
మలింగా అవుట్: స్టెయిన్ ఇన్
బ్రిడ్జిటౌన్(బార్బోడాస్): త్వరలో ఆరంభం కానున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) నుంచి శ్రీలంక పేస్ బౌలర్ లషిత్ మలింగా తప్పుకున్నాడు. సీపీఎల్ లో భాగంగా జమైకా తల్లావాస్ జట్టుకు మలింగా ఆడాల్సిఉంది. ఇటీవల కాలంలో తరచు గాయాల బారిన పడుతున్న మలింగా టోర్నీ నుంచి ముందుగానే వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. దీంతో అతని స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ కు అవకాశం కల్పించారు. సీపీఎల్లో తొలిసారి పాల్గొంటున్న స్టెయిన్ కు ఇది ఆరో టీ 20 ప్రాంఛైజీ కావడం విశేషం. జూన్ 30 నుంచి ఆగస్టు 7వరకూ జరిగే సీపీఎల్లో పలువురు సఫారీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. వీరిలో హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్, డు ప్లెసిస్,డేవిడ్ మిల్లర్, మోర్నీ మోర్కెల్లు ఉన్నారు.
ఇదిలా ఉండగా గత నవంబర్ నుంచి గాయాలతో సతమతమవుతున్న మలింగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)9 సీజన్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న మలింగా ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్తో చేరినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంతకుముందు ఆసియా కప్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన మలింగా.. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టి-20 ప్రపంచ కప్లో కూడా పాల్గొనలేదు.