
అమరావతికి కుటుంబంతో వెళ్తారా? లేదా?
* ఉద్యోగులు వారం రోజుల్లోగా తెలియజేయాలి
* నమూనా పత్రాలతో సర్క్యులర్ మెమో జారీ
సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి లేదా ఏపీలోని ఏ ప్రాంతానికైనా కుటుంబ సమేతంగా వెళ్తారా? లేదా? తెలియజేయండి. వెళ్లేపక్షంలో ఏమైనా వెసులుబాటులు, మినహాయింపులు కోరుకుంటున్నట్టైతే తెలపండి..’ రాష్ట్ర సచివాలయంలో, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరి నుంచి ఈ వివరాలను సేకరించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన నమూనా పత్రాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు.
నూతన రాజధానికి కుటుంబాలతో సహా వెళితే తమ పిల్లలు అక్కడ స్థానికేతరులవుతారని, అందువల్ల తమ పిల్లలకు అక్కడి స్థానికత కల్పించాలని, అందుకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు తీసుకురావాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. అసలు ఎంతమంది ఉద్యోగులు కుటుంబ సమేతంగా నూతన రాజధానికి తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు, వారి పిల్లలు ఎక్కడ ఎంతవరకు చదివారు. పిల్లలను ఏపీ విద్యా సంస్థల్లో చేర్పిస్తారా లేదా? అనే వివరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ సర్క్యులర్ జారీ చేశారు.
ఉద్యోగులందరూ వారం రోజుల్లోగా ఈ వివరాలను సమర్పించాలని మెమోలో పేర్కొన్నారు. ఆ వివరాలను బట్టి ఎంతమంది ఉద్యోగులు హైదరాబాద్లో స్థానికత కోరుకుంటున్నారు, ఎంత మంది ఏపీ నూతన రాజధానికి వెళ్లాలని కోరుకుంటున్నారు, అక్కడికి వెళ్లే ఉద్యోగుల పిల్లలు ఎంతమంది ఆటోమెటిక్గా అక్కడ స్థానికులవుతారు, ఎంతమంది స్థానికత కోరుకుంటున్నారు.. అనే సమాచారాన్ని ఆయా శాఖల అధిపతులు క్రోడీకరించి ప్రభుత్వానికి పంపించాలని తెలిపారు.