
భారత్ను రెచ్చగొడుతూ పాక్ రాయబారి వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: భారత్లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కశ్మీర్ విషయమై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విముక్తికి తమ మద్దతు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం (ఆగష్టు 14న) పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయంలో జెండా ఎగురవేసి ఆయన ప్రసంగించారు.
'ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని కశ్మీర్ విముక్తికి అంకితం చేస్తున్నాం. జమ్ముకశ్మీర్ ప్రజల త్యాగాలు విజయవంతమవుతాయని మేం నమ్మకంగా ఉన్నాం' అని బాసిత్ పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో నెలకొన్న అశాంతి విషయమై భారత్-పాక్ సంబంధాలు ఉప్పు-నిప్పులా మారిన సంగతి తెలిసిందే. ఈ సంబంధాలను మరింత దెబ్బతీసేలా.. భారత్ను మరింత రెచ్చగొట్టేలా బాసిత్ వ్యాఖ్యలు చేశారు.
'కశ్మీర్కు విముక్తి దొరికేవరకూ స్వాతంత్ర్య పోరాటం కొనసాగుతుంది. కశ్మీర్ ప్రజల త్యాగాలు వృథా కాబోవు' అని బాసిత్ అన్నారు. కశ్మీర్ అంశంపై చర్చలకు పాకిస్థాన్ చేసిన ప్రతిపాదనను భారత్ తిరస్కరించిన నేపథ్యంలో బాసిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.