
సీఎంకు రెండు బంగ్లాలు ఎందుకు?
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండు ప్రభుత్వ బంగ్లాలను తన వద్ద ఉంచుకున్నారని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు.
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండు ప్రభుత్వ బంగ్లాలను తన వద్ద ఉంచుకున్నారని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో నితీష్.. పట్నాలోని అధికార నివాసం అన్నె మార్గ్ 1 బంగ్లాకు మారారని, అయితే రెండేళ్ల క్రితం మాజీ సీఎం హోదాలో ఆయనకు కేటాయించిన బంగ్లాను ఇప్పటికీ ఖాళీ చేయలేదని చెప్పారు. నితీష్ అధికార బంగ్లాతో పాటు రెండేళ్ల క్రితం కేటాయించిన బంగ్లాను కూడా అంటిపెట్టుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఒకేసమయంలో రెండు బంగ్లాలను పొందరాదని, సర్క్యులర్ రోడ్డులోని 7 నెంబర్ బంగ్లాను నితీష్ ఖాళీ చేయాలని సుశీల్ డిమాండ్ చేశారు.
సర్క్యులర్ రోడ్డు 7 బంగ్లా మరమ్మత్తుల కోసం నితీష్ కోట్లాది రూపాయల డబ్బును వృథా చేశారని సుశీల్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రులకు నివాసాల కేటాయింపులు, వాటికి మరమ్మత్తుల విషయంలో నితీష్ ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. 2014 మేలో నితీష్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2015 ఫిబ్రవరిలో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ఈ మధ్యకాలంలో జీతన్ రామ్ మంఝీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గతేడాది జరిగిన బిహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఘనవిజయం సాధించడంతో నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.