ముంబై: బొంబాయి హైకోర్టు ప్రాంగణంలో ‘పర్మనెంట్ జ్యుడీషియల్ మ్యూజియం’ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ మ్యూజియంలో జాతిపిత మహాత్మా గాంధీ, మొహమ్మద్ అలీ జిన్నాల బారిస్టర్ సర్టిఫికెట్లను ప్రదర్శనకు ఉంచారు. కోర్టు 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోహిత్షా పాల్గొన్నారు. మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ఇక్కడి న్యాయమూర్తులు, న్యాయ కోవిధులతో భేటీ అయ్యారు. దక్షిణ ముంబైలోని చరిత్రాత్మక హైకోర్టు భవనం కింది అంతస్తులో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.
నూట యాభై ఏళ్ల కోర్టు చరిత్రతో సంబంధం ఉన్న అనేక పురాతన వస్తువులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్కాదర్ వల్లభ్ భాయ్ పటేల్, కేఎం మున్షీ, భారత ప్రథమ ప్రధాన న్యాయమూర్తి ఎంసీ ఛాఘ్లాల బారిస్టర్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. పురాతన కాలం నాటి కొవ్వొత్తుల స్టాండ్లు, సిరా బుడ్డీలు, పేపర్ వెయిట్లు, బ్రిటీషు కాలంలో న్యాయమూర్తులు ధరించే విగ్గు తదితర కోర్టు సంబంధమైన పరికరాలను ప్రదర్శనకు ఉంచారు. ఈప్రాంగణంలో మొదటి కోర్టు 1726 నుంచి 1798 మధ్య కాలంలో మేయర్ కోర్టుగా పని చేసింది. ఆ తరువాత అది రికార్డర్స్ కోర్టుగా 1824 వరకు కొనసాగింది. అనంతరం అది 1824 నుంచి 1862 వరకు బొంబాయి సుప్రీం కోర్టుగా పని చేసింది. 1862లో బొంబాయి హైకోర్టు ఆవిర్బవించింది.
బొంబాయి హైకోర్టు ప్రాంగణంలో గాంధీ, జిన్నాల సర్టిఫికెట్లున్న మ్యూజియం
Published Sun, Feb 15 2015 3:54 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
Advertisement
Advertisement