
సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్లో తరచు బాల్ ట్యాంపరింగ్ ఉదంతాలు వెలుగు చూడటానికి ఐసీసీ రూల్సే కారణమని అంటున్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా. ట్యాంపరింగ్కు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తారనే భయం లేకపోవడంతో దక్షిణాఫ్రికాతో టెస్టులో ఆసీస్ క్రికెటర్లు ఆ దుశ్చర్యకు పాల్పడ్డారన్నాడు. ఏదైనా తప్పు చేసినపుడు దానికి తగినట్లు శిక్షలుండాలి. లేకపోతే అది ఇలాగే చేయి దాటిపోతుంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు వాస్తవంలో జీవించడం లేదన్నది నిజం. ఏం చేసినా కూడా కాపాడడానికి తమ చుట్టూ కొంతమంది ఉన్నారనే ధైర్యంతో వాళ్లున్నారు.
స్టీవ్ స్మిత్ ఇంకా యువకుడే కాబట్టి తిరిగి క్రికెట్ ఆడగలడు. అయితే అతని చుట్టూ ఉన్న ప్రజలు బాల్ టాంపరింగ్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఆ సవాలును ఎదుర్కోవడం అతనికి పెద్ద పరీక్ష. గతంలో మైదానంలో ఆటగాళ్లు గరుకు ప్రాంతంలో బంతిని కిందేసి కొట్టేవాళ్లు. అది తప్పని తెలిసినా కూడా ఆటగాళ్లు అలా చేశారు. అక్కడి నుంచే ఇదంతా మొదలైంది. గతంలో బంతిని ట్యాంపరింగ్ చేసిన కెప్టెన్లపై ఏదో మొక్కుబడిగా చర్యలు తీసుకున్నారు. అందుకే ట్యాంపరింగ్ అనేది చాలా మందికి అలవాటుగా మారిపోయింది’ అని స్టీవ్ వా విమర్శించాడు.