
క్లూతో కొట్టారు.. నేరస్తులను పట్టారు!
న్యూఢిల్లీ: నేరస్తుల పేర్లు తెలియవు. ఎక్కడుంటారో, ఏంచేస్తుంటారో తెలియదు, ఎలాంటి ఆధారాలు లేవు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పోలీసులైతే ఏం చేస్తారు ? సాక్ష్యాధారాలు లేవని కేసును ముసేస్తారు. కానీ ఢిల్లీ పోలీసులు అలా అనుకోలేదు. అత్యాచారానికి గురైన బాధితురాలు ఇచ్చిన చిన్న క్లూతో నేరస్తులను పట్టుకున్నారు. ఈ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే, నిరాశ్రయురాలైన ఓ అమ్మాయి(15) ఢిల్లీ మెట్రో మయూర్ విహార్ ఫేజ్-1 స్టేషన్ ప్రాతంలో ఉంటోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఐదుగురు మైనర్లు డిసెంబరు 29న ఆమెపై ఆత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలికి జనవరి 3న సృహ వచ్చింది. దుండగుల గురించి ఆమె ఏమీ చెప్పలేకపోయింది. కేవలం ఆ ఐదుగురిలో మింటూ అనే పేరు మాత్రమే ఆమెకు గుర్తుంది. పోలీసులు వెంటనే ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. నేరస్తులను పట్టుకునే మార్గాలేమీ లేకపోవడంతో కేవలం పేరు ఆధారంగా పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి గాలింపు చేపట్టారు. చివరికి రెండు డజన్ల మింటూలు దొరికారు. కానీ ఇంతలోనే పోలీసులకు మరో షాక్ తగిలింది. పట్టుకున్న 24 మందిలో మింటూ లేడని ఫొటోలను పరిశీలించిన బాధితురాలు పోలీసులకు తేల్చిచెప్పింది. ఇంకొకరైతే కేసును ఇక్కడ వదిలేసేవారే. కానీ ఢిల్లీ పోలీసులు వదల్లేదు. చివరికి గాలింపు జరుపుతున్న ఏరియాలోనే ఆరుగురితో కూడిన చైన్స్నాచర్ల బృందం వాళ్ల కంటపడింది. తమదైన శైలిలో వారిని విచారించగా.. తానే మింటూనంటూ ఓ మైన్ర్ ఒప్పుకున్నాడు. పోలీసులు అతణ్ణి అరెస్టు చేసి పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందుతుల్లో ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు.