Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

AP Police Filed Cases ON YSRCP Leaders At Palnadu1
పల్నాడులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు.. మేరుగు రాధా, కొండా శీను..

సాక్షి, పల్నాడు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నేతల టార్గెట్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులపై పోలీసుల అక్రమ కేసులు పెట్టారు. ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను పేర్కొన్నారు.👉ఇక, వైఎస్సార్‌సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. పుష్ప-2 సినిమాలో డైలాగు పోస్టర్ రూపంలో చూపించిన బోల్లెద్దు రవితేజ కేసులో గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. ఈ కేసులో 223, 352, 351(2), 189(3), 192, 61(2), 126(2), 288, 298, 192 BNS r/w 190(2), BNS నాన్ బెయిల్ బుల్ సెక్షన్లతో కేసు నమోదు చేయడం గమనార్హం.👉అలాగే, రాజుపాలెం మండలం బలిచేపల్లికి చెందిన మేరుగ రాధాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్‌ బుక్‌లో వచ్చిన పోస్టును ఆమె.. ఫార్వర్డ్ చేసినందుకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడం విశేషం.👉మాచర్ల వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగ నాయకుడు కొండా శీనును నిన్న సాయంత్రం గుంటూరులో దుర్గి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటనలో పాల్గొని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టినందుకు కొండా శీనును పోలీసులు తీసుకెళ్లారు. అయితే, కొండా శీనుకు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.

Vladimir Putin Says whole of Ukraine is Russia 2
ఉక్రెయిన్‌ మొత్తం మాదే.. పుతిన్‌ సంచలన ప్రకటన

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన ప్రకటన చేశారు. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటేనని.. ఉక్రెయిన్‌ మొత్తం రష్యాదే అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని ప్రకారం ఉక్రెయిన్‌ మొత్తం తమదేనని అన్నారు. దీంతో, పుతిన్‌ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తెర లేపాయి.ర‍ష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో వ్లాదిమిర్‌ పుతిన్‌ మాట్లాడుతూ..‘ఉక్రెయిన్‌ను నాశనం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఇదే విషయం నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఉక్రెయిన్ తమకు తాముగా సమస్యలను సృష్టించుకుంటోంది. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటే. దీని ప్రకారం ఉక్రెయిన్‌ మొత్తం మాదే. ఉక్రెయిన్‌ నగరం సుమీని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యం మాకు లేదు. ఉక్రెయిన్‌లో శాంతి సాధించాలనుకుంటే మాతో కలిసి రావాలి. మేము ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అలాగే, ఉక్రెయిన్ లొంగిపోవాలని కూడా మేము కోరుకోవడం లేదు. రష్యా శాంతికి కట్టుబడే ఉంది. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆకాంక్షలను వదులుకోవాలి. ఉక్రెయిన్‌ ఆక్రమిత ప్రాంతాలపై మాస్కో నియంత్రణను అంగీకరించాలి. ఉక్రెయిన్ స్వతంత్రంగా మారిన 1991 ఒప్పందాలను గుర్తుచేసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.Russians and Ukrainians are one people, and in that sense, the whole of Ukraine is ours — Putin 😳 pic.twitter.com/krghibrx0m— Frontalforce 🇮🇳 (@FrontalForce) June 20, 2025ఖండించిన పుతిన్అయితే, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని నివాస ప్రాంతాలపై తాము దాడి చేశామన్న వ్యాఖ్యలను పుతిన్ ఖండించారు. తమ సైన్యం అటువంటి లక్ష్యాలను ఢీకొట్టలేదని వెల్లడించారు. తాము నివాస గృహాలపై దాడులు చేయలేదని, సైనిక స్థావరాలపైనే చేశామన్నారు. జెలెన్ స్కీతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కానీ గతేడాది తన పదవీకాలం ముగియడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన చట్టబద్ధతను కోల్పోయారని ఆరోపించారు.ఈ సందర్భంగా పుతిన్‌..‘జెలెన్‌ స్కీతో సహా ఎవరినైనా కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది సమస్య కాదు. ఉక్రెయిన్ ఆయనకు చర్చలు జరిపే బాధ్యత అప్పగిస్తే, జెలెన్‌ స్కీనే అనుమతించండి. అసలు ప్రశ్న ఏమిటంటే ఫలితంగా వచ్చే పత్రాలపై ఎవరు సంతకం చేస్తారు? సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. జెలెన్ స్కీ అధ్యక్ష పదవీకాలం గతేడాది అధికారికంగా ముగిసింది. మార్షల్ లా విధించడం వల్ల అతడి వారసుడిని ఎన్నుకోలేదు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం పదవీ కాలం ముగిస్తే అధ్యక్ష అధికారాలను పార్లమెంటు స్పీకర్‌కు బదిలీ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగవచ్చని జెలెన్ స్కీ వాదిస్తున్నారు. అయితే తీవ్రమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు మేము చట్టపరమైన అంశాల గురించి శ్రద్ధ వహిస్తాం. సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. లేకపోతే జెలెన్ స్కీ తర్వాత ఎవరు వచ్చినా దానిని చెత్తబుట్టలో వేస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు.

LPU Student Secures Record Breaking Rs 2 5 Crore Placement Offer3
ఐఐటీలకు ధీటుగా ఎల్‌పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)లో ఇటీవలి ఫ్లేస్‌మెంట్‌ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్‌పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్‌పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్‌పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్‌పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్‌పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్‌తో భారీ ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్‌గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్‌పీయూ తాజా ప్లేస్‌మెంట్‌ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్‌పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్‌గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్‌పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్‌పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్‌కు ప్రపంచ ఖ్యాతిఎల్‌పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్‌ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్‌పీయూ ఎందుకంటే?ఎల్‌పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్‌మెంట్‌ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్‌ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్‌ ప్లేస్‌మెంట్‌ ట్రెయినింగ్‌ పొందుతారు.‘ఎల్‌పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్‌పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్‌మెంట్‌ ల్యాండ్ స్కేప్‌లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్‌పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

Ind vs Eng: Ganguly Reacts To Tendulkar Post Makes Bold Prediction4
ఆరోజు ముగ్గురం సెంచరీలు చేశామన్న సచిన్‌.. గంగూలీ రిప్లై ఇదే

ఇంగ్లండ్‌ (Ind vs Eng Tests)తో టెస్టు సిరీస్‌ ప్రయాణంలో టీమిండియా శుభారంభం అందుకుంది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో.. శుక్రవారం మొదలైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలోనే పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గిల్‌ సేన.. 85 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు సాధించి పట్టు బిగించింది.ఓపెనర్లలో కేఎల్‌ రాహుల్‌ (42) రాణించగా.. యశస్వి జైస్వాల్‌ (101) శతకంతో చెలరేగాడు. ఇక టీమిండియా టెస్టు సారథిగా తొలి మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ కూడా అద్భుత సెంచరీతో మెరిశాడు. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి గిల్‌ 127 పరుగులతో క్రీజులో ఉండగా.. వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) 65 పరుగులతో అతడికి తోడుగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా ప్రదర్శనపై బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) సంతృప్తి వ్యక్తం చేశాడు. కేఎల్‌ రాహుల్‌, జైస్వాల్‌, గిల్‌, పంత్‌లను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు.‘‘కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌ భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. ఇక అద్భుతమైన శతకాలు బాదిన జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌లకు శుభాకాంక్షలు. రిషభ్‌ పంత్‌ కూడా వీరితో సమానంగా తన వంతు పని పూర్తి చేశాడు.ఈరోజు టీమిండియా బ్యాటింగ్‌ను చూస్తుంటే.. నాకు 2002లో హెడింగ్లీలో.. రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, నేను తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు బాదడం గుర్తుకువచ్చింది. ఆ టెస్టులో మేము గెలిచాము.ఈరోజు.. యశస్వి, శుబ్‌మన్‌ తమ పని పూర్తి చేశారు. ఇక మూడో సెంచూరియన్‌ ఎవరు అవుతారో చూడాలి’’ అని సచిన్‌ టెండుల్కర్‌ పేర్కొన్నాడు. ఇందుకు టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్పందిస్తూ.. ‘‘హాయ్‌ చాంప్‌.. ఈసారి నలుగురు సెంచరీలు చేస్తారేమో.. పిచ్‌ బాగుంది.. పంత్‌.. కరుణ్‌ కూడా శతకాలు బాదుతారేమో!అయితే, 2002 నాడు తొలి రోజు పిచ్‌ స్వభావానికి ఇప్పటి వికెట్‌కు కాస్త తేడా ఉంది’’ అని బదులిచ్చాడు. కాగా 2002లో ఇదే వేదికపై సచిన్‌ టెండుల్కర్‌ గంగూలీతో కలిసి 249 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక టెండుల్కర్‌ 303 బంతుల్లో 193 పరుగులు సాధించగా.. గంగూలీ 128 రన్స్‌ స్కోరు చేశాడు. అదే విధంగా.. ‘వాల్‌’ రాహుల్‌ ద్రవిడ్‌ 148 పరుగులు చేయగా.. అప్పటి ఓపెనర్‌ సంజయ్‌ బంగర్‌ 68 రన్స్‌ రాబట్టాడు.కాగా ఇప్పటి వరకు ఇంగ్లండ్‌- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. తాజాగా దీనికి టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీగా నామకరణం చేశారు. ఇక దఫా పర్యటనలో భారత్‌ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, స్పిన్‌ లెజెండ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, రోహిత్‌ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పిన తర్వాత.. టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే. రోహిత్‌ స్థానంలో టెస్టు జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌కు ఈ సిరీస్‌ ప్రతిష్టాత్మక​ంగా మారింది.Tendulkar at Leeds, 2002pic.twitter.com/o7MlA5Zn3L— Cricketopia (@CricketopiaCom) June 20, 2025 చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..

Sonia Gandhis Surrender of Values at Centre Over Iran Israel War5
‘ఇది విలువల లొంగుబాటు’.. కేంద్రంపై సోనియా మండిపాటు

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్ణణల విషయంలో భారత్‌ మౌనం వహించడం అనేది దౌత్యపరమైన లోపాన్ని ఎత్తిచూపుతున్నదని, ఇది దేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయాల నిష్క్రమణను సూచిస్తుందని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ‘ది హిందూ’లో ఆమె జూన్ 13న ఇరాన్ భూభాగంపై జరిగిన ఇజ్రాయెల్ సైనిక దాడిని చట్టవిరుద్ధమైనదిగా, సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణించారు.రెండు ప్రాంతీయ శక్తుల మధ్య జరుగుతున్న ప్రతీకార డ్రోన్, క్షిపణి, వైమానిక దాడులు మధ్యప్రాచ్యంలో ప్రమాదకరమైన పరిస్థితులను తీసుకువస్తున్నాయి. దీనిపై స్పందించిన భారత జాతీయ కాంగ్రెస్ ఈ బాంబు దాడులను, ఇరాన్ గడ్డపై చోటుచేసుకున్న హత్యలను ఖండించింది. ఇవి ప్రాంతీయంగానూ ప్రపంచస్థాయిలోనూ పొంచివున్న ముప్పు తీవ్రతను సూచిస్తాయని పేర్కొంది. ఇటువంటి చర్యలు అస్థిరతను మరింత తీవ్రతరం చేస్తాయని, మరిన్ని సంఘర్షణకు బీజం వేస్తాయని సోనియా గాంధీ ఆ వ్యాసంలో పేర్కొన్నారు.సోనియా గాంధీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ దూకుడుగా వ్యవహరిస్తూ, అందుకు అనుకూలంగా తన సొంత నిఘా వర్గాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. ట్రంప్ గతంలో పలు యుద్ధాలు, సైనిక-పారిశ్రామిక సముదాయ శక్తుల గురించి హెచ్చరించారని, అయితే ఇప్పుడు ఇరాక్ యుద్ధానికి దారితీసిన తప్పులను పునరావృతం చేస్తున్నట్లు కనిపిస్తోందని సోనియా పేర్కొన్నారు. ఈ వ్యాసంలో సోనియా భారతదేశానికున్న ప్రత్యేకమైన దౌత్య స్థానానికి ప్రాధాన్యతనిచ్చారు.ఇరాన్ భారతదేశానికి దీర్ఘకాల మిత్రదేశమని, జమ్మూ కశ్మీర్‌తో సహా కీలక సమయాల్లో ఇరాన్‌ మద్దతు ఉన్నదన్నారు. 1994లో కాశ్మీర్ సమస్యపై యూఎన్‌ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్‌లో భారతదేశాన్ని విమర్శించే తీర్మానాన్ని నిరోధించడంలో ఇరాన్ సహాయపడిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తన దౌత్య పాత్రను పునరుద్ఘాటించాలని భారత ప్రభుత్వానికి సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్దంలో భారత్‌ కల్పించుకోకపోవడాన్ని ఆమె విలువ లొంగుబాటుగా ఉన్నదని విమర్శించారు. ఈ విషయంలో భారత్‌ వైఖరి స్పష్టంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను అనుసరించాలని ఆమె సూచించారు. ఇది కూడా చదవండి: ‘యుద్ధం’ ఆపితే నోబెల్‌ రాదు: ట్రంప్‌ అదే ‘మధ్యవర్తిత్వ’ వాదనలు

how Vivek Oberoi father tough love mantra became the Rs 1200 cr business empire6
నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదన

ప్రముఖ నటుడు, పారిశ్రామికవేత్త వివేక్ ఒబెరాయ్ సంపద ఫోర్బ్స్‌ ఇండియా ప్రకారం దాదాపు రూ.1,200 కోట్లుగా ఉంది. ‘సాథియా’, ‘మస్తీ’, ‘రక్తచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు సినిమాల్లో తక్కువగానే కనిపిస్తున్నారు. ‍ప్రస్తుతం దుబాయ్ వెళ్లి ఫుల్ టైమ్‌ ఆంత్రప్రెన్యూర్‌గా మారారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యాపార సామ్రాజ్య పునాదికి దారితీసిన అంశాల గురించి, తండ్రి సురేష్ ఒబెరాయ్ చిన్నతనం నుంచే తనకు ఫైనాన్షియల్‌ ఫ్రీడమ్‌ గురించి ఎలా నేర్పించారో చెప్పారు.దుబాయ్ ప్రాపర్టీ ఇన్‌సైడర్‌ పాడ్‌కాస్ట్‌లో వివేక్ ఒబెరాయ్‌ మాట్లాడుతూ.. ‘వ్యాపార మెలకువలు నేర్చుకునే తొలినాళ్లలో నాలో ఆర్థిక అవగాహన పెంపొందించిన ఘనత నా తండ్రికే దక్కుతుంది. అతను ఒక ప్రొడక్ట్‌ తీసుకొచ్చి నేను దాన్ని ఎలా విక్రయించబోతున్నాననే దానిపై వ్యాపార ప్రణాళికను రూపొందించమని అడిగేవారు. దాంతో నేను 10 ఏళ్ల వయసు నుంచే వ్యాపారంలోని సూక్ష్మాంశాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నా తండ్రి ఒక విషయం స్పష్టంగా చెప్పారు. తాను ధనవంతుడినని.. మేము కాదనే చెబుతుండేవారు. మేము ఎలా ఉండాలో నిర్ణయించుకోమన్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: 40 ఏళ్ల వయసులో రిటైర్‌ అవ్వొచ్చు.. ఆర్థిక సూత్రం ఇదే..‘ఈ కఠినమైన ప్రేమతో కూడిన విధానం టీనేజ్ నుంచే నన్ను తోటివారి కంటే భిన్నంగా ఆలోచించేలా చేసింది. చాలా మంది టీనేజర్లు స్కూళ్లలోని పాఠాలు నేర్చుకుంటుంటే.. నేను మాత్రం మార్కెట్‌, వ్యాపారం, స్టాక్స్‌.. వంటి ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన పెంచుకున్నాను. దాంతో నా మొదటి కంపెనీ కోసం 3 మిలియన్ డాలర్లు కూడబెట్టగలిగాను. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. తర్వాతి కాలంలో నా పెట్టుబడిదారుల కోసం చాలా డబ్బు సంపాదించాను. నా 23 ఏళ్ల వయసులో ఆ కంపెనీని విక్రయించాను. తర్వాత ఇతర కంపెనీలను కొనుగోలు చేశాను. ప్రస్తుతం తొమ్మిది సంస్థలను భారత స్టాక్ మార్కెట్లోకి తీసుకెళ్లగలిగాను. మరో నాలుగు కంపెనీలను స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేయాలని యోచిస్తున్నాను’ అని తెలిపారు.

BRS MLA Harish rao Photos trending In Social Media7
2028లో రప్పా రప్పా.. 3.0 లోడింగ్.. ట్రెండింగ్‌లో హరీష్‌ రావు ఫొటో

సాక్షి, సంగారెడ్డి: పుష్ప-2 సినిమాలోని రప్పా.. రప్పా.. డైలాగ్‌ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు తలపెట్టిన రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులు, పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. ఫుల్‌ జోష్‌లో కనిపించారు.పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. హరీష్ రావు రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులను కార్యకర్తలు చూపించారు. 2028లో రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్ అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో, ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు నిలిచాయి. మరోవైపు.. హరీష్‌ రావు మాట్లాడుతూ..‘కేటీఆర్‌పై కేసు పెట్టడం.. కేసీఆర్‌ను కమిషన్ ముందుకు పిలవడం తప్ప రేవంత్ ఏం చేశాడు. రాష్ట్రంలో ఏ సర్వే చేసిన మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది అని అంటున్నాయి. రెండు లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది.. మీ అందరికి రైతు భరోసా వచ్చే వరకు పోరాటం ఆపేది లేదు. ఇది ఆరంభం మాత్రమే. కేసీఆర్‌, బీఆర్ఎస్ పార్టీని తలవకుండా రేవంత్ స్పీచ్ ఉండదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రెండు లక్షల మంది రైతులు ఔటర్ రింగ్ రోడ్డు మీద ధర్నా చేస్తే రేవంత్ మైండ్ బ్లాక్ అవుతుంది. రైతుబంధు ఇవ్వకపోతే రంగారెడ్డి, మల్కాజిగిరి, సంగారెడ్డి రైతులందరూ కదులుతారు జాగ్రత్త. వెంటనే రెండు లక్షల మంది రైతులకు రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దేవాదుల ఏ బేసిన్ లో ఉందని రేవంత్ అడగడం హాస్యాస్పదం. నల్లమల్లల పుట్టిన అని చెప్పుకొనే రేవంత్.. నల్లమల్ల ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. కౌశక్‌ను అరెస్ట్ చేయడం దారుణం.. రేవంత్‌ని ప్రశ్నిస్తే అర్దరాత్రి ఓ అక్రమ కేసు పట్టి అరెస్ట్ చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Straw Movie Review In Telugu8
‘స్ట్రా' మూవీ రివ్యూ.. కూతురు కోసం ఒంటరి మహిళ పోరాటం

ఓ ఊహకు మంచి ఆలోచన తోడై దానికి క్రియేటివిటీ అనే మసాలాను జోడిస్తే అవుతుంది ఓ అద్భుతమైన సినిమా. ఒక వ్యక్తిని అది కూడా ఒక తల్లిని... పరిస్థితులు, సమాజం నిస్సహయరాయుల్ని చేస్తే... నలుగురు కలిసి అన్ని రకాలుగా ఒక మూలకు నెట్టేస్తే ఆమేం చేసిందన్న విషయాన్ని ఊహకు అందనట్టుగా అదే సమయంలో మనసుకు హత్తుకునేట్టుగా తీసే దర్శకులు ప్రపంచ స్థాయిలో చాలా మందే ఉన్నారు. బోలెడంత ఖర్చుతో , పెద్ద స్టార్ కాస్టింగ్ తో ఓ కథను తీయడం పెద్ద కష్టమేమీ కాదు, కాని అదే సమయంలో చిన్న ఆలోచనను చిన్న స్టార్ కాస్ట్ తో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడం కత్తి మీద సామే. అలా తన ఆలోచనకు తానే నిర్మాతగా మారి, దర్శకత్వం వహించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన హాలివుడ్ దర్శకుడు టైలర్ పెర్రీ నిజంగా పెద్ద సాహసమే చేశాడు. ఆ సాహసం పేరే తాను తీసిన సినిమా స్ట్రా(Straw Movie Review). చిన్న ఆలోచనతో తన సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కదలనివ్వకుండా చేసిన సినిమా ఈ స్ట్రా. ఇది ఓ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే.అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం...జనయా ఓ సింగిల్ మదర్, తన కూతురితో చిన్నపాటి ఇరుకు గదిలో అతి కష్టం మీద సర్దుకుంటూ ఉంటుంది. ఓ షాపింగ్ మాల్ లో పని చేసే జనయాకు ఆనందం అన్న విషయమే తెలియదు, అంతగా ఆమె జీవితం కష్టాలమయం. కనీసం స్కూల్ లో కూతురికి ఓ రోజు బ్రెడ్ కూడా పెట్టలేని పరిస్థితి. ఓ రోజు కూతురి బ్రెడ్ కోసం డబ్బులు లేక బ్యాంకు కు వెళ్ళి విత్ డ్రా చేయడానికి వెళితే, బ్యాంకు సిబ్బంది ఏదో కారణాల వల్ల డబ్బు ఇవ్వలేమని చెబితే వాళ్ళని ఎదిరించడానికి గన్ చూపిస్తుంది. బ్యాంకు లో గన్ చూపించడంతో అక్కడ ఉన్న సిబ్బంది అవాక్కయి పోలీసులకు ఫోన్ చేస్తారు.ఇక అక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. జనయాకి బ్యాంకుల వాళ్ళు డబ్బులు ఇస్తారా, లేదా గన్ చూపించినదానికి జనయాను పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. చూడడానికి ఇది చిన్న కథే అయినా ఆఖర్లో వచ్చే ట్విస్ట్ తో చూసే ప్రేక్షకుల మతి పోవడం ఖాయం. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా తరాజి పి హాన్సన్ జీవించిందని చెప్పవచ్చు. నిజానికి ఆ ఆలోచనకే దర్శకుడికి హాట్సాఫ్ చెప్పవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా పెద్ద వాళ్ళకు మాత్రమే. అలాగే ఇది తెలుగులోనూ లభ్యమవుతుంది. ఈ రివ్యూ చదివిన ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కాని ఇలాంటి సినిమా మాత్రం చాలా అరుదు. మస్ట్ వాచ్.

wont get Nobel Prize for Stopping India Pakistan war Trump9
‘యుద్ధం’ ఆపితే నోబెల్‌ రాదు: ట్రంప్‌ అదే ‘మధ్యవర్తిత్వ’ వాదనలు

న్యూఢిల్లీ: భారత్- పాకిస్తాన్ మధ్య శాంతి నెల కొల్పోందుకు తాను మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు వాదనకు దిగారు. గత నెలలో భారత్‌- పాక్‌ దేశాల మధ్య భీకరంగా జరగబోయే యుద్ధాన్ని ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్‌ పేర్కొన్నారు. ‍ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల భారత్‌-పాక్‌ మధ్య ట్రంప్‌ మధ్యవర్తిత్వం లేదని, ఇది ప్రత్యక్ష సైనిక చర్చల ఫలితమని స్పష్టం చేసినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్‌ మరోమారు ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు.‘భారత్‌- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్ బహుమతి లభించదు. సెర్బియా- కొసావో మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్ బహుమతి రాదు. ఈజిప్ట్- ఇథియోపియా మధ్య శాంతిని నెలకొల్పినందుకు కూడా నోబెల్ శాంతి బహుమతి దక్కదు. మధ్యప్రాచ్యంలో అబ్రహం ఒప్పందాలను చేసినందుకు కూడా నాకు నోబెల్ శాంతి బహుమతి లభించదు’ అంటూ అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఒక పోస్టులో పేర్కొన్నారు. అలాగే తాను రష్యా/ఉక్రెయిన్, ఇజ్రాయెల్/ఇరాన్‌తో సహా ఎక్కడ ఏమి చేసినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని, ఈ అంశాల్లో ఫలితాలు ఏమైనా కావచ్చు. ప్రజలకు అంతా తెలుసు. తనకు ఇదే ముఖ్యమని ట్రంప్‌ అన్నారు.డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో- రువాండా మధ్య వాషింగ్టన్‌లో శాంతి ఒప్పందం కుదిరిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ విధమైన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆఫ్రికాకు ఘనమైన దినం. నిజం చెప్పాలంటే, ప్రపంచానికే గొప్ప దినం. దీనికి కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదు అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కాగా న్యూఢిల్లీ- ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తతలను అరికట్టడంలో అమెరికా పాత్రను భారతదేశం తిరస్కరిస్తూ వస్తోంది.ఇది కూడా చదవండి: International Yoga Day: ఉత్సాహంగా జపాన్‌ ప్రధాని భార్య యోషికో యోగాసనాలు

After Massive weight loss dont forget these facial exercises 10
జిమ్‌కి వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది..ఫేస్‌ గ్లో కోసం..!

తీవ్రమైన వ్యాయామాలు, కఠినమైన ఆహార నియమాలతో బరువు తగ్గడం అంటే శిఖరాన్ని అధిరోహించేందుకు చేసే కసరత్తులా అనిపిస్తుంది. ముఖ్యంగా బిజీ జీవనశైలిలో అధికబరువుపై ధ్యాస, జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేయడం పెద్ద యుద్ధమే అనిపిస్తుంది. పోషకాహార నిపుణురాలు ఉదిత అగర్వాల్‌ జిమ్‌కి వెళ్లకుండానే 30 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ముఖంలోని కొవ్వును సహజంగా తగ్గించడంలో సహాయపడే కొన్ని సాధారణ చిట్కాలనూ, తీసుకోదగిన ఆహారాలను మన ముందుంచింది.తీసుకునే ఆహారంలో మొత్తం కొవ్వుపై దృష్టి పెట్టాలి. ఎన్ని కేలరీలు ఉన్నాయో, దానికంటే అదనపు కేలరీలను బర్న్‌ చేయాలని గుర్తించాలి. అప్పుడు కేలరీలు తీసుకోవడం తగ్గిస్తారు. ఉత్తమ ఫలితాల కోసం ఆరోగ్యకరమైన ఆహారం + క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం రెండూ జీవనశైలిలో భాగం చేసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, ప్రాసెస్‌ చేసిన ఆహారాలను తీసుకోకూడదు. అధిక ప్రొటీన్‌ తీసుకోవడం ద్వారా కొవ్వు తగ్గుతుంది. కడుపు నిండుగా ఉంటుంది.ఆరోగ్యకరమైన కొవ్వులు మొలకెత్తిన గింజలు, విత్తనాలలో ఉంటాయి.నీళ్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే పండ్లు – కూరగాయలను తీసుకోవాలి. రోజూ కనీసం 2–3 లీటర్ల నీళ్లు తాగాలి. ఒత్తిడిని తగ్గించడం – హాయిగా నిద్రపోవడం ఒత్తిడి కార్టిసాల్‌ను పెంచుతుంది, ఇది కొవ్వు పేరుకుని పోయేలా చేస్తుంది. ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటల సేపు నిద్ర΄ోయేలా చూసుకోండి. నిద్ర సరిగా లేక΄ోవడం వల్ల శరీరం నీరు పట్టినట్టుగా కనిపిస్తుంది. ముఖ వ్యాయామాలు – టోనింగ్‌ ఈ వ్యాయామాలు చర్మం నునుపును మెరుగుపరుస్తాయిబుగ్గలు ఉబ్బినట్టుగా ఉంటే, మునివేళ్లతో మృదువుగా వెనక్కి మర్దనా చేయాలి. పళ్ళు బిగించి, నవ్వుతూ, 10 సెకన్ల పాటు అలాగే ఉంచాలి. ‘ఫిష్‌ ఫేస్‌‘ ప్రయత్నించాలి. అంటే, బుగ్గలను లోపలికి పీల్చుకొని, కొన్ని సెకన్లపాటు ఉంచాలి. చక్కెర పానీయాలకు దూరంమద్యం చర్మాన్ని డీహైడ్రేట్‌ చేస్తుంది. నీటిని చేరుస్తుంది. చక్కెర పానీయాలలో అధిక కేలరీలు ఉంటాయి. ఇవి ఒంట్లో ఎక్కువ కొవ్వు నిల్వలను చేరుస్తాయి. పై జాగ్రత్తలన్నీ తీసుకొని, బాడీ ఫిట్‌నెస్‌ను కాపాడుకున్నాను. డైటీషియన్‌ కోర్సు కూడా పూర్తిచేశాను. నాపై నేను తీసుకున్న ఈ ప్రత్యేక శ్రద్ధ నన్ను నాజూగ్గా మార్చింది. బరువు తగ్గడానికి 12 రకాల ఆహార పదార్థాలు కూరగాయలు (కేలరీలు చాలా తక్కువ)1. దోసకాయ – 100 గ్రాములకు16 కిలో కేలరీలు లభిస్తాయి. హైడ్రేటింగ్, క్రంచీ, సలాడ్స్, స్నాక్స్‌ చేయడానికి సరైనది.2. గుమ్మడికాయ – 100 గ్రాములకు 17 కిలో కేలరీలు తేలికైనది, చాలా రకాలు చేయవచ్చు. 3. లెట్యూస్‌– 100 గ్రాములకు 15 కిలో కేలరీలుర్యాప్‌లకు, సలాడ్‌ బేస్‌గా అనువైనది.4. పాలకూర – 100 గ్రాములకు 23 కిలో కేలరీలుఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది, స్మూతీలు, సాగ్‌ లేదా సాటీయింగ్‌కు సరైనది.5. కాలీఫ్లవర్‌ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుఅన్నం, పిజ్జా క్రస్ట్‌ లేదా సబ్జీలలో ఉపయోగించవచ్చు. పండ్లు (సహజంగా తీపి – తక్కువ కేలరీలు)6. పుచ్చకాయ – 100 గ్రాములకు 30 కిలో కేలరీలు వేడి వాతావరణం ఉన్నప్పడు మరీ మంచిది. 7. స్ట్రాబెర్రీలు – 100 గ్రాములకు – 32 కిలో కేలరీలు తీపి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, జీర్ణక్రియకు మంచిది.8. బొప్పాయి – 100 గ్రాములకు 43 కిలో కేలరీలుజీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చాలా కడుపు నిండుగా ఉంటుంది. 9. ఉడికించిన గుడ్డులోని తెల్లసొన – గుడ్డులోని తెల్లసొనకు – 17 కిలో కేలరీల స్వచ్ఛమైన ప్రొటీన్, కొవ్వు ఉండదు. కండరాల నిర్వహణకు సరైనది.10. వెన్నలేని పెరుగు (తక్కువ కొవ్వు) – 100 గ్రాములకు 59 కిలో కేలరీలు ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది, జీర్ణాశయ ఆరోగ్యానికి మంచిది.11. టోఫు (లైట్‌ లేదా తక్కువ కొవ్వు) – 100 గ్రాములకు 70 కిలో కేలరీలు మొక్కల ఆధారిత ్ర΄ోటీన్, మృదువైనది మరియు సంతృప్తికరంగా ఉంటుంది.12. ఎయిర్‌ -పాప్డ్‌ పాప్‌కార్న్‌ (ఉప్పు, వెన్న లేనిది) – కప్పుకు 30 కిలో కేలరీలు. తాను ఇవన్నీ ఫాలో అయాను కాబట్టే బరువు తగ్గినా ముఖం కళ తప్పకుండా కాపాడుకోగలిగాను అని చెబుతోంది ఉదితా అగర్వాల్‌. View this post on Instagram A post shared by Udita Agarwal (@udita_agarwal20) ‘‘నా చిన్నతనం నుంచీ అధికబరువు సమస్యను ఎదుర్కొన్నాను. ఆరోగ్య సమస్యల బారిన పడ్డాను. జుట్టు రాలి΄ోయేది, ముఖంపై యాక్నె ఉండేది. పాతికేళ్లు వచ్చేసరికి వంద కేజీలకు పైగా బరువు పెరిగాను. జిమ్‌కి వెళ్లకుండా బరువు తగ్గాలనుకున్నాను. ఎనిమిది నెలల్లో 30 కేజీల బరువు తగ్గాను. కానీ, మేని చర్మం సాగినట్టు, ముఖంలోని కొవ్వునూ కోల్పోయి, సన్నబడి, కళ తగ్గినట్టుగా అనిపించింది. ఈ సమస్య దరిచేరకుండా జాగ్రత్త పడ్డాను. -ఉదితా అగర్వాల్‌.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement