మాజీ జవాను కుటుంబానికి భారీ పరిహారం
ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ) పథకం అమల్లో లోటుపాట్లపై మనస్తాపం చెంది, ఆత్మహత్య చేసుకున్న మాజీ జవాను రాంకింషన్ గ్రెవాల్(70) కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది. కోటి రూపాయలను నష్టపరిహారంగా అందించనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. ఈ పరిహారంతో పాటు, కుటుంబానికి ఉద్యోగ హామీని కూడా ఇస్తున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీతో పాటు, ఇటు హర్యానా ప్రభుత్వం కూడా ఈ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించనున్నట్టు వెల్లడించింది.
ఓఆర్ఓపీ పథకం అమల్లో లోపాలను సత్వరమే సరిచేయాలని రక్షణ మంత్రిని కలసి వివరించేందుకు ముగ్గురు మాజీ సైనికులతో వచ్చిన రాంకిషన్ నిన్న ఆత్మహత్యకు పాల్పడటం దేశరాజధానిలో సంచలనం సృష్టించింది. రాంకిషన్ అంత్యక్రియలు నేడు(గురువారం) హర్యానాలోని అతని గ్రామంలో జరిగాయి. ఈ అంత్యక్రియల్లో కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.