Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

High Court orders Nallapadu police in Singayya death incident1
ప్రయాణికులు.. ప్రమాదానికి బాధ్యులా?

సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాధారణంగా ఆ వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారే గానీ కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు నమోదు చేయరని గుర్తు చేసింది.ప్రమాదానికి కారులో ఉన్న వారిని ఎలా బాధ్యులను చేస్తారని సూటిగా ప్రశ్నించింది. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయని, కుంభమేళా లాంటి చోట్ల కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సింగయ్య మృతికి సంబంధించి నమోదైన కేసులో వైఎస్‌ జగన్‌­, ఇతర నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజిని తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ కేసు కొట్టివేయాలంటూ పిటిషన్లుసింగయ్య మృతికి సంబంధించి నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తేలేంతవరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని తమ పిటిషన్లలో హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సుబ్రహ్మణ్య శ్రీరాం, చిత్తరవు రఘు, న్యాయవాదులు యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, ఆర్‌.యల్లారెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎస్పీ మొదట వేరే కారు అని చెప్పారు.. ఆ తర్వాత మాట మార్చారు... మొదట పొన్నవోలు వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రమేనని, సింగయ్య మృతితో వీరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వాస్తవానికి ప్రమాదం జరిగిన రోజు గుంటూరు ఎస్పీ స్పందిస్తూ ఏపీ 26 సీఈ 0001 నంబర్‌ కారు ప్రమాదానికి కారణమని స్వయంగా చెప్పారని పొన్నవోలు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మూడు రోజుల తర్వాత అదే ఎస్పీ మాట మార్చారన్నారు. ప్రమాదానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు ప్రయాణించిన వాహనమే కారణమంటూ మీడియా ముఖంగా చెప్పారని నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ప్రమాదానికి వాహనంలో కూర్చున్న వ్యక్తులను ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. వాహనంలో ఉన్న వారిని ఎలా విచారిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. పిటిషనర్లు ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు. ప్రమాదం తరువాత సింగయ్యను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారన్నారు. ఓ వ్యక్తి మరణానికి కారణమై ఇప్పుడు ఏమీ జరగలేదంటూ చెబుతున్నారన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాహనంలో ప్రయాణిస్తున్న వారిని ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుంది..? వేల మంది సమూహంగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. కుంభమేళా లాంటి భారీ జన సమూహాలు ఉన్న చోట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహన ప్రమాదంలో.. ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుందని విస్మయం వ్యక్తం చేశారు. అంత భారీ జనసమూహంలోని ఓ వ్యక్తి వాహనం కింద పడితే.. ఆ వ్యక్తిని అలా చావనివ్వండి అని ఎవరైనా పక్కన పడేసి వెళ్లిపోరుగా? అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందా? అని పోలీసులను సూటిగా ప్రశ్నించారు. దీనిపై అన్ని ఆధారాలున్నాయని, సమయం ఇస్తే వాటిని కోర్టు ముందుంచుతామని ఏజీ దమ్మాలపాటి నివేదించడంతో.. విచారణ మంగళవారానికి వాయిదా వేస్తామని, అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఈ సమయంలో పొన్నవోలు స్పందిస్తూ అప్పటి వరకు స్టే ఇవ్వాలని కోరగా, ఆ అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ భద్రతపై పోలీసుల నిర్లక్ష్యంవైఎస్‌ జగన్‌ తరఫున శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఒక మాజీ సీఎంకార్యక్రమంలో భద్రతాపరంగా తీవ్ర లోపాలున్నా పోలీసులు కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదని న్యాయస్థానానికి నివేదించారు. దీనిపై తాము న్యాయపరంగా పోరాటం చేస్తున్నామన్నారు. మొదట బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106 కింద పెట్టిన కేసును పోలీసులు, తర్వాత 105 (కల్పబుల్‌ హోమిసైడ్‌) కిందకు మార్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. వైఎస్‌ జగన్‌ భద్రత, జనసమూహాలను నియంత్రించే విషయంలో పోలీసులు తీవ్ర ఉదాశీనత ప్రదర్శిస్తున్నారన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘ప్రభుత్వాన్ని పూర్తి ఆధారాలు కోర్టు ముందుంచనివ్వండి... ఈలోపు మీకు కావాల్సింది రక్షణే కదా? మీకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిస్తా..’ అని తెలిపారు. అనంతరం శ్రీరామ్‌ స్పందిస్తూ.. తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ, అప్పటివరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు.

Telangana High Court cancels land allotment to International Arbitration Centre in Hyderabad2
ఐఏఎంసీకి భూకేటాయింపు చెల్లదు..

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ)కు 2021లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూకేటాయింపును హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌ సర్వే నంబర్‌83/1లో 3.70 ఎకరాలను కేటాయిస్తూ జారీ చేసిన జీవో 126ను జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ కె.సుజనా ధర్మాసనం కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఐఏఎంసీ ఒప్పందంలో భాగంగా ట్రస్టు బోర్డుకు ఆస్తులను విక్రయించే అధికా రం ఉంటుందంటూ ఒక ముఖ్యమైన నిబంధన క్లాజ్‌ 6 (డీ)ను చేర్చడాన్ని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు బట్టింది.తెలంగాణ భూ రెవెన్యూ చట్టం 1317 ఫస్లీ, ప్రైవేట్‌ సంస్థలకు ఇచ్చిన భూమికి మార్కెట్‌ విలువ చెల్లింపును తప్పనిసరి చేసే ఏపీ ఏలియనేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ ల్యాండ్స్‌ రూల్స్‌–1975ను ఈ భూ కేటా యింపు ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. ఐఏఎంసీ చట్ట బద్ధమైన సంస్థగా కంపెనీల చట్టం కింద నమోదు కాలేదని.. అందువల్ల ఉచిత భూమికి అనర్హమైనదిగా పరిగణించాల్సిందేనని తేల్చిచెప్పింది. గత నాలుగేళ్లలో ఐఏఎంసీ పనితీరు ఆశాజనకంగా లేదంటూ సంస్థ భవి ష్యత్తుపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.ఈ ఏడాది జనవరి 29 నాటికి 15 ఆర్బిట్రేషన్‌ కేసులనే ఐఏఎంసీ నిర్వహించిందని (అందులో 11 అనుకూలంగా)... 57 మధ్యవర్తిత్వ కేసుల్లో 17 మాత్రమే అనుకూలంగా నిర్వహించిందని హైకోర్టు అభిప్రాయ పడింది. అయితే ఐఏఎంసీకి నిర్వహణ ఖర్చుల నిమి త్తం ఏటా రూ. 3 కోట్ల మేర చెల్లింపులకు అనుమ తిస్తూ జారీ చేసిన జీవోలు 76, 365లను మాత్రం ధర్మాసనం సమర్థించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా ఐఏఎంసీ లాంటి కొత్త సంస్థకు ఆర్థిక సాయం అందించినా.. ఓ ప్రైవేట్‌ సంస్థకు అది శాశ్వతంగా ఉండ కూడదని హితవు పలికింది. ఐదేళ్ల తర్వాత ఆర్థిక సాయాన్ని కొనసాగించాలా వద్దా? అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని తీర్పులో సూచించింది.ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఇవీ.. ఐఏఎంసీ ట్రస్టుకు అత్యంత విలువైన ప్రాంతంలో రూ. వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కేటా యిస్తూ 2021 డిసెంబర్‌ 26న రాష్ట్ర ప్రభుత్వం జీవో 126 విడుదల చేసింది. అలాగే నిర్వహణ ఖర్చుల కింద ఏటా రూ. 3 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు జీవోలు 76, 365లను, కేసుల కేటాయింపునకు జీవో 6ను జారీ చేసింది. ఏఐఎంసీని 2021 డిసెంబర్‌ 18న నాటి సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. అయితే ఆ జీవోలను కొట్టేసి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకొనేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాదులు ఎ.వెంకట్రామిరెడ్డి, వ్యక్తిగత హోదాలో కోటి రఘునాథరావు వేర్వేరుగా 2023లో ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్‌)ను దాఖలు చేశారు.ఓ ప్రైవేట్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌కు అత్యంత విలువ చేసే భూమిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. ఇది తెలంగాణ అర్బన్‌ ఏరియాస్‌ (డెవలప్‌మెంట్‌) చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఐఏఎంసీకి నిర్వహణ ఖర్చుల కింద ఏటా రూ. 3 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమే అవుతుందని.. ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. ఈ పిల్‌లపై జనవరిలో వాదనలు ముగించిన జసిŠట్‌స్‌ కె.లక్ష్మణ్, కె.సుజన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.వాదనలు సాగాయిలా..పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘రూ. 350 కోట్లకుపైగా విలువైన 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఐఏఎంసీకి కేటాయించడం రాష్ట్రానికి తీరని నష్టం. ఓ ప్రైవేట్‌ ట్రస్ట్‌కు నిబంధనలకు విరుద్ధంగా నిధులు కేటాయించడమే కాకుండా నిర్వహణ పేరిట ఏటా రూ. 3 కోట్ల నిధులు కేటాయించడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. నిబంధనలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రైవేట్‌సంస్థకు భూకేటాయింపు జరిపారు’ అని పేర్కొన్నారు. ఐఏఎంసీ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రజాప్రయోజనాల కోసమే ప్రభుత్వం భూమి, నిధులు ఇచ్చిందన్నారు.ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ ‘ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే పలు అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కారానికి దోహదపడుతుంది. ఇలాంటి వివాదాలు కేవలం న్యాయస్థానాల్లోనే కాకుండా బయట కూడా చేసుకోవచ్చని న్యాయస్థానాలే చెబుతున్నాయి. ఐఏఎంసీతో వివాదాలు పరిష్కారమైతే కోర్టులపైనా భారం తగ్గుతుంది. ఇందులో ప్రజాహితం ఉన్నందునే ప్రభుత్వం భూమి, నిధులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. ఐఏఎంసీ ట్రస్ట్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయశాఖ మంత్రితోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ట్రస్టీలుగా ఉన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయీ దుర్వినియోగం కాలేదు’ అని నివేదించారు.ఐఏఎంసీ తనను తాను నిలబెట్టుకోలేకపోయిందన్న ధర్మాసనం‘ప్రభుత్వాల నుంచి నిరంతర ఆర్థిక సాయం పొందుతున్నప్పటికీ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆల్టర్నేటివ్‌ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ (ఐసీఏడీఆర్‌) తన లక్ష్యాలను నెరవేర్చడంలో ఎలా విఫలమైందో మేము ఎత్తి చూపాలనుకుంటున్నాం. దేశంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి 1995లో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఐసీఏడీఆర్‌ ఒక రిజిస్టర్డ్‌ సొసైటీగా ఏర్పడింది. దాని ప్రారంభం నుంచి ఐసీఏడీఆర్‌ 49 మధ్యవర్తిత్వ కేసులనే స్వీకరించిందని ఉన్నతస్థాయి కమిటీ నివేదిక పేర్కొంది.ఆర్థిక సహాయం ఉన్నా కేసుల పరిష్కారం నామమాత్రంగానే ఉన్నందున ఐసీఏడీఆర్‌ను స్వాధీనం చేసుకోవాలని.. దానికి మంజూరు చేసిన శాశ్వత లీజును రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఐఏఎంసీ అలా మారదని మేము ఆశిస్తున్నాము. అయితే మూడేళ్లుగా ఏటా రూ. 3 కోట్ల ఆర్థిక సాయం, ఉచిత కార్యాలయ స్థలాన్ని అందించినా ఐఏఎంసీ తనను తాను నిలబెట్టుకోలేకపోయింది. ప్రభుత్వం ఆశించిన మేరకు భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకునే సంకేతాలను చూపించలేకపోయింది. ఐఏఎంసీ ప్రారంభానికి మద్దతు సమర్థనీయమే.కానీ అలాంటి సంస్థలకు నిరంతర, శాశ్వత ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చు. ఐఏఎంసీ పనితీరును ఏటా సమీక్షించి, దాని ఖాతాలను తెలంగాణ ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ (ఆడిట్‌) లేదా మరే ఇతర సమర్థ అధికారి ద్వారా ఆడిట్‌ చేయించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. గత ఒప్పందం మేరకు ఐదేళ్ల తర్వాత ఐఏఎంసీ పనితీరుకు లోబడి నిధుల విడుదల ఉండేలా ప్రభుత్వం చూసుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొంది. నిధుల కేటాయింపునకు పనితీరే కొలమానం..‘ప్రభుత్వ వివాదాలన్నీ ఐఏఎంసీలోనే పరిష్కరించుకునేలా ఇచ్చిన జీవో సమర్థనీయమే అయినా.. పలు సూచనలు చేయాల్సి ఉంది. రూ. 3 కోట్లకుపైగా విలువైన అన్ని వివాదాలను ఐఏఎంసీకి మధ్యవర్తిత్వం కోసం సూచించాలనే ప్రభుత్వ నిర్ణయం విధానపరమైనది. అయితే ప్రజాధనంతో ఈ అంశం ముడిపడి ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కేసులను ఐఏఎంసీకి సూచించడం, దానికయ్యే ఖర్చులను పరిశీలించాల్సి ఉంటుంది. ఐఏఎంసీ ద్వారా మధ్యవర్తిత్వ ఖర్చు ఎక్కువగా ఉందని.. ఖజానాపై గణనీయమైన భారం పడుతున్నట్లు గురిస్తే ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవచ్చు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత పిల్‌లను పాక్షికంగా అనుమతిస్తున్నాం’ అని ధర్మాసనం తెలిపింది.మధ్యవర్తిత్వాన్ని బలోపేతం చేయాలి..‘కేంద్ర న్యాయ శాఖ జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి దేశంలో సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ఐసీసీ కోర్టు, సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఐఏసీ), లండన్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ (ఎల్‌సీఐఏ), హాంకాంగ్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (హెచ్‌కెఐఏసీ)ల మాదిరిగానే మధ్యవర్తిత్వ సేవలను అందించే సంస్థలను స్థాపించాలని సిఫార్సు చేసింది.సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వ మద్దతు ప్రాముఖ్యతను వివరించింది. ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు సులభతరం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. మధ్యవర్తిత్వ సంస్థల నిర్వహణకు ప్రారంభ మూలధనం అవసరమని.. దాన్ని ప్రభుత్వం అందించవచ్చని పేర్కొంది. మధ్యవర్తిత్వ సంస్థలకు ప్రభుత్వాలు మద్దతివ్వడం సంతృప్తికరమే’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Recalling Chandrababu Manifesto launched across the state3
బాబు బురిడీ ‘రీకాలింగ్‌’

సాక్షి నెట్‌వర్క్‌: ఎన్నికల సమయంలో అనేక హామీ­లిచ్చి, అధికారం చేపట్టాక ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ‘రీకాలింగ్‌ చంద్ర­బాబూస్‌ మేనిఫెస్టో’ (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ...) కార్య­క్రమాన్ని శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన మేరకు తొలి దశలో జిల్లా స్థాయిల్లో ఏర్పాటుచేసిన సమావే­శాలకు విశేష స్పందన లభించింది. ‘రీకాలింగ్‌ చంద్ర­బాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమం పోస్టర్లను, క్యూఆర్‌ కోడ్‌లను నాయ­కులు విడుదల చేశారు. చంద్రబాబు ఎన్నికల సమ­యంలో ‘బాబు ష్యూరిటీ–­భవిష్యత్‌ గ్యారెంటీ’ పేరుతో కుటుంబాల వారీగా వర్తించే పథకాల పేర్లు పేర్కొంటూ ఇచ్చిన బాండ్లను చూపించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కలిగిన లబ్ధి, చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమం చేపడతా­మని ప్రకటించారు. చంద్ర­బాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం సాగిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయ­కర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐదు వారా­లపాటు జరిగే ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని గ్రామ, గ్రామాన విజ­యంతం చేసేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబుతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: సజ్జల రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని వైఎస్సార్‌­సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా బుక్కరా­యసముద్రంలో వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజ­క­వర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ అధ్యక్షతన నిర్వహించిన వైఎస్సార్‌సీపీ కార్యాల­యం ప్రారంభోత్సవం, ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లా­డుతూ సీఎం చంద్రబాబు దుర్మార్గం, మోసాలు, అన్యాయాలు, దౌర్జన్యాలతో రికార్డు సాధించార­న్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఏడాది పాల­నను గిన్నిస్‌బుక్‌ రికార్డుల్లో ఎక్కించవచ్చన్నారు. చంద్ర­బాబు మోసాలను ప్రజలకు గుర్తు చేసేందుకే ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు పెడితే టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీ అనుకూల సర్వే సంస్థలే చెబుతున్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు బాండ్లు చూపించి ఏం చేశారో అడుగుతాం: బొత్స ‘ఇదిగో చంద్రబాబు మేనిఫెస్టో. ఇవిగో ఆయనిచ్చిన బాండ్లు అని ప్రజలకు చూపిస్తాం. అధికారంలోకి వచ్చి ఏడాదైంది. చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని అడుగుతాం. చంద్రబాబు టక్కుటమార విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదు.’ అని శాసనమండలిలో విపక్ష నేత, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ చెప్పారు. కాకినాడలో ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం క్యూఆర్‌ కోడ్‌ను బొత్స, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు విడుదల చేశారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో ఐదు వారాలపాటు నిర్వహించనున్న ‘రీకాలింగ్‌ చంద్ర­బాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులందరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ‘రీకాలింగ్‌ చంద్ర­బాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం రూరల్‌ కంతేరులో బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు: పెద్దిరెడ్డి‘చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంత­కైనా దిగజారుతారు. ఎన్ని అబద్ధపు హామీలైనా గుప్పి­స్తారు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచడానికి సైతం వెనకాడరు.’ అని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినే­టర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ­చంద్రారెడ్డి విమర్శించారు. తిరుపతిలో ‘రీకాలింగ్‌ చంద్ర­బాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్ర­మాన్ని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, తిరుపతి ఎంపీ మద్దిల గురు­మూర్తితో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న పథకాల కంటే ఎక్కువగా ఇస్తానని హామీలు ఇచ్చిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్న ప్రజాద్రోహి అని మండిపడ్డారు. భూమన కరుణాకర­రెడ్డి మాట్లాడుతూ తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంత చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి ప్రజలను వంచించి ఓట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలోనూ ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  Rasi Phalalu: Daily Horoscope On 28-06-2025 In Telugu4
ఈ రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.తదియ ప.12.22 వరకు తదుపరి చవితి, నక్షత్రం: పుష్యమి ఉ.9.30 వరకు తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.10.22 నుండి 11.59 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.31 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: రా.10.20 నుండి 11.55 వరకుసూర్యోదయం : 5.31సూర్యాస్తమయం : 6.34రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితిలో ఇబ్బంది. రుణయత్నాలు. శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.వృషభం: కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.మిథునం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.కర్కాటకం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.సింహం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. భూవివాదాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.కన్య: కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఆప్తుల నుండి పిలుపు రావచ్చు. వాహనాలు కొంటారు. ఆస్తులు సమకూరతాయి. సోదరుల నుండి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.తుల: ఏ పని చేపట్టినా విజయమే. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. ఆరి<క పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.వృశ్చికం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు: బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో కలహాలు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉండవచ్చు.మకరం: ఇంతకాలం శ్రమ ఫలిస్తుంది. సన్నిహితులతో సఖ్యత. చర్చలు సఫలం. దూరపు బంధువుల కలయిక. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.కుంభం: సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుండి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.మీనం: కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. బంధువులతో విరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

India Womens first T20 against England today5
శుభారంభం లక్ష్యంగా...

నాటింగ్‌హామ్‌: భారత పురుషుల క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ ఆడుతుండగా... మహిళల క్రికెట్‌ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమవుతోంది. 5 టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్‌ జరగనుంది. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌ వేదికగా టి20 వరల్డ్‌ కప్‌ జరగనుండగా... దానికి ఈ సిరీస్‌ సన్నాహకంగా ఉపయోగపడనుంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశలోనే వెనుదిరిగిన టీమిండియా... లోపాలను సవరించుకొని మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ పర్యటన దోహద పడనుంది. ఫామ్‌ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమైన యువ ఓపెనర్‌ షఫాలీ వర్మ జట్టులోకి పునరాగమనం చేయడంతో భారత బలం పెరిగింది. ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా... ఈ ఏడాది భారత్‌లోనే జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనే టీమిండియాలోనూ చోటు దక్కించుకోవాలని షఫాలీ భావిస్తోంది. ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ బౌలర్‌ శ్రీచరణి, క్రాంతి గౌడ్, సయాలీ వంటి పలువురు యువ ప్లేయర్లను పరీక్షించనున్నారు. ఇంగ్లండ్‌ పిచ్‌లపై కొత్త ఆటగాళ్లకు అవకాశాలిచ్చి... వారిని వచ్చే ఏడాది మెగా టోర్నీ కోసం సంసిద్ధం చేయాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఈ ఏడాది భారత మహిళల జట్టుకు ఇదే తొలి టి20 సిరీస్‌ కాగా... హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన సిరీస్‌లకు ముందు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) జట్టుతో జరిగిన రెండు టూర్‌ మ్యాచ్‌ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది. వన్డే, టి20 ఫార్మాట్‌లలో జరిగిన ఈ మ్యాచ్‌ల్లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేసినా... గెలుపుగీత దాటలేకపోయింది. సీనియర్లపైనే భారం సుదీర్ఘ పర్యాటనలో టీమిండియా శుభారంభం చేయాలంటే... సీనియర్‌ ప్లేయర్లు రాణించాల్సిన అవసరముంది. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌కౌర్, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధానతో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌ సత్తా చాటితేనే టీమిండియా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు రెండోసారి టైటిల్‌ అందించిన హర్మన్‌ప్రీత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బ్యాటర్‌గా ఇటు సారథిగా ఆమె వాటిని అందుకుంటుందా చూడాలి.ఇక ఈ ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్, వచ్చే ఏడాది టి20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో షఫాలీ వర్మ మునుపటి మెరుపులు మెరిపించాల్సిన అవసరముంది. ఓపెనర్‌గా వచ్చిన అవకాశాలను సద్వినియోగ పర్చుకోలేకపోయిన ఉమా ఛెత్రి స్థానంలో షఫాలీ తుది జట్టులోకి రావడం ఖాయమే. పేస్‌ ఆల్‌రౌండర్‌ అమన్‌జ్యోత్‌ కౌర్, స్పిన్‌ ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. 2023 ఫిబ్రవరి తర్వాత తొలిసారి జాతీయ టి20 జట్టులో చోటు దక్కించుకున్న స్నేహ్‌ రాణా... ఇటీవల డబ్ల్యూపీఎల్‌లో మెరుగైన ఆటతీరు కనబర్చింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ స్నేహ్‌ ఆకట్టుకుంది. సీనియర్‌ పేస్‌ బౌలర్లు రేణుక సింగ్, పూజ గాయాల కారణంగా ఈ పర్యటనకు అందుబాటులో లేకుండా పోవడంతో... ఇలాంటి సమయంలో యువ క్రీడాకారిణులు జట్టును గెలిపించాలని టీమ్‌ ఆశిస్తోంది. సొంతగడ్డపై బలంగా ఇంగ్లండ్‌.. మరోవైపు సీవర్‌ బ్రంట్‌ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్‌ జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై సిరీస్‌ ఆడనుండటం ఆ జట్టుకు అదనపు ప్రయోజనం. అమీ జోన్స్, టామీ బ్యూమౌంట్, డానీ వ్యాట్, సోఫీ వంటి అనుభవం గల ప్లేయర్లు ఆ జట్టుకు ప్రధాన బలం కానున్నారు. మరోవైపు ఇస్సీ వాంగ్, అలీస్‌ కాప్సీ, సోఫియా డాంక్లీ వంటి యువ క్రీడాకారిణిలు కూడా తమదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి సుదీర్ఘ పర్యటనలో ఎవరు బోణీ కొడతారో చూడాలి!200ఈరోజు ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌ అంతర్జాతీయ టి20ల్లో భారత్‌కు 200వ మ్యాచ్‌ కానుంది. ఇంగ్లండ్‌ (215), ఆస్ట్రేలియా (200) జట్ల తర్వాత 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్న మూడో జట్టుగా భారత్‌ నిలువనుంది. ఇప్పటి వరకు 199 టి20లు ఆడిన భారత్‌ 108 మ్యాచ్‌ల్లో నెగ్గి, 84 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆరు మ్యాచ్‌లు రద్దు కాగా, ఒక మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. 30 భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన టి20 మ్యాచ్‌లు. 8 మ్యాచ్‌ల్లో భారత్, 22 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలుపొందాయి.12 ఇంగ్లండ్‌ గడ్డపై ఇంగ్లండ్‌తో భారత్‌ ఆడిన టి20 మ్యాచ్‌లు. 4 మ్యాచ్‌ల్లో భారత్, 8 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించాయి.

Crypto is a new invention that is inherently confusing6
అక్రమ యుద్ధాయుధం... క్రిప్టో!

‘‘నేనేం బిట్‌ కాయిన్‌కు లేదా మరే ఇతర క్రిప్టో కరెన్సీలకు అభిమానిని కాదు. నియంత్రణ లేని క్రిప్టో ఆస్తుల వల్ల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతాయి.’’ 2019లో ఇదీ డోనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయం. కేంద్ర బ్యాంకులు, ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక నేరాల నిపు ణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనతో అప్పు డాయన ఏకీభవించారు. క్రిప్టో అనేది సాంకే తికమైన ఒక నూతన ఆవిష్కరణ. ఈ కరెన్సీకి ఎలాంటి వాస్తవిక విలువ, ప్రభుత్వాల గుర్తింపూ లేవు. నల్ల ధన నిరోధక చర్యలను ఇది దెబ్బతీస్తుంది.మారిన ట్రంప్‌ ధోరణి2025 వచ్చేసరికి పరిస్థితి మారింది. క్రిప్టో కరెన్సీ లాబీ నుంచి ఎన్నికల ప్రచారానికి లభించిన మద్దతు, తన కుటుంబానికి బహుమ తులుగా అందిన పెట్టుబడులు... ట్రంప్‌ అవగాహనను మార్చేశాయి. ఇటీవలే ఆయన తన నూతన అవగాహనతో ఒక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. ఒకప్పుడు తప్పనిసరి అవసరం అనుకున్న నియంత్ర ణలు ఒక్క కలం పోటుతో తునాతునకలు అయ్యాయి. ఆ తర్వాత, ట్రంప్‌ కుటుంబం క్రిప్టో వ్యాపారంలోకి ప్రవేశించింది. టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్న, తెరచాటు లావాదేవీలతో టెర్రరిస్టులకు నిధులను మళ్లిస్తున్న పాకిస్తాన్‌... స్వయంగా ఈ కుటుంబానికి ఒక వ్యాపార భాగస్వామిగా ఉంది. మరి అమెరికా నేతలే ప్రైవేటు కరెన్సీలు నడుపుతుంటే ఇండియా దాన్ని ఎలా భావించాలి? మాజీ ఖైదీలకు పునరావాసమా అన్నట్లు వారిని తన అధికారిక క్రిప్టో కౌన్సిళ్లకు వ్యూహాత్మక సలహాదారులుగా నియమించుకున్న దేశం గురించి ఎలాంటి అభిప్రాయానికి రావాలి? చాన్గ్ పెంగ్‌ ఝావో(చైనాలో పుట్టిన కెనడియన్‌) ‘బైనాన్స్’ కంపె నీకి మాజీ సీఈవో. మనీ లాండరింగ్‌ నేరాలకు పాల్పడినందుకు యూఎస్‌ అతడిని జైల్లో పెట్టింది. తర్వాత 430 కోట్ల డాలర్లు చెల్లించి సెటిల్మెంటు చేసుకున్నాడు. హమాస్‌ వంటి గ్రూపులకు నిధులు చేరవేసే అక్రమ లావాదేవీలకు బైనాన్స్‌ క్రిప్టో ఎక్స్‌ఛేంజ్‌ వీలుకల్పించింది. బైనాన్స్‌ గూడుపుఠాణీ బట్టబయలుతో ఝావో ఆర్థికంగా అంతమై ఉండాల్సింది. కానీ పాకిస్తాన్‌ అధికారిక ‘క్రిప్టో టాస్క్‌ ఫోర్స్‌’కు సలహాదారు అయ్యాడు. అలాగే జస్టిన్‌ సన్‌ (చైనా మూలాలున్న సెయింట్‌ కిట్స్‌ పౌరుడు) ట్రంప్‌ సంబంధిత ‘వరల్డ్‌ లిబర్టీ ఫైనాన్షియల్‌’లో 3 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాడు.ఈ వ్యాపారవేత్త మీద అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఒక సివిల్‌ ఫ్రాడ్‌ కేసులో దర్యాప్తు జరిపింది. అలాంటిది రాజకీయ విరాళాల సేకరణ కార్యక్రమాలకు ఇప్పుడతడు ముఖ్య అతిథి. అక్రమ లావాదేవీలకు మార్గంఅమెరికాలో పలుకుబడి సంపాదించుకోవడానికి క్రిప్టో లావా దేవీలు సరికొత్త మార్గంగా మారుతున్నాయి. అర్హత లేని వ్యక్తులకు, ధూర్త దేశాలకు, వాటి పాలకులకు ఇదో గేట్‌ వేగా మారినట్లు కన బడుతోంది. ఈ దారిలో వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జొరబడు తున్నారు. ఇలాంటి వారి పట్ల ఒకప్పుడు కఠినంగా ఉండే వ్యవస్థాగత నియంత్రణ నేడు బలహీనపడింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలపు షాడో ఫైనాన్సింగ్‌ (నియంత్రణ పరిధిలో ఉండని మధ్యవర్తుల ద్వారాబ్యాంకింగ్‌ కార్యకలాపాలు) కొత్త రూపంలో మళ్లీ తెర మీదకువచ్చింది. నేరుగా బ్యాంకుల ద్వారా కాకుండా, బ్లాక్‌ చెయిన్‌ టెక్నా లజీతో అక్రమ ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. శుద్ధ మైన పాలన అంటూ ప్రపంచ దేశాలకు ఉపన్యాసాలిచ్చే అగ్రరాజ్యా నికి ఇవేవీ పట్టవా? ఆర్థిక పారదర్శకతకు మంగళం పాడుతున్న క్రిప్టో టెక్నాలజీని ఇన్నోవేషన్‌ అంటూ రీబ్రాండింగ్‌ చేస్తున్నారు. భౌగోళిక రాజనీతి ఈ ముసుగులో కొత్త రూపం ధరిస్తోంది. విచ్చలవిడిగా ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను ఆమోదించడం వల్ల ప్రభుత్వాల ద్రవ్య సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది. దీని వల్ల అక్రమ లావాదేవీలు వ్యాప్తిచెందుతాయనీ, వర్ధమాన దేశాల్లో విదేశీ పెట్టుబడుల రాకపోకలపై నియంత్రణ బలహీనమై కరెన్సీ మార్కెట్లు ఒడుదొడుకులకు గురవు తాయనీ ఆందోళన చెందుతోంది. ఎల్‌ సాల్వడార్, నైజీరియా, లెబనాన్‌లలో ఇదే జరిగింది. ఈ దేశాలు క్రిప్టో కరెన్సీతో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాయి. ముఖ్యంగా టెర్రరిస్ట్‌ గ్రూపులు బ్యాంకుల కళ్లు గప్పేందుకు క్రిప్టో కరెన్సీలను వాడుకుంటున్నాయి. ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) పదేపదే ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. అయినా సరే పాకిస్తాన్‌కు ఈ సంస్థ క్లియరెన్స్ లభించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న ఇండియాకు ఇది నిజంగా ముప్పు. క్రిప్టోతో ‘ఇ–హవాలా’ వాడుకలోకి వచ్చింది. సరిహద్దు లతో సంబంధం లేకుండా రియల్‌ టైమ్‌లో గోప్యంగా నగదు బదిలీ చేయడం, ‘ఇ–హవాలా’ ద్వారా సాధ్యమవుతోంది. ఇండియా కఠినంగా ఉండాలి!సర్వసత్తాక, సార్వభౌమాధికారం గల ఏ దేశమైనా ప్రైవేటు కరెన్సీ చలామణీని ఏ రూపంలోనూ అంగీకరించకూడదు. భారతీయ రిజర్వు బ్యాంకు ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబించడం హర్షణీయం. క్రిప్టో కరెన్సీకి ససేమిరా అనడాన్ని పిరికితనం అనో, టెక్నోఫోబియా అనో భావించడం తగదు. వర్తమాన ప్రపంచంలో పెట్టుబడుల ప్రవాహాలను ఆయుధంగా వాడుకుని ఒక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడం సాధ్యమే. కాబట్టి ఇది జాతీయ భద్రతఅంశం. ఇలాంటి ఆర్థిక అస్త్రాల నుంచి దేశానికి రక్షణ కల్పించడానికే ఆర్బీఐ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే, ఆర్బీఐని లొంగదీయ డానికి తీవ్రంగా ఒత్తిడి వస్తోంది. ఫైనాన్షియల్‌ టెక్నాలజీలో ఇదో ఇన్నోవేషన్‌ అని చెబుతూ, దీనిపై ఆంక్షలను సడలించాలని ప్రపంచ క్రిప్టో వేదికలు కోరుతున్నాయి. క్రిప్టో కరెన్సీ లాభాల మీద ప్రస్తుతం ఆర్బీఐ అధిక పన్నులు విధిస్తోంది. దీనివల్ల క్రిప్టో పెట్టుబడులు విదే శాలకు తరలిపోకుండా నిరోధించాలని, ఇందుకోసం క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ తగ్గించాలని దేశీయంగా లాబీ జరుగుతోంది. పాత పద్ధతిలో భద్రతాపరమైన లోపాలు లేవా అంటూ వారు వాదిస్తు న్నారు. ఇందులో హేతుబద్ధత లేదు. ఇది ప్రమాదకరమైన వాదన. మరోవైపు అమెరికా కూడా దౌత్యమార్గాల్లో ఒత్తిడి చేస్తోంది.ఇండియా ఎట్టి పరిస్థితిలోనూ తలొగ్గకూడదు.క్రిప్టో కరెన్సీని అడ్డుకునేందుకు ఇండియా వ్యవస్థాగత నిబంధనలను రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలి. నిఘా, ఫోరెన్సిక్‌ దర్యాప్తు సామర్థ్యాలు, డిజిటల్‌ అస్త్రాలు సంసిద్ధం చేసుకోవాలి. క్రిప్టోను అడ్డు పెట్టుకుని ‘ట్రోజన్‌ హార్స్‌’ తరహాలోఆర్థిక వ్యవస్థ మీద దాడి జరిగితే, రక్షించుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉండాలి. ఆర్థిక రంగం భవిష్యత్తు అంతా డిజిటల్‌లోనే ఉండవచ్చు. అయినా ఈ రంగంలో మన ఉజ్జ్వల భవితకు అవసరమైన ప్రణాళికలు మన ప్రభుత్వమే రచించుకోవాలి. విదేశీ మార్కెట్ల పటాటోపం మీద ఆధారపడకూడదు. క్రిప్టో యుగంలో మన సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడమే ప్రధానం. సరిహద్దులు, సము ద్రాలు, గగనతలం, సైబర్‌ స్పేస్‌ రక్షణకు ఎలాంటి వ్యూహాత్మక చతురతను అవలంబిస్తామో అలాంటి తీరులోనే ఈ ఆర్థిక రక్షణ వ్యూహాలు ఉండాలి. క్రిప్టో ప్రస్తుతం ఒక భౌగోళిక రాజకీయ ఆయుధం. వ్యూహాత్మకంగా హాని చేయగల శక్తి దానికి ఉంది. దాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా మన ఆర్థిక వ్యవస్థను దుర్భేద్యంగానిర్మించుకోవాలి. - వ్యాసకర్త కార్పొరేట్‌ అడ్వైజర్, ‘ఫ్యామిలీ అండ్‌ ధంధా’ రచయిత (‘ద లైవ్‌మింట్‌’ సౌజన్యంతో)-శ్రీనాథ్‌ శ్రీధరన్‌

Shubhanshu Shukla looks at India from the International Space Station7
అంతరిక్షం నుంచి భారత్‌

న్యూఢిల్లీ: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా రాకేశ్‌ శర్మ రికార్డుకెక్కారు. 1984 ఏప్రిల్‌లో ఆయన అంతరిక్ష యాత్ర చేశారు. వారం రోజుల్లో భూమిపైకి తిరిగొచ్చారు. అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపిస్తోంది? అని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రశ్నించగా.. ‘సారే జహాసే అచ్ఛా’అటూ రాకేశ్‌ శర్మ బదులిచ్చారు. ఒకవేళ ఆయన ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లి ఉంటే అప్పట్లో చూడని ఎన్నో దృశ్యాలు తిలకించేవారు. ముఖ్యంగా రాత్రిపూట మన ఇండియా ఎలా కనిపిస్తోందో వెల్లడించేవారు. ప్రస్తుతం ఆ అవకాశం శుభాన్షు శుక్లా దక్కింది. ఆయన గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. 1984 నుంచి గమనిస్తే.. గత 41 ఏళ్లలో మన దేశం ఎంతగానో పురోగమించింది. పట్టణీకరణ విపరీతంగా పెరిగింది. రాత్రి సమయంలో చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాలు 2000 సంవత్సరం నుంచి విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అంతకంటే ముందున్న శాటిలైట్‌ కెమెరాలు ఆధునికమైనవి కావు. రాత్రి సమయంలో ఫొటోలను స్పష్టంగా చిత్రీకరించే సామర్థ్యం వాటికి లేదు. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్‌ శాటిలైట్‌ కెమెరాలు అంతరిక్షం నుంచి ప్రతి దేశాన్ని స్పష్టంగా మన కంటికి చూపగలుగుతున్నాయి. రాత్రిపూట దేదీప్యమానంగా వెలిగే విద్యుత్‌ దీపాలను బట్టి ఆయా ప్రాంతాల అభివృద్ధిని అంచనా వేయొచ్చు. దేశ ప్రగతితోపాటు సామాజిక, ఆర్థిక మార్పులను ఇవి కొంతవరకు ప్రతిబింబిస్తాయనడంలో సందేహం లేదు. విద్యుత్‌ కాంతి విస్తృతి ఇండియాలో పట్టణీకరణ, అభివృద్ధి ఏ మేరకు జరిగిందో తెలుసుకొనేందుకు శాటిలైట్‌ చిత్రాల ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎస్సీ) ఒక అధ్యయనం చేసింది. 2012 నుంచి 2021 వరకు రాత్రి సమయంలో అంతరిక్షం నుంచి ఉపగ్రహాలు చిత్రీకరించిన ఫొటోలు సేకరించి, విశ్లేషించింది. పదేళ్లలో దేశంలో రాత్రిపూట విద్యుత్‌ కాంతి(నైట్‌టైమ్‌ లైట్‌) విస్తృతి ఏకంగా 43 శాతం పెరిగినట్లు తేలింది. ముఖ్యంగా బిహార్, మణిపూర్, లద్ధాఖ్, కేరళలో ఈ విస్తృతి అధికంగా ఉండడం విశేషం. 2020 సంవత్సరంలో చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయింది. ఇందుకు కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి కారణమని చెబుతున్నారు. 1984 నాటి చిత్రాలను, ఇప్పటి చిత్రాలను గమనిస్తే 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాతే ఇండియాలో పట్టణీకరణ వేగం పుంజుకున్నట్లు స్పష్టమవుతోంది. అంతరిక్షం నుంచి భారత్‌ అద్భుతం ఇండియన్‌–అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలపాటు ఉండి, ఏప్రిల్‌లో భూమిపైకి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపిస్తోందని ఆమె చెప్పారు. హిమాలయ పర్వతాలపై నుంచి వెళ్లినప్పుడల్లా అందమైన చక్కటి ఫొటోలు తీసుకున్నామని తెలిపారు. గుజరాత్, ముంబైలో సౌందర్యవంతంగా కనిపించాయని వెల్లడించారు.

NATO allies agree to increase defense budgets8
నాటో ఆయుధ పూజ!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గత ఏలుబడి నుంచీ నాటో కూటమిపై తెస్తున్న ఒత్తిళ్లు ఫలించాయి. గత డెబ్బయి ఆరేళ్లుగా తమ భద్రతను అమెరికాకు అప్పగించి నిష్పూచీగా ఉంటున్న ఆ దేశాలు ఎట్టకేలకు రక్షణ బడ్జెట్‌లను పెంచాలని తీర్మానించాయి. ఈ వ్యయం ఏటా పెరుగుతూ వాటి జీడీపీల్లో 5 శాతానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఆ దేశాల వ్యయం 2 శాతం మాత్రమే. ఇన్నాళ్లూ ట్రంప్‌ను పెద్దగా లెక్కచేయని ఆ దేశాలు బుధవారం నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో శిఖరాగ్ర సదస్సు నిర్వహించి ఆయన్ను ఆకాశానికెత్తేశాయి. నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్‌ అయితే ‘డాడీ’ అంటూ సంబోధించి, కేవలం ఆయన వల్లనే ఇన్నాళ్లకు వాస్తవ పరిస్థితులను గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రశంసించారు. 12 దేశాలతో మొదలైన నాటో కూటమి ఇప్పుడు 32 సభ్య దేశాలతో కిక్కిరిసింది. అందరికందరూ అమెరికానూ, ట్రంప్‌నూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇరాన్‌కు తన స్థానమేమిటో తెలియజెప్పి ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం ఆపిన శాంతిదూతగా అభివర్ణించారు. ఈ ప్రహసనమంతా గమనిస్తే – నాటో దేశాల పరాధీనత, తమ ఆత్మగౌరవం పట్ల లేశమాత్రమైనా పట్టింపు లేని నిస్సహాయత కనబడతాయి. కానీ సదస్సు పొడవునా గంభీర వదనంతో ఉండిపోయిన ట్రంప్‌ ప్రశంసలకు పొంగిపోయినట్టు కనబడలేదు. రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు సాయం అందిస్తామని ఒక్క మాటైనా అనలేదు. తమ వంతుగా నాటో దేశాలు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రకటనలో రష్యా వల్ల దీర్ఘకాలిక బెడద ఉంటుందనీ, ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగుతుందనీ ఒక వాక్యంలో ప్రస్తావించి ఊరుకున్నారు. అంతకుమించితే ట్రంప్‌కు ఆగ్రహం కలుగుతుందన్న భయం ఉన్నట్టుంది. కూటమి తరఫున దృఢంగా నిలబడ తామని ట్రంప్‌ ఇచ్చిన హామీ ఒక్కటే కాస్త ఉపశమనం కలిగించే మాట.సమష్టి భద్రత కోసం రక్షణ వ్యయాన్ని జీడీపీలో 5 శాతానికి తీసుకెళ్లటం తమ ఉక్కుసంకల్పమని ఉమ్మడి ప్రకటన అభివర్ణించటం బాగానేవున్నా దాన్ని పరిపూర్తి చేయటానికి ఆ దేశాల ప్రజానీకం చాలా ‘త్యాగాలు’ చేయాల్సి ఉంటుంది. స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ అన్నట్టు పింఛన్లకూ, సంక్షేమ పథకాలకూ కత్తెరేయాలి. ఇది తమకు అసాధ్యమని కుండబద్దలు కొట్టారు. ప్రశంసల ప్రవాహంలో ఆయనొక్కడిదే భిన్నస్వరం. అందుకే సాంచెజ్‌పై ట్రంప్‌ విరుచుకు పడ్డారు. సుంకాలతో అంతకంతా వసూలు చేస్తానని హెచ్చరించారు. అటు తర్వాత బెల్జియం, స్లోవేకియాలు సాంచెజ్‌తో గొంతు కలిపాయి. ఈ మూడు దేశాలకు మాత్రమే కాదు... నాటోలోని ఇతర దేశాలకు సైతం జీడీపీల్లో 5 శాతం లక్ష్యాన్ని చేరటం ప్రాణాంతకం. కోతలపై, పొదుపు చర్యలపై పౌరుల నిరసనలు మిన్నంటుతాయి. నాటో దేశాలు ఇంత కాలమూ రక్షణ రంగం కన్నా వైద్య, విద్యారంగాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ట్రంప్‌కిచ్చిన హామీ నెరవేర్చాలంటే ఇకపై పాఠశాలల కన్నా ఆయు ధాలకే అధిక వ్యయం చేయాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో అమెరికాతోపాటు యూరప్‌ దేశాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. 1950 తర్వాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు లేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మున్ముందు ఇంకా పెరుగుతాయంటున్నారు. కానీ ఈ దేశాలు రక్షణ వ్యయం పెంచటానికి పర్యావరణ పరిరక్షణ నిధులకు సైతం కోతపెట్టాల్సి వస్తుంది.అసలు రష్యా రేపో మాపో దాడికి దిగుతుందని ఊదరగొడుతున్న నాటో... ఆ భయాందో ళనలకు ప్రాతిపదికేమిటో ఇంతవరకూ చెప్పలేదు. ఇన్ని దశాబ్దాల నాటో చరిత్రలో ఒక్కసారి కూడా రష్యా పూర్వరూపమైన సోవియెట్‌ ఏనాడూ దండెత్తిరాలేదు. అది 1956లో హంగెరీ, 1968లో చెకొస్లోవేకియా, 1979లో అఫ్గానిస్తాన్‌లలో దురాక్రమణలకు పూనుకున్నది. నాటోలో భాగమైన పశ్చిమ యూరప్‌ దేశాలపైగానీ... ఆ మాటకొస్తే ఫిన్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, యుగోస్లేవియా, ఆస్ట్రియా వంటి తటస్థ దేశాల జోలికిగానీ పోలేదు. పైగా అప్పట్లో పశ్చిమ జర్మనీ ఛాన్సలర్‌గా ఉన్న విలీ బ్రాంట్‌ సోవియెట్‌ ఛత్రఛాయలో ఉన్న తూర్పు యూరప్‌ దేశాలతో సఖ్యతకు ప్రయత్నించారు. అంతేకాదు... స్వీడన్‌ ప్రధాని ఓలోఫ్‌ పామే ఆధ్వర్యంలో 1982లో ఒక కమిషన్‌ నియమించారు. రెండు యూరప్‌లూ విన్యాసాల సమయంలో అవతలి వారికి ముందస్తు సమాచార మీయటం, నిరంతరం సంభాషించుకుంటూ పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవటం చేయాలని ఆ కమిషన్‌ సిఫార్సు చేసింది. ఈ శాంతి యత్నాలకు మెచ్చి విలీ బ్రాంట్‌కు 1971లో నోబెల్‌ శాంతి బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి కోసం వెంపర్లాడుతున్న ట్రంప్‌కు ఈ చరిత్ర తెలిస్తే మంచిది.ఆయుధాలు పోగేస్తూ పోతే భద్రత భేషుగ్గా ఉంటుందని నాటోకు ఎవరు నూరిపోస్తున్నారో గానీ... అందువల్ల ఆయుధ బేహారులు మాత్రమే బాగుపడతారు. నిరుడు నాటో రక్షణ వ్యయం 1.47 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో అమెరికా వాటా 93,500 కోట్ల డాలర్లు. మిగిలిన 53,500 కోట్ల డాలర్లు యూరప్‌ దేశాలది. నాటోలో సభ్యత్వం లేని ఉక్రెయిన్‌ తరఫున దౌత్యం నెరపి, రష్యాకు నచ్చజెబితే ఈ మాత్రం కూడా ఖర్చయ్యేది కాదు. భద్రత, రక్షణ చర్చల ద్వారా సాధ్యం తప్ప రక్షణ వ్యయం పెంచుకుంటూ పోవటం ప్రత్యామ్నాయం కాదు. వాస్తవానికి అమెరికాతో కలిసి అఫ్గాని స్తాన్, ఇరాక్‌ , సిరియా తదితర దేశాలపై... సొంతంగా బోస్నియా, హెర్జెగోవినా, లిబియాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించింది నాటోయే! సురక్షితమైన, భద్రమైన ప్రపంచాన్ని సృష్టించటం... వాతావరణ సంక్షోభాలను అధిగమించటం వర్తమాన యుగ అవసరం. అందుకు భిన్నంగా ఆయుధ పూజకు పూనుకుంటే నాటో దేశాలతోపాటు ప్రపంచమంతా నష్టపోతుంది.

71 consultants in AP State Planning Society9
నిరుద్యోగులకు ఉత్త చెయ్యి సలహాదారులకు దోచేయ్‌!

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి హామీని గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు సలహాదారులు, కన్సల్టెంట్ల పేరుతో తన పరివారానికి ఖజానా నుంచి ఎడాపెడా పంచిపెడుతున్నారు. చంద్ర­బాబుతోపాటు మంత్రి లోకేశ్‌ తమకు కావా­ల్సి­న వారిని నియమించుకుంటూ ప్రజల సొమ్ము­తో ఉపాధి కల్పిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీలకు డబ్బులు లేవంటూ చేతులె­త్తేసి సలహాదారులు, కన్సల్టెంట్లకు మాత్రం రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. రాజధాని పనులంటూ ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వెచ్చించి కన్సల్టెంట్ల నియామకం చేపట్టారు.రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారు­లతో పాటు తమకు కావాల్సిన పలువురిని సలహాదారు­లుగా నియమించి ఖజానా నుంచి భారీ ఎత్తున వేతనాలను చెల్లిస్తున్నారు. పీ 4 పథకం అమ­లుకు సంబంధించి 175 అసెంబ్లీ నియోజవర్గ విజన్‌ యూనిట్లలో యువ నిపు­ణుల పేరుతో నెలకు రూ.60 వేలు చొప్పున ఏడాదికి రూ.12.60 కోట్ల వంతున నాలుగేళ్లలో ఏకంగా రూ.50.40 కోట్లు రాష్ట్ర డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ గ్రాండ్‌ ఇన్‌ ఎయిడ్‌ నుంచి చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 175 నియోజకవర్గ స్వరాంధ్ర యూనిట్లలో ఒక్కో చోట ఐదుగురు చొప్పున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించినప్పటికీ యువ నిపుణుల పేరుతో 175 మంది ప్రైవేట్‌ వ్యక్తులను అదనంగా నియమించడం అధికార దుర్విని­యోగం కిందకే వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక వికసిత్‌ ఆంధ్రా విజన్‌ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీలో 71 పోస్టుల్లో కన్సల్టెంట్లను నియమించి నెలకు రూ.లక్షల్లో వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర ఆదాయం పెంచేందుకంటూ 11 మంది కన్సల్టెంట్లను 8 నెలల కోసం రూ.3.28 కోట్లు చెల్లిస్తూ నియమించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డుకు (ఈడీబీ) కేపీఎంజీ నుంచి ఆరుగురు కన్సల్టెంట్లు సేవలందించేందుకు రూ.3,66,91,639 చెల్లిస్తున్నారు. సీఆర్‌డీఏలో ఇష్టారాజ్యంగా..అమరావతిలో ప్రతి ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రత్యేకంగా మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీలను సీఆర్‌డీఏ నియమిస్తోంది. జోన్‌ 2,4,6,10లో చేపట్టిన పనుల పర్యవేక్షణ బాధ్యతను ఆర్వీ అసోసియేట్స్‌ ఆర్కిటెక్ట్స్‌ ఇంజనీర్స్‌ అండ్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.49.95 కోట్లతో సీఆర్‌డీఏ అప్పగించింది. జోన్‌ 12, 12 ఏ మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు పర్యవేక్షణను నిప్పాన్‌ కోయి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.40.44 కోట్లతో అప్పగించారు. అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కన్సల్టెంట్‌ ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.11.44 కోట్లకు సీఆర్‌డీఏ అప్పగించింది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌ నిర్మాణ పనుల పర్యవేక్షణకు వివిధ రంగాలకు చెందిన కన్సల్టెంట్లను నియమిస్తోంది. ఇందుకోసం రెండేళ్లకు రూ.22.58 కోట్లు చెల్లించనున్నారు. జోన్‌ 7 పనులను పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీకి రూ.10.60 కోట్లు చెల్లించనున్నారు.» ఈవీఎంల చౌర్యం, ట్యాంపరింగ్‌ కేసులో నిందితుడైన వేమూరి రవికుమార్‌ను ఏపీ ఎన్నార్టీఎస్‌ సలహాదారుగా నియమించారు. » చెరుకూరి కుటుంబరావును స్వర్ణాంధ్ర పీ 4 వైస్‌ చైర్మన్‌గా నియమించారు. » ఫోరెన్సిక్‌ సలహాదారుగా కేపీసీ గాంధీ నియామకం.

Rajnath Singh pushes for border demarcation with China10
సమస్యల పరిష్కారానికి  ‘నిర్మాణాత్మక రోడ్‌మ్యాప్‌’ 

ఖింగ్‌డావో/న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య నెలకొన్ని సంక్లిష్టమైన సమస్యలను నిర్మాణాత్మక రోడ్‌మ్యాప్‌ ద్వారా పరిష్కరించుకుందామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపాదించారు. ఆయన చైనా రక్షణ శాఖ మంత్రి డాంగ్‌ జున్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించుకోవడం, వివాదాలకు తావులేకుండా స్పష్టమైన సరిహద్దులను గుర్తించడానికి ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పునరుత్తేజితం చేయడం వంటి చర్యలతో స్నేహ సంబంధాలు బలోపేతం చేసుకుందామని చెప్పారు. చైనాలో ఖింగ్‌డావో నగరంలో షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా గురువారం రాజ్‌నాథ్‌ సింగ్, డాంగ్‌ జున్‌ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధానంగా వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద శాంతియుత పరిస్థితులను కొనసాగించడంపై చర్చించారు. పరస్పర ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత్, చైనా కలిసి పనిచేయాలని, ‘చక్కటి పొరుగుదేశం’గా ఇరుదేశాలు సహకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. 2020లో తూర్పు లద్ధాఖ్‌లో జరిగిన ఘర్షణ తర్వాత నెలకొన్న అపనమ్మకాన్ని తొలగించుకోవడానికి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. చైనాతో తాము ఎలాంటి ఘర్షణ కోరుకోవడం లేదన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి రాజ్‌నాథ్‌ చైనా రక్షణ మంత్రికి వివరించారు. సరిహద్దుల్లో సైన్యాన్ని, ఉద్రిక్తతలు తగ్గించుకోవడమే లక్ష్యంగా వేర్వేరు స్థాయిల్లో సంప్రదింపులు కొనసాగించాలని రాజ్‌నాథ్, డాంగ్‌ జున్‌ నిర్ణయించుకున్నారు. డాంగ్‌ జున్‌కు రాజ్‌నాథ్‌ ‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’ అనే మధుబని పెయింటింగ్‌ను బహూకరించారు.‘సుఖోయ్‌’ ఆధునీకరణ ఖింగ్‌డావో సిటీలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ర ష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బెలో సోవ్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలు, సీమాంతర ఉగ్రవాదం, ఇండో–రష్యా రక్షణ సంబంధాలు, పరస్పర సహకారంపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సుఖోయ్‌–30ఎంకేఐ యుద్ధ విమానాల ఆధునీకరణపై చర్చించారు. గగనతలానికి ప్రయోగించే క్షిపణుల తయారీ, ఎస్‌–400 మిస్సైల్‌ వ్యవస్థ రెండో బ్యాచ్‌ పంపిణీపై చర్చలు జరిపారు. భారత వైమానిక దళం వద్ద రష్యా అందజేసిన 260 సుఖోయ్‌–30ఎంకేఐ ఫైటర్‌ జెట్లు ఉన్నాయి. వీటిని రష్యా సహకారంతో అప్‌గ్రేడ్‌ చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. ఇదే అంశాన్ని రష్యా రక్షణ మంత్రి వద్ద రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement