
ఒక్కటే..!
జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు జలయజ్ఞం కింద తీసుకున్న రాజీవ్ (దుమ్ముగూడెం), ఇందిరాసాగర్ ప్రాజెక్టుల్లో.. ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం స్వస్తి చెప్పనుంది. ఈ ప్రాజెక్టు హెడ్ వర్క్ పోలవరం ముంపు కింద ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లింది. అక్కడి ప్రభుత్వానికి రెండుసార్లు లేఖ రాసినా స్పందించకపోవడంతో దుమ్ముగూడెంతోనే జిల్లాకు సాగునీరు అందించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇది ఎంత వరకు సాధ్యమవుతుందనే దానిపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నారుు.
- దుమ్ముగూడెం ప్రాజెక్టుతోనే జిల్లా అంతటికీ నీరు
- ఇందిరాసాగర్ హెడ్ వర్క్ ఏపీలోకి వెళ్లడమే కారణం
- ఆంధ్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం
- సాధ్యాసాధ్యాలపై ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీ
- నెలరోజుల్లో నివేదిక తెప్పించేందుకు ప్రభుత్వం కసరత్తు
- ఈ లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు ముందుకు పడేనా..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జలయజ్ఞం కింద అప్పటి ప్రభుత్వం రాజీవ్సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను తీసుకుంది. రాజీవ్సాగర్తో ఖమ్మం, వరంగల్లోని 2 లక్షల ఎకరాలకు, ఇందిరాసాగర్తో ఖమ్మం, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 2 లక్షల పై చిలుకు ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర విభజన ముందు వరకు రాజీవ్సాగర్ పనులు 60 శాతం, ఇందిరాసాగర్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. ప్రధాన కాల్వలు, ట్యాంకులు అన్నింటినీ దాదాపుగా పూర్తిచేశారు. గోదావరి నుంచి లిఫ్ట్ ద్వారా నీటిని పెకైత్తే పనులు మాత్రమే ప్రారంభం కాలేదు. ప్రస్తుతం రాజీవ్సాగర్ ప్రాజెక్టు అంతా తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఉంది.
ఇందిరాసాగర్ హెడ్వర్క్ పనులు జరిగే ప్రాంతం వేలేరుపాడు మండలం రుద్రంకోట వద్ద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లడంతో ప్రాజెక్టు నిర్మాణంపై మొన్నటి వరకు నీలినీడలు అలముకున్నాయి. ఈ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర సర్కారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండుసార్లు లేఖలు రాసింది. ఏపీలోని రెండు జిల్లాల్లో 68వేల ఎకరాల ఆయకట్టు కూడా డిజైన్లో పేర్కొన్నారు. హెడ్వర్క్ పనులు ఏపీలోనే ఉన్నాయనే దాన్నీ ప్రభుత్వం లేఖలో వివరించింది. అరుునా ఆ ప్రభుత్వం స్పందించలేదన్న కారణంతో దుమ్ముగూడెంతోనే జిల్లా అంతటికి నీరందించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీనిపై జిల్లా అధికారులు, జిల్లా మంత్రి తుమ్మల, భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్రావుతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పలుమార్లు చర్చించారు.
దుమ్ముగూడెంలోకి ఇందిరాసాగర్ డిజైన్..
జిల్లాలో ఇందిరాసాగర్ ద్వారా 1.32లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అప్పట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఈ ప్రాజెక్టు పరిధిలో పనులను దుమ్ముగూడెంకు అనుసంధానం చేశారు. మొత్తంగా దుమ్ముగూడెంతోనే సాగునీరు అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. రెండు ప్రాజెక్టులకు ఇప్పటి వరకు రూ.1700 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఉన్న ఇందిరాసాగర్ పనులను దుమ్ముగూడెంతో అనుసంధానం చేస్తే ఇంకా ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఎన్ని అవసరం అవుతాయి..? తదితర వివరాలపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే సీఎం జిల్లా అధికారులను ఆదేశించారు.
దుమ్ముగూడెం ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రధాన కేంద్రం అశ్వాపురం మండలం పాములపల్లిలో ఉంది. ఇక్కడ నుంచి తొలుత కుమ్మరిగూడెం, గొల్లగూడెం, కరకవాగు, రోళ్లపాడు, లలితాపురం, సింగభూపాలెం, మద్దుకూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా డిజైన్ చేశారు. ఇందిరాసాగర్ పనులను అనుసంధానం చేస్తే ఇంకా పలు చెరువులను రిజర్వాయర్లుగా మార్చాల్సి ఉంటుంది.
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు..
ఎన్నెస్పీ ఆయకట్టు పరిధిలో లేని మండలాలు అన్నింటికీ దుమ్ముగూడెంతోనే సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సింగిల్ ప్రాజెక్టు డిజైన్ను తీసుకోవాలని నిర్ణయించింది. పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, ఇల్లెందు నియోజకవర్గంలో గార్ల, బయ్యారం, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాలు దుమ్ముగూడెం ప్రాజెక్టు డిజైన్లో ఉన్నాయి. ఇందిరాసాగర్ పనులు దుమ్ముగూడెంతో అనుసంధానం చేసి సత్తుపల్లి, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలకూ సాగునీరు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ డిజైన్ కోసం రిటైర్డ్ అధికారులు, ప్రస్తుత సాగునీటి ఇంజనీర్లతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇందిరాసాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టు పరిధిలో ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలించి.. మ్యాప్ ద్వారా సింగిల్ ప్రాజెక్టు డిజైన్ను రూపొందించే పనిలో నిమగ్నమైంది.
ఎప్పటికి సాధ్యమయ్యేను..?
ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ ప్రాజెక్టులను 2017లోగా పూర్తిచేయాలని అప్పటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. గడువు ఇంకా రెండేళ్లున్నా పనులు మాత్రం పూర్తయ్యే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వం సింగిల్ ప్రాజెక్టును తీసుకోవడం, జిల్లా అంతటికీ నీరందించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ ప్రాజెక్టు ఇంకెప్పటికి పూర్తవుతుందోనని జిల్లా రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇందిరాసాగర్ ప్రధాన పనులు ఏపీలోకి వెళ్లాయని ప్రభుత్వం ఇదొక కారణంగా చూపుతున్నా.. రాజీవ్సాగర్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తే జిల్లా ఆయకట్టు సస్యశ్యామలం అవుతుందంటున్నారు.