్కు చోటు కల్పించకపోవడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అజింక్య రహానేను టెస్టులకు మాత్రమే పరిమితం చేయడం సరికాదని పేర్కొన్నారు. మరింత మందిని ఎంపిక చేసి మూడు ఫార్మాట్లకు ఒకే జట్టును ప్రకటించాల్సిందని సూచించారు. జట్టులోని ఆటగాళ్లలందరికీ మూడు ఫార్మాట్లలో అవకాశం కల్పిస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరిగి మంచి ప్రదర్శన చేసేవారని అభిప్రాయపడ్డాడు. సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టుపై అందరూ సంతోషంగా లేరని గంగూలీ ట్వీట్ చేశాడు.
ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని జాతీయ సెలక్టర్ల బృందం విండీస్ టూర్కు ఆదివారం మూడు ఫార్మాట్లకు విడి విడిగా జట్టును ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మాత్రమే మూడు ఫార్మాట్లలో స్థానం దక్కించుకున్నారు. రాహుల్ చహర్(స్పిన్), నవదీప్ సైనీ(పేసర్)లకు తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచిన టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ను ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. గత మూడు ఇన్నింగ్స్లో వరుస అర్ధసెంచరీలు సాధించి సత్తా చాటినా సెలెక్టర్లు అతడిని పట్టించుకోకపోవడం గమనార్హం. శుబమన్ గిల్ ఎంపిక చేయకపోవడంపై విమర్శలు రావడంతో ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. ఇంకా గిల్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడంటూ సమర్ధించుకునే యత్నం చేశాడు. (చదవండి: మూడు ఫార్మాట్లకు ఒకేసారి జట్ల ప్రకటన)
Comments
Please login to add a commentAdd a comment