ములాయంపై అఖిలేశ్ రెబల్ అస్త్రం!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ పై రెబల్స్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధం అవుతున్నారా? అంటే తాజా పరిణామాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధుల్లో 325 మంది పేర్లను ములాయం సింగ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ లు బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపిక చేసిన అభ్యర్ధుల్లో అఖిలేశ్ వర్గానికి చెందిన వారికి స్ధానం దక్కలేదు. ఈ నేపథ్యంలో గురువారం అఖిలేశ్ తన అనునూయులతో సమావేశమయ్యారు.
పార్టీ అభ్యర్ధులుగా ఎంపిక కానీ నాయకులందరూ రెబల్స్ గా బరిలోకి దిగాలని సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ టిక్కెట్లు దక్కనివారిలో అత్యధికులు ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పని చేస్తున్నవారే. అయితే, ములాయం సింగ్ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన సమయంలో అఖిలేశ్ బుందేల్ ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అభ్యర్ధుల ఎంపికపై మాట్లాడిన ములాయం ఎవరో ఇచ్చిన లిస్టులను బట్టి అభ్యర్ధుల ఎంపిక జరగలేదని చెప్పారు.
అభ్యర్ధులను తానే ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎవరు? అన్న విషయాన్ని కూడా పార్టీ ఇప్పుడే వెల్లడించదని చెప్పారు. సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత పార్టీ నేతలే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని చెప్పారు. అఖిలేశ్ తాను ఎక్కడి నుంచి పోటీ చేయదలుచుకున్నా చేయొచ్చని పేర్కొన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే 78 స్ధానాల్లో అభ్యర్ధులను ఎంపిక చేయకుండా వదిలేశారనే ప్రచారం జరుగుతోంది.