
తన్నితరిమిన చరిత్ర కోనది.. బాబెంత: వైఎస్ జగన్
కోన: ఇష్టం లేకుండా బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే తన్నితరిమిన చరిత్ర కోన గ్రామానికి ఉందని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలాంటిది పోర్టు పేరుతో బలవంతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రిలాంటివాడని, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజల ఆస్తులు లాక్కుని దళారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరే రాష్ట్రానికి ఉండడని ఆయన అన్నారు. గురువారం సాయంత్రం బందర్ పోర్టు బాధితులకు భరోసా ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన సభలో వైఎస్ జగన్ మాట్లాడారు.
గతంలో ఎన్నికల సమయంలో కోనకు వచ్చిన చంద్రబాబు నాలుగువేల ఎకరాలు ఎందుకు 1800 ఎకరాల్లో పోర్టు కట్టిస్తామని అన్నారని, కానీ ఇప్పుడు మాత్రం ప్రజలతో ఆటలాడుకుంటూ నాలుగువేల ఎకరాలు సరిపోదని 30 వేల ఎకరాలు అని చెప్పి.. మరోసారి మాటమార్చి ఏకంగా లక్షా ఐదువేల ఎకరాలు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలయినంత తక్కువ భూముల్లో పోర్టు కట్టించాలని, మిగితా భూములు రైతులకే వదిలిపెట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
పోర్టు పేరుతో అధికంగా భూములు తీసుకొని వేరే వాళ్లకు అమ్ముకునేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ల్యాండ్ పూలింగ్ ఒక దారుణమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతభూమిని లాక్కుని వారికి వెయ్యి గజాలు మాత్రం ముష్టి వేస్తారని చంద్రబాబు అంటున్నారని, దీనిని ఎలా సమర్థించాలని నిలదీశారు. రైతులకు అతి ఆశ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎకరాకు రూ.30 వేలు పదేళ్లపాటు ఇస్తానని చంద్రబాబు అని, చివరకు అవి కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.30 నుంచి రూ.50లక్షల ధర ఉంటే వేలు ఇచ్చి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని అన్నారు.
చంద్రబాబుకు అసైన్డ్ భూములంటే చాలా చులకన అని, పేదవానికి అసైన్డ్ భూములిచ్చినప్పుడు మరింత భూములిచ్చి వారిని ఆదుకోవాల్సింది పోయి ఇష్టమొచ్చినప్పుడు తీసుకుంటున్నాడని మండిపడ్డారు. ఇక్కడ భూములకు కాలువ నీళ్లిచ్చే పరిస్థితి లేదని, బ్యాంకుల నుంచి క్రాప్లోన్లు కూడా ఇవ్వకుండా కట్టడి చేస్తూ రైతులపై కక్షపూరిత చర్యలు చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వ్యక్తిగత అవసరాలకోసం భూములు కూడా అమ్ముకోనివ్వకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలన ఇక మరెంతకాలమో సాగదని అన్ని సక్రమంగా ఉంటే రెండేళ్లేనని, దేవుడు దీవిస్తే మరో ఏడాదిలోనే బంగాళఖాతంలో కలుస్తుందని వైఎస్ జగన్ చెప్పారు. త్వరలోనే ప్రజల ప్రభుత్వం వస్తుందని, అందరి భూములు భద్రంగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.