
వైభవంగా ఈదుల్ ఫితర్
న్యూఢిల్లీ: ఈదుల్ ఫితర్ వేడుకలు దేశవ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. మసీదులు, ప్రార్థనా మందిరాల వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు సమావేశమై పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మసీదులు ఈద్ ముబారక్ నినాదాలతో మార్మోగాయి. జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ హజ్రత్బల్ దర్గా వద్ద సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాతో సహా 60 వేల మందికి పైగా ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో అగ్రశ్రేణి వేర్పాటువాద నాయకుల్ని హౌస్ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కశ్మీర్లో కొన్ని చోట్ల భద్రతా సిబ్బందిపై రాళ్లు విసరడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక జమా మసీదు, ఫతేపూర్, హజ్రత్ నిజాముద్దీన్ మసీదుల వద్ద వందల సంఖ్యలో ప్రార్థనలు చేశారు. శ్రీనగర్లో ఈద్గా మసీదులో 50 వేల మంది ప్రార్థనలు చేశారు పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల్లోనూ పండుగను ఘనంగా జరుపుకొన్నారు.
మోదీ ఈద్, రథయాత్ర శుభాకాంక్షలు
ఈదుల్ ఫితర్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సౌభ్రాతృత్వం, సామరస్యాలకు ప్రతీక అని ట్వీటర్లో పేర్కొన్నారు. ఈ పండుగ దేశంలో ఐక్యతను, శాంతి, సామరస్యాలను పెంపొందించాలని, ప్రతిఒక్కరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. పూరి జగన్నాథ స్వామి 138వ రథయాత్ర సందర్భంగా కూడా ప్రధాని ప్రజలకు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. 400 ఏళ్ల పురాతన ఆలయంలో తాను పూజలు చేసిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా నవకళేబర్ రథయాత్ర, ఈద్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, అక్ష య్ కుమార్, అజయ్ దేవగన్ తదితరులు సోషల్మీడియా ద్వారా అభిమానులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.