భివండీ, న్యూస్లైన్: సమాజ్వాదీ పార్టీ కార్పొరేటర్ ప్రశాంత్ లాడ్ మంగళవారం భివండీ నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్ఎంసీ) స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవీ బాధ్యతలను చేపట్టారు. గత నెల 29వ తేదీన జరిగిన స్టాండింగ్ కమిటి చైర్మన్ ఎన్నికలలో ప్రశాంత్ గెలుపొందిన విషయం విదితమే. ఈ సందర్భంగా మాజీ మేయర్, కోణార్క్ వికాస్ ఆఘాడీ నాయకుడు విలాస్ పాటిల్, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ చౌగులే, తుషార్ చౌదరి, శిక్షణ్ మండలి సభాపతి గాజు గాజెంగితో పాటు కార్పొరేషన్ అధికారులు, అభిమానులు ఆయనను అభినందించారు. అనంతరం ప్రశాంత్ లాడ్ విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో రహదారుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. నిధుల కొరత సమస్య కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఈ విషయమై త్వరలో ఓ సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.