తమ్ముడు ‘క్యూ’లో.. అక్క ఆత్మహత్య!
ముజఫర్నగర్: తను అనారోగ్యంతో ఉంది. ఇంతలోనే పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఉరుములేని పిడుగులా పడింది. నగదు మార్చుకోవడానికి తమ్ముడు బ్యాంకు ముందు క్యూలో నిలుచున్నాడు. అయినా కొత్త కరెన్సీ దొరకలేదు. దీంతో తన చికిత్సకు తగినంత కొత్త కరెన్సీ దొరకదేమోనన్న బెంగతో ఓ యువతి (20) బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని షామ్లి జిల్లాలోని ముజఫర్నగర్లో జరిగింది.
తమ ఇంట్లో చెల్లుబాటు అయ్యే కరెన్సీ లేదని మనస్తాపం చెందిన షబానా (20) ఆదివారం ఉరేసుకొని చనిపోయింది. ఆమె తమ్ముడు మొబిన్ బ్యాంకు వద్దకు నగదు మార్చుకోవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. రోజు మాదిరిగానే బ్యాంకు వద్ద క్యూలో నిలబడినా మొబిన్కు కొత్త కరెన్సీ దొరకలేదు. ఇంటికి వచ్చి చూస్తే అక్క ఆత్మహత్య చేసుకొని కనిపించింది. గతకొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న షబానా ఇక తనకు చికిత్సకు చెల్లుబాటు అయ్యే కరెన్సీ దొరకదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నదని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.