
'అవమానకరంగా భావిస్తున్నా'
అబుదాబి: తమ దేశంలో పెట్టుబడి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అవకాశాల గడ్డగా పేరుగా గాంచిన ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. అబుదాబిలో యూఈఏ, ప్రవాస భారత పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తమది ఒకటని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడులకు అమితావకాశాలు ఉన్నాయని తెలిపారు. తక్కువ వ్యయంతో ఏడేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మించాలనుకుంటున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించకపోవడంతో పెట్టుబడులు మందగించాయని విమర్శించారు. ఇండియా శక్తి, యూఏఈ సామర్థ్యంతో భవిష్యత్ లో ఆసియా ముఖచిత్రం మారనుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
34 ఏళ్లుగా భారత ప్రధానులెవరూ యూఏఈలో పర్యటించకపోవడం అవమానకరంగా భావిస్తున్నానని చెప్పారు. 'భారత్, యూఏఈ మధ్య ప్రతిరోజూ అనేక విమానాలు తిరుగుతున్నాయి. భారత ప్రధాని ఇక్కడకు రావడానికి 34 ఏళ్లు పట్టింది' అని మోదీ పేర్కొన్నారు.