
బంద్ ఉద్రిక్తం.. పరస్పరం దాడులు
కోల్కతా: దేశంలో పది కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు కొన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతుండగా పశ్చిమబెంగాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. సామాన్య జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వామపక్ష కార్యకర్తల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకొని ఘర్షణకు దారి తీసింది. తమ బంద్కు స్పందించకుండా దుకాణాలు తెరిచి ఉంచారనే ఆగ్రహంతో బలవంతంగా వామపక్ష నేతలు వాటిని మూయిస్తుండగా తృణమూల్ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
దీంతో ఇరు వర్గీయుల మధ్య రాళ్ల వర్షం కురిసింది. దొరికిన వారిని దొరికినట్లు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఓ వ్యక్తినైతే పూర్తిగా కిందపడేసి రెండుకర్రలతో పశువును కొట్టినట్లు కొట్టారు. ఇక రహదారులు ఎక్కడికక్కడ స్తంభించాయి. కొన్ని రైళ్లు మాత్రం తిరుగుతున్నాయి. వాటిని కూడా కార్మికులు అడ్డుకున్నారు. తమకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఖండిస్తూ బుధవారం పది కార్మిక సంఘాలు దాడులకు దిగిన విషయం తెలిసిందే. విమాన సర్వీసులు కూడా అంతంత మాత్రంగానే నడుపుతున్నారు.