
'మా అక్కను కూడా ఫాలో అవుతున్నారు'
బెంగళూరు : 'వాళ్లు మా అక్కను కూడా ఫాలో అవుతున్నారు. ఆమె చేస్తున్న పనులన్నీ చెబుతున్నారు. వారు చెప్పే వివరాలు అన్నీ కూడా సరైనవే' అని హత్యకు గురికావడానికి ముందు శరత్ అనే విద్యార్థి తన తండ్రికి వాట్సాప్ ద్వారా పంపించిన వీడియోలో వివరించాడు. బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న నిరంజన్ కుమార్ అనే వ్యక్తి కుమారుడైన శరత్ ను కిడ్నాప్ చేసిన దుండగులు దారుణంగా హత్య చేశారు. కెంగెరీలోని తన ఇంటికి సమీపంలో శరత్ ఈ నెల (సెప్టెంబర్) 12న కిడ్నాప్కు గురయ్యాడు.
ఈ కిడ్నాప్ కేసు విచారణ చేపట్టిన పోలీసులు, శుక్రవారం రోజు శరత్ మృతి చెందినట్టు గుర్తించారు. నగర శివార్లలో రామోహల్లి సరస్సులో శరత్ మృతదేహం లభ్యమైంది. ఇప్పటికే ఈ హత్య కేసుకు సంబంధించి శరత్ స్నేహితుడు విశాల్తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొత్తగా తాను తీసుకున్న బైక్ను స్నేహితులకు చూపించేందుకని బయటకు వెళ్లిన శరత్ను దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అతడి ఫోన్ నుంచే తండ్రికి రెండు వీడియోలు వాట్పాప్ ద్వారా పంపించారు.