
అనూహ్య కేసులో కీలక మలుపు
సాక్షి ముంబై: ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య కేసుపై ఎట్టకేలకు చార్జిషీట్ దాఖల యింది. ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయం సోమవారం విలేకరుల సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) సదానంద్ ధాతే ఈ విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన అనూహ్య కేసును సవాల్గా తీసుకుని నిందితుడిని అరెస్టు చేశామన్నారు. లభించిన ఆధారాలకు అనుగుణంగా 542 పేజీల చార్జిషీట్ను దాఖలు చేసినట్టు చెప్పారు. ఈ కేసులో 76 మంది సాక్షులున్నట్టు చెప్పారు. ప్రధాన నిందితుడు చంద్రభాన్ సానప్ ఎలియాస్ చౌక్యా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.
కళ్లద్దాలు, ఐడీ కార్డుతో సరిపోలిన డీఎన్ఏ...
కేసు దర్యాప్తునకు అవసరమైన ఎన్నో ఆధారాలను పోలీసులు సేకరించారు. అనూహ్య నుంచి దొంగి లించిన బ్యాగ్, దుస్తులు, ఐడీకార్డు తదితరుల వస్తువుల్లో లభించిన డీఎన్ఏను గుర్తించేందుకు ప్రయత్నించారు. నిందితుడి నుంచి సేకరించిన అనూహ్య కళ్లద్దాలు, ఐడీ కార్డు నుంచి లభించిన డీఎన్ఏ అనూహ్య డీఎన్ఏతో సరిపోలింది. ఏసీపీ ప్రఫుల్ మీడియా సమావేశం అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినట్టు చెప్పారు. ‘డీఎన్ఏతోపాటు అనేక ఆధారాలను సేకరించాం. 76 మంది సాక్షులనూ ప్రశ్నించాం. ఈ ప్రక్రియ అనంతరం చార్జిషీట్ దాఖలు చేశాం. అనూహ్య మృతదేహం కుళ్లిపోవడంతో అనేక ఆధారాలకు నష్టం వాటిల్లింది. అయినా శ్రమించి చంద్రభానును పట్టుకోవడంతోపాటు పలు వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నాం. అనూహ్యను మోట ర్సైకిల్పై తీసుకెళ్తుండగా కూడా చూసిన ప్రత్యక్ష సాక్షులనూ గుర్తించాం. వీరితోపాటు అనేక మందిని విచారించాం. అనంతరం నిర్వహించిన పరేడ్లో కూడా నిందితున్ని సాక్షులు గుర్తుపట్టారు’ అని ఆయన వివరించారు.
అత్యచారం జరిగింది...!
అనూహ్య మృతదేహం కుళ్లిపోవడంతో ఆమెపై అత్యాచారం జరిగిందా లేదా అనే విషయం వైద్యపరీక్షల్లో తేలలేదు. అత్యాచారం జరిగినట్టు తమ దర్యాప్తులో తేలిందని ప్రఫుల్ బోస్లే పేర్కొన్నారు. దీంతో నిందితునిపై 302, 364, 366, 376(2)(ఎస్), 376ఎ, 397, 210, 170 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
లభించని ల్యాప్ట్యాప్...
అనూహ్య వస్తువుల్లో కీలకమైన ల్యాప్టాప్ ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. దీనికోసం ఇప్పటికీ గాలిస్తున్నామని ప్రఫుల్ తెలిపారు. దానిని ఆంబివలి, షాహాడ్ సమీపంలోని క్రీక్నదీలో పడేసినట్టు నిందితుడు పేర్కొన్నాడు. దీంతో గజ ఈతగాళ్ల సహకారంతో ల్యాప్టాప్ కోసం గాలింపు చేపట్టారు. ఏసీపీ ప్రఫుల్ నేతృత్వంలోని 20 మంది అధికారులు, 85 మంది పోలీసుల బృందాలు పరిసరాలను జల్లెడపట్టాయి. అయినప్పటికీ ల్యాప్టాప్ ఆచూకీ దొరకలేదు. ఇదిలా ఉంటే అనూహ్య కేసులో ప్రభుత్వం తరఫున వాదించేందుకు అడ్వకేట్ రాజన్ ఠాక్రేను ప్రాసిక్యూషన్ న్యాయవాదిగా నియమించాలని కోరినట్టు జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) సదానంద్ దాతే తెలిపారు. ఈ కేసును ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్టు ఆయన చెప్పారు. స్వగ్రామం నుంచి జనవరి ఐదున ముంబైకి వచ్చిన అనూహ్య అదృశ్యం కావడంతో కేసు నమోదయింది. కుళ్లిపోయిన ఈమ మృతదేహం 16న భాండుప్లోని ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ వే సమీపంలో దొరికింది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఈమె ముంబై టీసీఎస్లో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్గా పనిచేసేది.