
కిలో టీపొడిః రూ.లక్ష
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే, ముఖ్యంగా యూరప్ దేశాల్లో డార్జిలింగ్ తేయాకుకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. అయితే ప్రత్యేక రాష్ట్రం కోసం పశ్చిమ బెంగాల్లోని గూర్ఖాలాండ్ ప్రజలు గత కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తుండడంతో తేయాకు రెండో పంట పూర్తిగా దెబ్బతిన్నది. తేయాకును కోసే కూలీలు ఆందోళనలు చేస్తుండడంతో స్థానిక టీ కంపెనీలన్నీ మూతపడ్డాయి. ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి.
దీంతో సాధారణ కిలోకు రూ.ఐదు వేల ధర ఉండే డార్జిలింగ్ టీ పొడి ధర ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.20 లక్షలు పలుకుతోంది ! మరికొంతకాలం అయితే అసలు టీపొడే దొరకని పరిస్థితి ఏర్పడుతుందని తేయాకు ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అసోం తేయాకుకన్నా డార్జిలింగ్లో పండే తేయాకు ప్రత్యేకమైనది, భిన్నమైనది. దీనికి ప్రత్యేకమైన రుచి, వాసన ఉంటుంది. అందుకనే అసోం టీ పొడి కిలో 130 రూపాయలు పలికితే డార్జిలింగ్ టీ పొడి ధర ఐదువేల రూపాయల వరకు పలుకుతుంది.