ఈసారీ పతకం వచ్చేనా? | world sennior boxing championship looking to win medals | Sakshi
Sakshi News home page

ఈసారీ పతకం వచ్చేనా?

Oct 14 2013 12:23 AM | Updated on Sep 1 2017 11:38 PM

ఈసారీ పతకం వచ్చేనా?

ఈసారీ పతకం వచ్చేనా?

వరుసగా మూడోసారి ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గాలనే లక్ష్యంతో భారత బాక్సర్లు ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగనున్నారు.

న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి ప్రపంచ సీనియర్ బాక్సింగ్  చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గాలనే లక్ష్యంతో భారత బాక్సర్లు ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగనున్నారు. కజకిస్థాన్‌లోని అల్మాటీలో సోమవారం ఈ పోటీలు ప్రారంభమవుతాయి. ఇటలీ ఆతిథ్యమిచ్చిన 2009 పోటీల్లో విజేందర్ సింగ్... అజార్‌బైజాన్ వేదికగా జరిగిన 2011 పోటీల్లో వికాస్ కృషన్ యాదవ్ భారత్ తరఫున కాంస్య పతకాలు సాధించారు. భారత బాక్సింగ్ సంఘంపై సస్పెన్షన్ ఉన్న నేపథ్యంలో ఈసారి భారత బాక్సర్లు అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఐబా) పతాకం కింద పోటీపడతారు.
 
 ఆదివారం ఈ పోటీల ‘డ్రా’ను విడుదల చేశారు. భారత్ నుంచి ఐదుగురు బాక్సర్లకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. ఆసియా చాంపియన్ శివ థాపా (56 కేజీలు) నాలుగో సీడ్‌గా, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మనోజ్ కుమార్ (64 కేజీలు) ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరితో పాటు నానో సింగ్ (49 కేజీలు), ఒలింపియన్ సుమిత్ సంగ్వాన్ (81 కేజీలు), ఆసియా గేమ్స్ రజత విజేత మన్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు)లకు కూడా తొలి రౌండ్‌లో బై లభించింది. దీంతో వీరంతా నేరుగా రెండో రౌండ్ బౌట్‌లో తలపడతారు. స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ (75 కేజీలు) మాత్రం తొలి రౌండ్ నుంచే చెమటోడ్చనున్నాడు. ఈ నెల 17న జరిగే పోరులో స్వీడన్‌కు చెందిన హంపస్ హెన్రిక్సన్‌తో అతను తలపడతాడు. సోమవారం జరిగే పోరులో మదన్‌లాల్ (52 కేజీలు)... అలెగ్జాండ్రోస్ రిస్కన్ (మాల్దొవా)తో  ఆడతాడు. ఈనెల 26 వరకు జరిగే ఈ పోటీల్లో 116 దేశాల నుంచి 550 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement