
నేలపై కూర్చుంటాను. ప్రత్యేక ఏర్పాట్లొద్దు: సీఎం
రాష్ట్రంలో పర్యటనలు, తనిఖీలు, పథకాల ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు తన కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని..
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పేరుకు యోగి అయినా విలాసవంతంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమరుడైన ఓ బీఎస్ఎఫ్ జవాను కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం యోగి వెళ్లిన సందర్భంగా ఆయన ఇంటిలో ఏసీ, సోఫా, కార్పెట్లను అధికారులు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిచ్చింది.
వారి ఇంటి నుంచి సీఎం యోగి వెళ్లిపోగానే వాటిని అధికారులు తొలగించి, తమతోపాటు తీసుకెళ్లారు. సీఎం యోగి ఎక్కడికి వెళ్లినా ఇదేవిధంగా అధికారులు విలాసవంతమైన ఏర్పాట్లు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆసక్తికరమైన ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో పర్యటనలు, తనిఖీలు, పథకాల ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు తన కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 'నాగురించి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దు. మామూలు నేల మీద కూర్చునే వ్యక్తుల్లో నేను ఒకడిని' అని సీఎం యోగి అన్నారు.