
బాబు ఆస్తుల ప్రకటన బూటకం: బాలినేని శ్రీనివాసరెడ్డి
చంద్రబాబు ఆస్తుల ప్రకటన బూటకమని వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఒంగోలు, న్యూస్లైన్ : చంద్రబాబు ఆస్తుల ప్రకటన బూటకమని వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు తన ఆస్తులను ఇప్పుడు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ఆయన ప్రకటించిన వివరాలు చూసి జనం నవ్వుకుంటున్నారు. తన మొత్తం ఆస్తి విలువ రూ.42 కోట్లని బాబు పేర్కొనడం ఏదోవిధంగా తాను నిజాయితీపరుడినని చెప్పుకోవడానికే. జూబ్లీహిల్స్లోని చంద్రబాబు ఇంటి విలువ రూ.23 లక్షలని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మేము రూ.2 కోట్లు ఇస్తాం. చంద్రబాబు ఆ ఇంటిని మాకు రాసిస్తారా? అని సవాలు చేస్తున్నాం.
ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ఆస్తులను ప్రకటిస్తూనే ఉంటారు. అయితే ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు ఆస్తుల విలువను ప్రకటించడం ద్వారా కూడా లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఆస్తుల ప్రకటన చేశారు. నిజాయితీపరుడినని తనకుతాను చెప్పుకోవడం కాదని, జనం చెప్పుకోవాలనే విషయాన్ని సైతం మరిచిపోయిన టీడీపీ అధినేతను చూస్తే ప్రతి ఒక్కరికీ నవ్వు వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఎంత ఖర్చుపెట్టారో ప్రతి ఒక్కరికీ తెలుసు. అటువంటి వ్యక్తి తప్పుడు లెక్కలతో జనాన్ని మోసం చేయాలని చూసినంత మాత్రాన అది నిజమని నమ్మే జనం మాత్రం లేరు. చంద్రబాబు నిజాయితీపరుడినని నిరూపించుకోవాలంటే సీబీఐ ఎంక్వయిరీకి సిద్ధం కావాలి. అప్పుడే జనం విశ్వసిస్తారు. చంద్రబాబు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సీబీఐ విచారణ కోరితే ఆయన కోర్టు స్టే తెచ్చుకోవడాన్ని పరిశీలిస్తే ఆయన నిజాయితీ ఏమిటో అందరికీ అర్థం అవుతుంది’’ అని ఆయన అన్నారు.
ఆ లెక్కలన్నీ బూటకం: నల్లపురెడ్డి
చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల లెక్కలన్నీ పచ్చి బూటకమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి విమర్శించారు. మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్ కాలేజీలు, పలు హోటళ్లు, కార్ల కంపెనీల్లో వాటాలను బినామీ పేర్లతో చంద్రబాబు ఉంచారని తెలిపారు. రాష్ట్రంలోనేగాక ఇతర రాష్ట్రాలలోను, బయటి దేశాల్లోనూ బినామీ పేర్లతో బాబుకు వ్యాపారాలున్నాయని చెప్పారు. ఈ మేరకు నల్లపురెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లోని టీడీపీ కార్యాలయానికి సంబంధించిన స్థలం ఎవరి పేరు మీద ఉన్నదో బాబు చెప్పాలన్నారు.