Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Air India plane crash: 265 People Dead In Ahmedabad1
మహా విషాదం.. 265 మంది దుర్మరణం

అహ్మదాబాద్‌: మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గురువారం గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్‌ కాలేజీ, సిటీ సివిల్‌ హాస్పిటల్‌ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కూడా ఉన్నారు. 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్‌వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్‌ విశ్వాస్‌కుమార్‌ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్‌ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్‌ హాస్టల్‌ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్‌ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్‌వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌ పేర్కొంది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. ఇద్దరు ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్‌ డాక్టర్‌ మీనాక్షీ పారిఖ్‌ వెల్లడించారు. విమాన శకలాలు, ధ్వంసమై కాలిపోయిన భవనాలు, కార్లు, చెట్లు తదితరాలతో ప్రమాదస్థలి భీతావహంగా మారింది. విమానాశ్రయ, అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సైనిక, స్థానిక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి దాదాపుగా విమానంలోని వారంతా కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యారు. వారిని బయటికి తీసి ఆ ప్రాంగణంలోనే ఉన్న సిటీ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణంపై భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3, ప్రధాని యిర్‌ స్టార్మర్, పలువురు దేశాధినేతలు, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. జరిగింది మాటలకందని దారుణమని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించనున్నారు. హాస్టల్‌లోకి చొచ్చుకెళ్లిన విమానం పైలట్‌ ‘మే డే’ అలర్ట్‌ విమానం మధ్యాహ్నం 1.39కి టేకాఫ్‌ అయింది. 600 అడుగుల పై చిలుకు ఎత్తుకు వెళ్లిందో లేదో సమస్య తలెత్తింది. దాంతో మరింత పైకి వెళ్లాల్సిన విమానం కాస్తా కిందకు రాసాగింది. అప్పటికింకా కనీసం లాండింగ్‌ గేర్‌ కూడా పూర్తిస్థాయిలో మూసుకోలేదు! దాంతో తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తూ పైలట్‌ వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు ‘మే డే’ కాల్‌ చేశారు. ‘‘ఏటీసీ తక్షణం స్పందించి తిరిగి కాల్‌ చేసినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. పైలట్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’’ అని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. చుట్టుపక్కల వాళ్లంతా చూస్తుండగానే క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. ప్రమాదం తాలూకు వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరలైంది. విమానం తాలూకు జంట ఇంజన్లలో టేకాఫ్‌కు అవసరమైన పూర్తిస్థాయి థ్రస్ట్‌ లోపించడమే ప్రమాదానికి కారణమని వైమానిక నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఇంజన్లను పక్షులు ఢీకొట్టి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాయంత్రం దాకా నిలిచిపోయాయి. ‘‘విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెడికల్‌ కాలేజీలో డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది నివాస క్వార్టర్లపై కూలిపోయింది. వాటికి మంటలు అంటుకుని లోపలున్న చాలామంది గాయపడ్డారు’’ అని హరేశ్‌ షా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్న మహిళలు ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం! ఎవరినీ కాపాడలేకపోయాం: అమిత్‌ షా ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. ‘‘అదంతా ఒక్కసారిగా అంటుకోవడంతో తీవ్రమైన మంటలు చెలరేగి భరించలేనంత వేడి పుట్టుకొచ్చింది. దాంతో ఎవరినీ కాపాడే అవకాశం లేకుండా పోయింది’’ అని చెప్పారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించిన అనంతరం మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. ‘‘డీఎన్‌ఏ శాంపిళ్లను ఇప్పటికే సేకరించారు. గుజరాత్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ వర్సిటీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తాయి’’అని తెలిపారు. సెకెనుకు 4 లీటర్ల ఇంధనం విమాన ఇంధనాన్ని జెట్‌ ఫ్యూయల్‌ లేదా జెట్‌ ఏ1 అని పిలుస్తారు. బోయింగ్‌ 747 విమానం నడవాలంటే భారీగా ఇంధనం కావాలి. సెకెనుకు 4 లీటర్లు ఖర్చవుతుంది. అంటే నిమిషానికి 240 లీటర్లు, గంటకు 14,400 లీటర్లు కావాలన్నమాట. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు సుమారు 6,859 కి.మీ. దూరానికి 9 గంటలపైనే ప్రయాణం. ఎయిరిండియా విమానంలో అంత భారీగా ఇంధనం ఉండటానికి అదే కారణం. విమానం వేగంగా, బలంగా నేలను తాకగానే అంత ఇంధనం ఒకే మండిపోయింది. దాంతో భారీగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం తేలాల్సి ఉంది. విమానం బ్లాక్‌ బాక్స్‌ కోసం అన్వేషిస్తున్నారు. మెడికల్‌ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు విమాన కుప్పకూలిన బీజే మెడికల్‌ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. కుప్పకూలిన హాస్టల్‌ భవనాలు తదితరాల కింద చాలామంది వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకుని ఉంటారని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఏఐఎంఏ) తెలిపింది. వారిని వెలికితీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా 265 మృతదేహాలను సిటీ సివిల్‌ ఆస్పత్రికి తరలించినట్టు డీఎస్పీ కనన్‌ దేశాయ్‌ వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని ఎఫ్‌ఏఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ దివ్యాన్‌‡్ష సింగ్‌ అన్నారు. వెలికితీసిన మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయి ఉన్నాయని చెప్పారు.

Chandrababu Coalition govt Fraud in Thalliki Vandanam2
తల్లికి వందనం మహా మోసం!

తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం. – ఎన్నికలప్పుడు నారా చంద్రబాబు నాయుడుఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. జగన్‌ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం సక్రమంగా అమలు చేయడం లేదు.. రేపు కూటమి ప్రభుత్వం రాగానే మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తాం. నిబంధనలను సాకుగా చూపి ఎవరికీ ఎగ్గొట్టం. – ఎన్నికలప్పుడు నారా లోకేశ్‌విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్‌ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ వివరాలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్‌లోడ్‌ చేస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్‌ గణాంకాలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది రూ.8,745 కోట్లే. అంటే 1/3 విద్యార్థులకు పంగనామాలు పెడుతున్నామని జీవో సాక్షిగా చెప్పారు.ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతుంటే ఆ ఇంట్లో మరెవ్వరికీ తల్లికి వందనం ఇవ్వం అని తేల్చి చెప్పింది. అసలు కూటమి ప్రభుత్వ పాలనలో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు అమలవుతున్నాయా! ఎప్పుడొస్తుందో తెలియని.. అసలు వస్తుందో రాదో తెలియని ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నెపం మోపి తల్లికి వందనం పథకాన్ని వారికి రద్దు చేయడం దుర్మార్గం కాదా?ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదివే ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని గురువారం అన్ని దినపత్రికల్లో (సాక్షి మినహా) ఫుల్‌ పేజీ ప్రకటన ఇచ్చారు. నేడే తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేస్తామని కూడా ఘనంగా చాటుకున్నారు. మీ మాటలు నమ్మి డబ్బులు పడతాయని లక్షలాది మంది తల్లులు రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూశారు. తీరా సవాలక్ష నిబంధనలు పెట్టి, నగదు జమ చేయడానికి ఇంకో నెల గడువు తీసుకున్నారు. మీరు చెప్పిన పిల్లల సంఖ్యలో ఇంకా కోత వేయడానికే కదా ఈ గిమ్మిక్కులు! దీన్ని ఏమనాలి? మోసం అనాలా.. లేక దగా అనాలా? వీరందరూ అనర్హులు⇒ ఒక ఇంట్లో ఒకరు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్నట్లయితే, అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు.⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికీ పథకం రద్దు. ⇒ కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు.⇒ కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు.⇒ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు. పట్టణాలల్లో 1000 చ.అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ⇒ ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్‌ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్‌ వినియోగించి ఉంటే పథకం రాదు.⇒ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌ పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు వేతనం పొందుతున్న వారికి పథకం రాదు. ⇒ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీృమెట్రిక్, పోస్ట్‌ృమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి, మిగిలిన నగదును మాత్రమే ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లిస్తారు. ⇒ సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులొస్తే పథకాన్ని ఆపేస్తారు.సాక్షి, అమరావతి: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు షాకిచ్చింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసింది. సవాలక్ష నిబంధనలు విధించి.. ఇంకా కోత కోయనుంది. మిగిలిన వారికి కూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. గురువారమే నిధులు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం.. వచ్చే నెలకు వాయిదా వేసింది. కేవలం విధివిధానాలు మాత్రమే విడుదల చేసి అనేక కఠిన నిబంధనలతో లబ్ధిదారులకు కోత పెట్టే ప్రక్రియకు పూనుకుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల వివ­రా­లను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి.. అభ్యంతరాలు ఉన్న వారిని తొలగించనున్నారు. అర్హులుగా తేలిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వచ్చే నెలలో రూ.13 వేలు మాత్రమే జమ చేస్తారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు (26, 27 జీవోలు) విడుదల చేసింది. ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇచ్చే రూ.13 వేలకు అనేక నిబంధనల ఆంక్షలు పెట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26) నుంచే ఈ పథకం వర్తిస్తుందని, ఈ ఏడాది హాజరుతో సంబంధం లేకుండా అన్ని మేనేజ్‌మెంట్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికీ పథకం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. తీరా తల్లులపై ఫీజుల భారం మోపింది. ఇచ్చేది 54,94,703 మందికే.. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్‌–6 హామీల్లో ఒకటైన తల్లికి వందనంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం 67,27,164 మందికి ఈ పథకాన్ని ఇస్తున్నట్టు ప్రకటించినా, ప్రస్తుతం ఇచ్చేది 54,94,703 మందికేనని తేల్చింది. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో చేరికల అనంతరం లబ్ధిదారులను పరిశీలించనున్నట్టు పేర్కొంది. ఒకటో తరగతిలో 5,87,265 మంది, జూనియర్‌ ఇంటర్‌లో 5,32,485 మంది చేరుతారని అంచనా వేశారు. రికార్డుల్లో తప్పులున్నవారు 21,860 మంది, కుటుంబ వివరాలు లేని వారు 90,851 మంది ఉన్నట్లు అంచనా. వీరి వివరాలు తీసుకుని తర్వాత లెక్క సరిచేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ కులాలకు చెందిన 15 కార్పొరేషన్ల ద్వారా గుర్తించిన 54,94,703 మంది విద్యార్థుల వివరాలను స్థానిక గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. నిబంధనలు అన్నీ సరిపోతే.. ఇతరులెవరైనా ఫిర్యాదు చేయకపోతే వచ్చే నెల 5న ఆయా విద్యార్థులకు సంబంధించి 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున జమ చేస్తారు. ఈ విద్యా సంవత్సరం 75 శాతం హాజరు ఉన్న వారికే 2027లో పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. నాలుక మడతేసిన లోకేశ్‌!వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమ్మఒడి అమలులో కఠిన నిబంధనలు పెట్టిందని ఎన్నికలప్పుడు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ నీతులు వల్లించారు. కానీ ప్రస్తుతం తల్లికి వందనం అమలు నిబంధనలు చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వారు చెప్పిన ప్రకారం ఇప్పటికే రెండేళ్ల కాలానికి విద్యార్థులకు తల్లికి వందనం వేయాలి. కానీ తేదీల మతలబుతో మాయ చేసి 2026కు ఇప్పుడు ప్రకటించారు. అదీ 67,27,164 మంది లబ్ధిదారులని చెప్పి, ఇచ్చేది మాత్రం 54,94,703 మందికేనని.. కండిషన్స్‌ అప్లై అన్నారు. గత ప్రభుత్వంలో 75 శాతం హాజరు నిబంధన పెట్టినా పేదల పక్షపాతి అయిన నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుతో సంబంధం లేకుండా పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ చేశారు. అయితే నాటి నిబంధనలను తప్పుబట్టిన లోకేశ్‌.. ఇప్పుడు తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకు కోత పెట్టారు. ఇప్పుడు అర్హులైన వారికి రూ.13 వేలు మాత్రమే ఇస్తామని, మరో రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిధికి జమ చేస్తామంటున్నారు. ఎన్నికల ముందు చెప్పిందేమిటి.. చేసిందేమిటని ప్రజలు సోషల్‌ మీడియా వేదికగా లోకేశ్‌ను నిలదీస్తున్నారు. పైగా ఈ పథకాన్ని 2024 జూన్‌/జూలైలో విద్యార్థులకు ఇవ్వాల్సింది ఎగవేశారు. 2025 జూన్‌లో ఇవ్వాల్సిన పథకాన్ని ఇప్పుడు ప్రకటించి 2026కు కూడా ఇదే అని చెబుతున్నారు. పైగా ఒక ఇంట్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందే విద్యార్థులుంటే తల్లికి వందనం వర్తించదని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఒక ఇంట్లో గ్రాడ్యుయేషన్‌ చదువుకునే వారు ఎందరుంటే అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. అమ్మ ఒడి కూడా ఇచ్చారు. ఇంత పక్కాగా అమలు చేసిన అమ్మ ఒడిపై తీవ్ర విమర్శలు చేసిన లోకేశ్‌.. ఇప్పుడు ఇన్ని కండిషన్లతో తల్లికి ఎగనామం పెట్టినట్టు కాదా.. అని ప్రజలు నిలదీస్తున్నారు.

Chandrababu Says that he implemented Super Six Promises3
సూపర్‌ సిక్స్‌ అమలు చేసేశాను: చంద్రబాబు

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ అమలు చేసేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా సూపర్‌ సిక్స్‌ గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప ఇంకొకటి కాదని అన్నారు. తల్లికి వందనం పథకం అమలుపై గురువారం ఆయన ఉండవల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పిన మాట మేరకు.. నలుగురు పిల్లలున్న వారికి కూడా ఇస్తున్నామని తెలిపారు. 67 లక్షల మంది పిల్లలకు రూ.13 వేలు చొప్పున వారి తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. మిగతా రెండు వేల రూపాయలు స్కూళ్ల నిర్వహణకు వినియోగిస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకానికి అమ్మ ఒడి మార్గదర్శకాలనే అమలు చేస్తున్నామని చెప్పారు. పీ–4కు ఆడబిడ్డ నిధి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు నిరుద్యోగ భృతి అనుసంధానం చేశామన్నారు. ఈ నెల 20న కేంద్రం రైతులకు డబ్బులు వేస్తుందని, అదే రోజు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రం తొలి వాయిదా ఇస్తుందన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తామని, దీంతో సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ అమలు చేసినట్లేనని తేల్చి చెప్పారు. తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై దళితులను బహిరంగంగా లాఠీలతో కొట్టిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్‌ జగన్‌ ఎలా వెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘దేవతల రాజధాని అమరావతిని వేశ్యల నగరం అంటారా... ఎంత కొవ్వు ఎక్కింది.. మీడియా ఏం చేస్తోంది.. ఆ అంశాన్ని డైవర్ట్‌ చేయడానికే జగన్‌ 15 వేల మందితో పొగాకు రైతుల దగ్గరకు వెళ్లి రౌడీయిజం చేశారు. పొగాకు క్వింటా రూ.12 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నాం. రాజకీయ ముసుగులో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తే ఉపేక్షించేది లేదు. తీవ్రవాదులపైనే పోరాటం చేసిన వాడిని. ప్రజల భద్రత విషయంలో రాజీపడను. ఏం చేయాలో చేసి చూపిస్తా’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు నడుస్తోందని మంత్రి లోకేశ్‌ అన్నారు. 60 శాతం కుటుంబాలకు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

Sakshi Guest Column On Bangladesh elections4
ఇలాంటి ఎన్నికలతో అనిశ్చితి పోతుందా?

వచ్చే ఏడాది ఏప్రిల్‌ మొదటి పక్షంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్‌ యూనస్‌ ప్రకటించారు. అసలు ఆయనకు అధికారాన్ని ప్రజా ప్రతినిధులకు అప్పగించే ఉద్దేశం ఉందా అనీ ఆయన విమర్శకులు, ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్న తరుణంలో, ఎన్నికలను ప్రకటించడం ద్వారా వారి నోటికి తాళం వేసే ప్రయత్నం చేశారు.బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని బలవంతంగా గద్దెదింపి పది నెలలు గడుస్తున్నా, తాత్కాలిక ప్రభుత్వం దేశంలో కొద్ది మేరకైనా శాంతి భద్రతలను పునరుద్ధరించలేకపోయింది. యూనస్‌ నిర్ణయాల పట్ల బంగ్లాదేశ్‌ సైన్యం బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తపరచింది. ఉదాహరణకు, ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో,బంగ్లాదేశ్‌ నుంచి మయన్మార్‌లోని రాఖినే రాష్ట్రం వరకు ‘మానవీయ కారిడార్‌’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ విషయమై తమను సంప్రదించనేలేదని సైన్యం ప్రకటించింది. ‘‘అన్ని పార్టీలను కలుపుకొనిపోతూ, వీలైనంత త్వరగా’’ ఎన్నికలు నిర్వహించాలని సైన్యం హితవు పలికింది. తాము లేనిదే దేశానికి వేరే దిక్కు లేదని భావించే నాయకులు ఏనాటి నుంచో అనుసరిస్తూ వస్తున్న ఎత్తుగడనే యూనస్‌ కూడా ఆశ్రయించారు. రాజీనామా చేస్తానని యూనస్‌ బెదిరించడం, ఊహించినట్లుగానే ఆయనను పదవిలో కొనసాగమని కోరడం జరిగిపోయింది.ఈ ఏడాదిలో జరగాల్సిందే!అయితే, దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను కానీ, యూనస్‌ ఉద్దేశాలపై ఉన్న సందేహాలను కానీ ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహి స్తామన్న ప్రకటన తొలగించలేకపోయింది. అవామీ లీగ్‌ తర్వాత, దేశంలో రెండవ అతి పెద్ద పార్టీ అయిన బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్పీ) కూడా ఎన్నికలకు అంత వ్యవధి తీసుకోవడాన్ని వ్యతిరేకించింది. ఈ ఏడాది ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఈ విషయంలో అదీ, సైన్యం ఒకే వైపున నిలిచాయి. పదేళ్ళ పైచిలుకుగా బీఎన్పీ వేధింపులకు, అణచివేతకు గురైంది. హసీనా ప్రభుత్వంపై ఆగ్రహావేశాలతో నిండిన దేశంలోని ప్రస్తుత సంక్షుభిత రాజకీయ వాతావరణంలో, ఎన్నికల్లో అతి పెద్ద విజయాన్ని చేజిక్కించుకోవాలని బీఎన్పీ ఉవ్విళ్ళూరుతోంది. ఎన్నికలను వచ్చే ఏడాది నిర్వహించడానికి యూనస్‌ ఒక సాకు చూపుతున్నారు. పదవిని చేపట్టినపుడు తాను మూడు వాగ్దానాలు చేశాననీ, జాతీయ ఏకాభిప్రాయ సాధన ప్రక్రియ ద్వారా రాజ్యాంగ, ఎన్నికల, ఇతర సంస్థాపరమైన సంస్కరణలు తీసుకొస్తానని అన్నా ననీ, వాటిని నెరవేర్చవలసి ఉందనీ ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతనే, ఎన్నికలు అన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. బీటలువారిన రాజకీయ, పాలనా, న్యాయ వ్యవస్థలకు కాయ కల్ప చికిత్స చేస్తేనే ఎన్నికలు సత్ఫలితాలు ఇవ్వగలవని యూనస్‌ వాదన. లేకపోతే గతంలో మాదిరిగానే, ఒకే పార్టీ పాలన కిందకు దేశం వస్తుందనీ, హసీనా మూడు విడతల పాలనలో చూసిన నిరంకుశ పార్శా్వన్నే తిరిగి చూడవలసి ఉంటుందనీ అంటున్నారు. ఈ రకమైన సంస్కరణలను 2008 ఎన్నికలకు ముందే తీసుకొచ్చి ఉంటే, నేటి రక్తపాతాన్ని, రాజకీయ కల్లోల పరిస్థితులను నివారించగలిగి ఉండేవారమనే అభిప్రాయం దేశంలోని కొన్ని వర్గాల్లో ఉంది. అవామీని దూరం చేయకూడదు!ప్రతి పార్శా్వన్నీ అధ్యయనం చేసి మార్పులను సూచించేందుకు యూనస్‌ ఆరు కమిషన్లను ఏర్పాటు చేశారు. అవి నివేదికలను కూడా సమర్పించాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన ‘జాతీయ ఏకాభిప్రాయ కమిషన్‌’ సంస్కరణలపై సర్వతోముఖ అంగీకారాన్ని కుదిర్చే పనిలో ఉంది. కానీ, అటువంటి ఏకాభిప్రాయం కనుచూపు మేరలో కనబడకపోవడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. బీఎన్పీకి అధికారం పదేళ్ళుగా అందని మానిపండుగానే ఉన్న ప్పటికీ, దాని నాయకురాలు ఖలీదా జియా ఏళ్ళ తరబడి జైల్లో మగ్గి నప్పటికీ దాని రాజకీయ చతురత ఏమాత్రం మొక్కవోలేదు. సంస్క రణలపై ఏకాభిప్రాయం కొరవడటాన్ని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయకూడదని అది పేర్కొంది. ఎన్నికలను వాయిదా వేస్తూ పోవడం వల్ల దేశంలో అల్లకల్లోలం తీవ్రరూపం దాల్చవచ్చనే భయాలున్నాయి. పరిస్థితులు మరింత దిగజారి ఎన్నికల నిర్వహణే అసాధ్యంగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అవామీ లీగ్‌ను నిషేధించి, ఎన్నికల్లో పాల్గొనడానికి లేకుండా చేయడం వల్ల సంస్కరణలు, ఏకాభిప్రాయ సాధనకు సంబంధించిన మాటలంతా శుష్క వాగ్దానాలుగానే కనిపిస్తున్నాయి. హసీనా, ఆమె ఆంతరంగిక పరివారంలోని అనేక మంది నాయకులు ఢిల్లీలో అజ్ఞాత జీవితం గడుపుతూండటంతో ఆమె పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులు స్వదేశంలో లక్ష్యంగా మారుతున్నారు. అవామీ లీగ్‌ బక్క చిక్కిన స్థితిలో ఉన్నప్పటికీ, అది ఎన్నికల్లో పాల్గొనకపోతే, బంగ్లా దేశ్‌కు చెందిన అనేక సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను ముందుకు తెచ్చినా అవి నిష్ప్రయోజనమైనవే అవుతాయి. ఒక రాజ కీయ పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచడం వల్ల రాజకీయ, సామా జిక విభేదాలు మరింత పెరుగుతాయి. హసీనా చేసిన అనేక తప్పిదాలు పునరావృత్తమయ్యేలా ఇది తిరిగి బాటలు పరచడమే అవుతుంది.బలం పెంచుకుంటున్న జమాత్‌!మరోవైపు, దేశ విముక్తికి ముందు నెలల్లో, పాకిస్తాన్‌ సైన్యంతో చేతులు కలిపి అత్యాచారాలకు ఒడిగట్టిన జమాత్‌–ఏ–ఇస్లామీకి జవ జీవాలు నింపే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఒక రాజకీయ పార్టీగా జమాత్‌కున్న రిజిస్ట్రేషన్‌ గతంలో రద్దయింది. జాతీయ రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు ఆ పార్టీ నియమావళి విరుద్ధంగా ఉందంటూ హసీనా కనుసన్నల్లోని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో జమాత్‌ పార్టీ 2013లో జరిగిన ఎన్నికల్లో పాల్గొనలేకపోయింది. హసీనా ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు’ జమాత్‌ నాయకుడు అజహరుల్‌ ఇస్లామ్‌ను విచారించి, దోషిగా ప్రకటిస్తే, ప్రభుత్వం గత నెలలో ఆయనను విడుదల చేసింది. అప్పట్లో జమాత్‌ నాయకులు కోర్టు విచారణలను పక్షపాతంతో కూడినవిగా, సందేహాస్పదమైనవిగా ఆక్రోశించారు. వైచిత్రి ఏమిటంటే, బంగ్లాదేశ్‌ను సరైన బాటలో పెట్టాలని కోరుకుంటున్నట్లు చెబుతున్న యూనస్‌ ప్రభుత్వం... అవినీతి ఆరోపణలపైన, ‘మాన వాళిపై చేసిన నేరాలకు’గాను హసీనాను విచారించడానికి అదే కోర్టును వినియోగించుకుంటోంది. ఆమె లేకుండానే చేసే ఆ విచారణ ఫలితం ఎలా ఉండబోతోందో ముందే తెలుసు. హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్‌ డిమాండ్‌కు భారత్‌ అంగీకరించకపోవచ్చు. ఈ అంశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత కుంగదీస్తుంది. అవామీ లీగ్‌ కూడా ఎన్నికల్లో పాలుపంచుకునేట్లు ప్రభుత్వంపై సైన్యం ఒత్తిడి తేగలదన్నదే ఆ పార్టీకి ఆశాకిరణంలా ఉంది. బీఎన్పీ మాజీ మిత్రపక్షమైన జమాత్‌ ఈసారి సొంతంగా ఎక్కువ విజయాలు సాధించగలమని ధీమాతో ఉంది. ఎన్నికల నిర్వహణను అది కూడా గాఢంగా కోరుకుంటున్నప్పటికీ, దానికి వ్యవధి తీసుకున్నా ఫరవాలేదని భావిస్తోంది. ఎన్నికలను 2026 మధ్యలో నిర్వహించాలని జమాత్‌ చేస్తున్న డిమాండ్‌కు యూనస్‌ నిర్ణయించిన ఏప్రిల్‌ ముహూర్తం దగ్గరగానే ఉంది. ఈలోగా క్షేత్ర స్థాయిలో తన పార్టీని పటిష్ఠపరచుకోవడానికి ఆ కాలం కలిసొస్తుంది. అవామీ లీగ్‌ స్థాపకుడు, జాతిపిత షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ ఇంటిని లూటీ చేసి నిప్పుపెట్టి ఉండవచ్చుగాక. కరెన్సీ నోట్ల నుంచి ఆయన ఫోటోను తొలగించి ఉండవచ్చుగాక. కానీ, బంగ్లాదేశ్‌ 1971 మార్చిలో స్వాతంత్య్ర ప్రకటన చేసుకున్న తర్వాత సాగిన హత్యలు, అత్యాచారాల జ్ఞాపకాలను ప్రజల స్మృతిపథం నుంచి తుడిచేయడం అంత తేలిక కాదు. ‘పార్టీ సభ్యుల గత చర్యలకు’ జమాత్‌ అధినేత షఫీకుర్‌ రహమాన్‌ క్షమాపణ కోరినంతమాత్రాన సరిపోదు. బంగ్లా దేశ్‌తో సంబంధాలను ‘సాధారణీకరించుకోవాలని’ పాకిస్తాన్‌ పెట్టు కున్న లక్ష్యం కూడా అందుకే నెరవేరకపోవచ్చు.నిరుపమా సుబ్రమణియన్‌వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Sakshi Editorial On Air India Plane Crash At Gujarat Ahmedabad5
ఆకాశంలో విషాదం!

గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా సంస్థ విమానం బోయింగ్‌–787–8 డ్రీమ్‌లైనర్‌ టేకాఫ్‌ అయిన కాసేపటికే గురువారం ప్రమాదానికి లోనై కూలిపోవటం ఎంతో విషాదకరం. మన విమానాలు ఎంతో సురక్షితమైనవనీ, ప్రమాదాలకు ఆస్కారం లేనివనీ పేరుంది. ఇప్పుడు కూలిపోయిన విమానం పదకొండేళ్లుగా వినియోగంలో ఉంది. ఈ తరహా విమానాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ఆలోచన కూడా ఉంది. ఇంతలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రయాణికుల్లో గుజరాత్‌ మాజీ ముఖ్య మంత్రి విజయ్‌ రూపానీ సహా 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్‌ పౌరులు, ఏడుగురు పోర్చుగల్‌ వాసులు, కెనడావాసి ఒకరు వున్నారని ఎయిరిండియా సంస్థ ప్రకటన చెబు తోంది. వీరిలో ఒక్కరు గాయాలతో బయటపడ్డారు. భవనంపై ఈ విమానం కూలడంతో అందులో కూడా మరణాలు సంభవించాయని, చాలామంది గాయపడ్డారని అంటున్నారు. వర్తమాన యుగంలో దేశాల మధ్య అనుసంధానం బాగా పెరిగింది. వ్యాపారం, వాణిజ్యం, చదువు, ఉపాధి, పర్యాటకం లాంటి ఎన్నెన్నో అవసరాల నిమిత్తం ఒకచోటనుంచి మరో చోటుకు ప్రయాణిస్తున్నవారి సంఖ్య పదేళ్ల క్రితంతో పోల్చినా ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు సంపన్న వర్గాల సొంతం అను కునే విమానయానం ఇవాళ మధ్యతరగతి పౌరులకు సైతం జీవితావసరంగా మారింది. ఎప్పటికప్పుడు అందుబాటులోకొస్తున్న సాంకేతికతలు విమానయానాన్ని సురక్షితం చేశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మానవ తప్పిదాలకు ఆస్కారం ఉంటుంది గనుక విమాన గమనాన్నీ, దాని తీరుతెన్నులనూ నిర్దేశించగల మెకానికల్, హైడ్రో మెకానికల్‌ నియంత్రిత వ్యవస్థలు ప్రవేశించాయి. ఇందువల్ల పైలెట్‌ ఒక కమాండ్‌ ఇవ్వగానే దానికి సంబంధించిన అనుబంధ మార్పులన్నీ ఒకదాని వెంబడి మరోటి వేగంగా పూర్తవుతాయి. ఈ క్రమంలో ఎక్కడ లోపం కనిపెట్టినా సెన్సర్లు గుర్తిస్తాయి. ఆ వెనకే తక్షణం సరిచే యగల వ్యవస్థలకు సంకేతాలిస్తాయి. ఏకకాలంలో అనేక పనుల్ని క్షణాల్లో చేయగలిగే ఈ వ్యవస్థల కారణంగా పైలెట్ల పని గతంతో పోలిస్తే చాలా మేరకు తగ్గిందనే చెప్పాలి. అయితే పైలెట్‌ సొంతంగా ఆలోచించాల్సిన అవసరం లేకపోవటం ఇందులోని బలహీ నత. ఏ వృత్తిలోనైనా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగినవెన్నో ఉంటాయి. అన్నీ యంత్రాలే చేయటం ఆ అనుభవాలకు పరిమితులు విధిస్తుంది. మరి ఇంత సాంకేతికాభివృద్ధి జరిగినా ప్రమాదం ఎలా సంభవించిందన్నదే ప్రశ్న. ఒక మాదిరి విశాలంగా, ఒకేసారి 290 మంది ప్రయాణించగల ఈ మోడల్‌ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. ఎక్కడా ఆగకుండా ఏకబిగిన వేలాది కిలోమీ టర్లు ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అయినా ఈ విషాదం ముంచుకొచ్చింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం చోటుచేసుకుని ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పైలెట్‌ నుంచి తక్షణ సాయం అవసరమని సూచించే ‘మేడే కాల్‌’ కూడా అందింది. ఆ మరుక్షణమే విమానం ప్రమాదంలో చిక్కుకుంది. దూరప్రయాణం కనుక ఇంధనం అధికంగా ఉంది. దాని వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమానాశ్రయం చుట్టుపక్కల ఆవాసాలుండటం ఒక సమస్య. అందువల్ల ఆహారం కోసం వచ్చే పక్షులు విమానాలకు ముప్పు తెస్తాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో 92 శాతం వరకూ పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చంటారు. మహా అయితే అత్యవ సర ల్యాండింగ్‌ తప్పకపోవచ్చు. కానీ ఆ మిగిలిన 8 శాతం మేర ముప్పు పొంచివున్నట్టే లెక్క. పక్షుల గుంపు విమాన మార్గంలో అడ్డు తగలటం, దానికుండే రెండు ఇంజన్లలోనూ అవి చిక్కు కోవటం వంటి కారణాలు ప్రమాదానికి దోహదపడ్డాయా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఈ డ్రీమ్‌లైనర్‌ రకం విమానాల్లో నిర్వహణా లోపాలున్నాయని చాన్నాళ్లుగా ఫిర్యాదు లందుతున్నాయి. వాటి పర్యవసానంగా విమానాలు కూలిపోవటం వంటివి చోటుచేసుకోలేదుగానీ అవి భారీ కుదుపులకు లోనై ప్రయాణికులు గాయపడిన ఉదంతాలున్నాయని ఏవియేషన్‌ సేఫ్టీ నెట్‌ వర్క్‌ (ఏఎస్‌ఎన్‌) గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు జనవరిలో అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ విమానం ప్రయాణంలో ఉండగా దానికి చిల్లుపడి చొచ్చుకొచ్చిన పెనుగాలి ధాటికి ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. అప్రమత్తమైన పైలెట్‌ చాకచక్యంగా కిందకు దించటంతో ముప్పు తప్పింది. విమానం ఫ్యూజలాజ్‌ (ప్రయాణికులు కూర్చునే బాడీ) నిర్మాణం సక్రమంగా లేదని, అందువల్ల ముప్పు ఏర్పడే అవకాశమున్నదని బోయింగ్‌లో పనిచేసిన ఒక ఇంజనీర్‌ నిరుడు వెల్లడించినప్పుడు సంస్థ కొట్టిపారేసింది. విస్తృతంగా పరీక్షలు జరిపాక వెంటనే సమస్యాత్మకం అయ్యేదేమీ లేదని ప్రకటించింది. అయితే ఈ కంపెనీ రూపొందించిన 737 రకం విమానాలు రెండు 2018, 2019 సంవత్సరాల్లో కుప్పకూలి 346 మంది మరణించారు. ఈ రెండు ఉదంతాల్లోనూ తన నేరసంబంధ బాధ్యత నుంచి తప్పించుకోవటానికి అమెరికా ప్రభుత్వంతో గత నెలలోనే ఒప్పందానికొచ్చింది. ప్రభుత్వ పర్యవేక్షణను తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు భారీయెత్తున జరిమానా చెల్లించింది. విమానాల తయారీలో నాణ్యతనూ, భద్రతనూ మరింత పెంచుతామని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఈ దురదృష్టకర ఘటనపై జరిగే దర్యాప్తులో ఉత్పాదక సంబంధ లోపాలపై కూడా దృష్టి పెట్టాల్సివుంది. ఇదే సమయంలో విమానయాన సంస్థలన్నీ భద్రతపై మరింత శ్రద్ధపెట్టి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి.

The WTC final is going to be interesting6
రెండో రోజూ 14 వికెట్లు

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ రెండో రోజు ముగిసేసరికే ఉత్కంఠభరిత స్థితికి చేరింది. గురువారం కూడా పేసర్ల జోరు కొనసాగడంతో తొలి రోజులాగే మొత్తం 14 వికెట్లు నేలకూలాయి. ముందుగా కమిన్స్‌ ధాటికి దక్షిణాఫ్రికా తడబడి ఆధిక్యం కోల్పోగా... ఆ తర్వాత రబాడ, ఇన్‌గిడి దెబ్బకు ఆసీస్‌ బ్యాటర్లు కూడాచేతులెత్తేశారు. అయితే ఇప్పటికే ఆధిక్యం 200 దాటిన ఆ్రస్టేలియాదే కాస్త పైచేయిగా కనిపిస్తుండగా... చివరి రోజు సఫారీ టీమ్‌ ముందు ఎంతటి లక్ష్యం ఉంటుందనేది ఆసక్తికరం. లండన్‌: ఆ్రస్టేలియా డబ్ల్యూటీసీ ట్రోఫీని నిలబెట్టుకుంటుందా... దక్షిణాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంటుందా అనేది శుక్రవారమే తేలే అవకాశం ఉంది. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఫైనల్లో మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అలెక్స్‌ కేరీ (50 బంతుల్లో 43; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా... ప్రస్తుతం ఆసీస్‌ ఓవరాల్‌ ఆధిక్యం 218 పరుగులకు చేరింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 43/4తో ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 57.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆ్రస్టేలియాకు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది. బెడింగ్‌హామ్‌ (45; 6 ఫోర్లు), బవుమా (36; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. కమిన్స్‌ (6/28) ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. 12 పరుగులకు 5 వికెట్లు... రెండో రోజు బవుమా, బెడింగ్‌హామ్‌ భాగస్వామ్యంతో జట్టు పరిస్థితి మెరుగ్గా కనిపించింది. లబుషిషేన్‌ అద్భుత క్యాచ్‌కు బవుమా వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. బవుమా, బెడింగ్‌హామ్‌ ఐదో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ఆ తర్వాత బెడింగ్‌హామ్‌ కొద్దిసేపు పోరాడాడు. అయితే లంచ్‌ తర్వాత కమిన్స్‌ ధాటికి దక్షిణాఫ్రికా ఒక్కసారిగా కుప్పకూలింది. 126/5తో ఉన్న జట్టు 12 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో వెరీన్‌ (13), యాన్సెన్‌ (0)లను అవుట్‌ చేసిన కమిన్స్‌... బెడింగ్‌హామ్‌నూ పెవిలియన్‌కు పంపించి ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేసుకున్నాడు. కేశవ్‌ మహరాజ్‌ (7) రనౌట్‌ కాగా, రబాడ (1) వికెట్‌తో సఫారీల ఇన్నింగ్స్‌ ముగిసింది. టపటపా... తొలి ఇన్నింగ్స్‌కంటే మెరుగైన ప్రదర్శనతో ప్రత్యర్థికి సవాల్‌ విసరాల్సిన ఆ్రస్టేలియా బ్యాటింగ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మరింత పేలవంగా సాగింది. ఓపెనర్లు లబుషేన్‌ (22), ఖ్వాజా (6) తొలి 10 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడారు. దాంతో ఆసీస్‌కు సరైన ఆరంభం లభించినట్లు అనిపించింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా జట్టు పతనం మొదలైంది.ఒకే ఓవర్లో ఖ్వాజా, గ్రీన్‌ (0) లను రబాడ పెవిలియన్‌ పంపించగా, యాన్సెన్‌ చక్కటి బంతితో లబుషేన్‌ను అవుట్‌ చేశాడు. స్మిత్‌ (13) ఇన్‌గిడి బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వగా... ‘రివ్యూ’ లో దక్షిణాఫ్రికా ఫలితం సాధించింది. వెబ్‌స్టర్‌ (9), హెడ్‌ (9), కమిన్స్‌ (6) కేవలం 7 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. కేరీ, స్టార్క్‌ (16 బ్యాటింగ్‌) 8వ వికెట్‌ కు 61 పరుగులు జోడించి జట్టు ను ఆదుకున్నారు. దాంతో ఆసీస్‌ ఓవరాల్‌ ఆధిక్యం 200 దాటింది.‘హ్యాండిల్డ్‌ ద బాల్‌’ వివాదం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వెబ్‌స్టర్‌ వేసిన 49వ ఓవర్లో బెడింగ్‌హామ్‌ బ్యాట్‌ను తాకిన బంతి అతని కాలి ప్యాడ్‌ ఫ్లాప్‌లోకి వెళ్లింది. అది కింద పడే లోపు క్యాచ్‌ అందుకునేందుకు ఆసీస్‌ కీపర్‌ కేరీ ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో బెడింగ్‌హామ్‌ తన చేత్తో బంతిని తీసి కింద విసిరేశాడు. దీనిపై స్మిత్, ఖ్వాజా ‘హ్యాండిల్డ్‌ ద బాల్‌’ గురించి అప్పీల్‌ చేశారు. దీనిపై ఫీల్డ్‌ అంపైర్లు గాఫ్‌నీ, ఇల్లింగ్‌వర్త్‌ చర్చించి అప్పటికే ‘డెడ్‌బాల్‌’ అయిందని ప్రకటిస్తూ నాటౌట్‌గా తేల్చారు. అయితే రీప్లేలు చూస్తే బంతి ప్యాడ్‌లో ఇరుక్కుపోకుండా ఇంకా ‘రోలింగ్‌’లోనే ఉండటం కనిపించింది. అది స్పష్టంగా అవుట్‌ అని, మూడో అంపైర్‌ను సంప్రదించకుండా ఫీల్డ్‌ అంపైర్లు వేగంగా నిర్ణయం వెలువరించారని దీనిపై తీవ్ర చర్చ సాగింది. 300 టెస్టుల్లో ప్యాట్‌ కమిన్స్‌ వికెట్ల సంఖ్య. ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆ్రస్టేలియా బౌలర్‌గా నిలిచిన కమిన్స్‌ 68 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరాడు. స్కోరు వివరాలుఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (బి) స్టార్క్‌ 0; రికెల్టన్‌ (సి) ఖ్వాజా (బి) స్టార్క్‌ 16; ముల్డర్‌ (బి) కమిన్స్‌ 6; బవుమా (సి) లబుషేన్‌ (బి) కమిన్స్‌ 36; స్టబ్స్‌ (బి) హాజల్‌వుడ్‌ 2; బెడింగ్‌హామ్‌ (సి) కేరీ (బి) కమిన్స్‌ 45; వెరీన్‌ (ఎల్బీ) (బి) కమిన్స్‌ 13; యాన్సెన్‌ (సి అండ్‌ బి) కమిన్స్‌ 0; మహరాజ్‌ (రనౌట్‌) 7; రబాడ (సి) వెబ్‌స్టర్‌ (బి) కమిన్స్‌ 1; ఇన్‌గిడి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (57.1 ఓవర్లలో ఆలౌట్‌) 138. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–25, 4–30, 5–94, 6–126, 7–126, 8–135, 9–138, 10–138. బౌలింగ్‌: స్టార్క్‌ 13–3–41–2, హాజల్‌వుడ్‌ 15–5–27–1, కమిన్స్‌ 18.1–6–28–6, లయన్‌ 8–3–12–0, వెబ్‌స్టర్‌ 3–0–20–0. ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్‌: లబుషేన్‌ (సి) వెరీన్‌ (బి) యాన్సెన్‌ 22; ఖ్వాజా (సి) వెరీన్‌ (బి) రబాడ 6; గ్రీన్‌ (సి) ముల్డర్‌ (బి) రబాడ 0; స్మిత్‌ (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 13; హెడ్‌ (బి) ముల్డర్‌ 9; వెబ్‌స్టర్‌ (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 9; కేరీ (ఎల్బీ) (బి) రబాడ 43; కమిన్స్‌ (బి) ఇన్‌గిడి 6; స్టార్క్‌ (బ్యాటింగ్‌) 16; లయన్‌ (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (40 ఓవర్లలో 8 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–28, 2–28, 3–44, 4–48, 5–64, 6–66, 7–73, 8–134. బౌలింగ్‌: రబాడ 11–0–44–3, యాన్సెన్‌ 12–3–31–1, ముల్డర్‌ 6–0–14–1, ఇన్‌గిడి 9–0–35–3, మహరాజ్‌ 2–0–10–0.

Gurukul Schools Building owners demand for rent arrears7
గురుకులాలకు తాళాలు!

సాక్షి, హైదరాబాద్‌: అద్దె బకాయిలు భారీగా పేరుకుపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న పలు గురుకుల పాఠశాలలకు యజమానులు తాళాలు వేశారు. వేసవి సెలవుల అనంతరం గురువారం గురుకులాలకు వచ్చిన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు గేట్లకు వేసిన తాళాలు దర్శనమిచ్చాయి. దీంతో ప్రిన్సిపాళ్లు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు చర్చలు జరపడంతో మధ్యాహ్నం తర్వాత కొన్నిచోట్ల యజమానులు తాళాలు తీశారు. గురుకులాలూ షురూ..: వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పాఠశాల లు తెరుచుకున్నాయి. మిగతా స్కూళ్లతో పాటు గురుకుల విద్యా సంస్థలు సైతం పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకల్లా తరగతులు ప్రారంభం కావాల్సి ఉండడంతో గంట ముందే ప్రిన్సిపాళ్లు పాఠశాలలకు చేరుకున్నారు. అయితే ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న పలు భవనాలకు పాఠశాల సిబ్బంది వేసిన తాళాల స్థానంలో భవన యజమానుల తాళాలు కనిపించాయి. అద్దె బకాయిలు చెల్లించే వరకు తాళాలు తీసే ప్రసక్తే లేదని యజమానులు ప్రిన్సిపాళ్లు, సిబ్బందికి స్పష్టం చేశారు. మరికొందరు తమ భవనాలు వెంటనే ఖాళీ చేయాలని తేల్చిచెప్పడంతో పాఠశాలల సిబ్బంది, బడికెళ్లేందుకు వచ్చిన పిల్లలు బయటే నిలబడాల్సి వచ్చింది.జనరల్‌ మినహా అన్నీ అద్దె భవనాల్లోనే..రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నాలుగు గురుకుల సొసైటీలుండగా... విద్యాశాఖ పరిధిలో జనరల్‌ గురుకుల సొసైటీ ఉంది. వీటి పరిధిలో 1,023 గురుకుల పాఠశాలలు, కళాశాలలున్నాయి. విద్యాశాఖ పరిధిలోని జనరల్‌ గురుకులాలన్నీ శాశ్వత భవనాల్లోనే నిర్వహిస్తుండగా..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీలకు సంబంధించిన 662 గురుకుల విద్యా సంస్థలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇందులో పలు పాఠశాలలకు యజమానులు తాళాలు వేశారు. అద్దె బకాయిలు చెల్లిస్తేనే తాళాలు తొలగిస్తామని స్పష్టం చేయగా... మరికొందరు మాత్రం భవనాలను ఖాళీ చేయాలని తేల్చిచెప్పారు. దీంతో పాఠశాల సిబ్బందితో పాటు పలువురు విద్యార్థులు గేటు బయటే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.రూ.215 కోట్ల బకాయిలుప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు నెలకు సగటున రూ.20 కోట్ల మేర అద్దె రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే గత 10 నెలలుగా అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో బకాయిల మొత్తం రూ.215 కోట్లకు చేరింది. పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలంటూ అధికారులపై సంబంధిత యజమానులు గత కొంత కాలంగా తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలోనే అద్దె చెల్లించాలంటూ యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. మరికొందరు ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తెస్తున్నారు. 63 గురుకుల పాఠశాలలను ఖాళీ చేయాలంటూ ఆయా భవనాల యజమానులు గత నెలలోనే సంబంధిత ప్రిన్సిపాళ్లకు తేల్చిచెప్పారు. అయినా ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో బిల్లులు విడుదల కాలేదు.కాస్త ఉపశమనం..గురుకుల పాఠశాలలకు తాళాలు పడే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు సంబంధించిన అద్దె బకాయిల్లో కొంతమేర చెల్లించేలా చర్యలు తీసుకుంది. దాదాపు 10 నెలల బకాయిలు ఉండగా.. మూడు నుంచి నాలుగు నెలలకు సంబంధించిన బిల్లులకు ఆర్థికశాఖ మోక్షం కలిగించింది. ఈ మేరకు నిధులను సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్లకు విడుదల చేసింది. వారు భవనాల యజమానులకు చెల్లించేందుకు గురువారం హడావుడిగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే యజమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వచ్చే త్రైమాసికంలో (జూలై నెలాఖరులో) మిగిలిన బకాయిలు విడుదల చేస్తారని, అప్పటివరకు ఓపికపట్టాలని నచ్చజెప్పడంతో, చాలాచోట్ల మధ్యాహ్నం తర్వాత యజమానులు తాళాలు తీశారు.చేసిన పనులకు బిల్లులు రాలేదని ..– సిద్దిపేట జిల్లాలో బడికి కాంట్రాక్టర్‌ తాళంచేర్యాల (సిద్దిపేట):పాఠశాల అభివృద్ధిలో భాగంగా రెండేళ్ల క్రితం చేసిన పనులకు ఇప్పటివరకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ బడికి తాళం వేసిన ఘటన సిద్దిపేట జిల్లా ఆకునూరులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆకునూరు గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెండేళ్ల క్రితం మన ఊరు – మన బడి కార్యక్రమం కింద కాంట్రాక్టర్‌ డైనింగ్‌ హాల్‌ నిర్మాణం చేపట్టి టైల్స్, విద్యుత్‌ పనులు చేశారు. ఇందుకు సంబంధించి రూ.8.5 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టర్‌ పలుమార్లు జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ గురువారం పాఠశాల పునఃప్రారంభం రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకముందే పాఠశాల గేటుకు తాళం వేశారు. అయితే విద్యాశాఖ అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నీరేష్‌ వెంటనే అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడించడంతో తాళం తీశారు.

New Bride, Headed To London To Meet Husband, On Board Flight That Crashed8
ఇటీవలే పెళ్లి, భర్త కోసం లండన్‌కు నవ వధువు.. నిమిషాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు

గాంధీనగర్‌: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ప్రయాణికుల కుటుంబాల్ని తీవ్ర విషాదాన్ని నింపింది. వారిలో నవ వధువు ఖుష్బూ రాజ్‌పురోహిత్ ఉన్నారు. ఆమె లండన్‌లో ఉంటున్న తన భర్తను కలిసేందుకు ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. కానీ అంతలోనే అనుకోని విషాదం.. నిమిషాల వ్యవధిలోనే తన భర్తను కలవాలన్న ఆమె కలను చిదిమేసింది. ఖుష్బూ రాజస్థాన్‌లోని బాలోటరా జిల్లాలోని అరాబా గ్రామ వాసి ఖుష్బూ రాజ్‌పురోహిత్ . ఆమెకు ఇటీవల మన్‌ఫూల్ సింగ్‌తో వివాహం జరిగింది. వివాహం తర్వాత తొలిసారి లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భర్తను కలిసేందుకు అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. విమాన ప్రమాదానికి ముందు ఎయిర్‌పోర్టులో ఖుష్బూ రాజ్‌ పురోహిత్‌ కుమార్తె తన తండ్రి మదన్ సింగ్‌తో దిగిన ఫొటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రిమ్‌లైనర్ విమానం టేకాఫ్‌ అయిన సెకన్ల వ్యవధిలో జనావాస్లాల్లో దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 11 మంది ఈ విమానంలో ఉన్నారు. వారిలో ఇద్దరు యూకేలో చెఫ్‌గా పని చేయడానికి వెళ్తున్న పురుషులు , ఒక మార్బుల్ వ్యాపారి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో సిబ్బంది కూడా ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడు, ఏడు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. మొత్తం ప్రయాణికుల్లో ఒక్కే ఒక్క ప్రయాణికుడు రమేష్‌ విశ్వాస్‌ కుమార్‌ మాత్రమే ప్రాణాలతో భయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, రమేష్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

May Day Call: Air India Pilot Issued Before Ahmedabad Crash9
‘మే డే.. మే డే’ అంటూ ఏటీసీకి సంకేతం!

అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనలో బ్లాక్‌ బాక్స్‌ ఏం చెబుతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం. అసలు ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగిందనేది బ్లాక్‌ బాక్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు. తాజా విమాన ప్రమాదంలో అందులో ఉన్న 242 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది దుర్మరణం పాలైనట్లు సమాచారం. అయితే విమాన ప్రమాదాలు జరిగే సమయంలో ఆ ప్రమాదానికి గ కారణాలు విప్పే బ్లాక్‌ బాక్స్‌.. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తర్వాత పదిలంగానే ఉండటంతో దీని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే విమానం ప్రమాదానికి గురి కావడానికి కొన్ని నిమిషాల ముందు ‘మేడే మేడే అంటూ ఏటీసీకి వాయిస్‌ సంకేతాలు వెళ్లాయి. విమానం ప్రమాదానికి గురౌతుందన్నప్పుడు, ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నప్పుడు మేడే మేడే అని సిగ్నల్స్‌ ఇస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కాకపోతే ప్రమాదం జరగడానికి ఎంత సేపో పట్టలేదు. విమానం పూర్తిగా డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోవడంతో కుప్పకూలిపోయింది. మే డే కాల్' అంటే ఏంటి?ఏదైనా విమాన ప్రమాదం బారిన పడే అవకాశం ఉన్నప్పుడు ఇలా పైలట్‌ దగ్గరలోని ఏటీసీకి ఈ 'మేడే కాల్' ద్వారా సిగ్నల్‌ ఇస్తారు. ప్రధానంగా విమాన ప్రయాణీకుల ప్రాణాలు ఇబ్బందుల్లో పడినప్పుడు లేదా అత్యవసరంగా ఇంజిన్ పనిచేయకపోయినప్పుడు, మంటల్లో చిక్కుకున్న సమయంలో కానీ, గాలిలో ఏదైనా పక్షిలాంటితది ఢీకొన్న సమయంలో, హైజాక్‌ సమయంలో ఈ మేడే కాల్‌ ను ఏటీసీకి అందిస్తారు. ఇలాంటి ప్రమాద సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి పైలట్ సమాచారం తక్షణమే అందించాలి. ఇలాంటి ప్రమాద సమయంలో 'మేడే.. మేడే.. మేడే' అని మూడుసార్లు ఏటీసీకి సిగ్నల్ పంపించాల్సి ఉంటుంది. దీని అర్థం ఇది జోక్ కాదు నిజంగానే ఇబ్బందులో ఉన్నామని ఇచ్చే సంకేతం. మేడే సంకేతం ఇచ్చిన వెంటనే ఏటీసీ స్పందిస్తుంది అత్యవసరం వచ్చిందని పరిగణిస్తూ రన్ వేను క్లియర్ చేసి.. అంబులెన్స్, అగ్నిమాపకదళాలని వెంటనే సిద్ధం చేస్తారు.

Air India Plane Crash A Crisis for Tata Group10
టాటా గ్రూపునకు మాయని మచ్చ..

టాటా గ్రూప్ కు చెందిన ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల కొద్దీ ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే, ఈ సంఘటన టాటా గ్రూప్‌ ప్రతిష్టాత్మక ఎయిరిండియా పునరుద్ధరణపై నీడలు కమ్మేసింది. అలాగే వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపునకు మాయని మచ్చగా మిగిలిపోనుంది.బాధిత కుటుంబాలకు రూ .1 కోటి నష్టపరిహారంప్రమాదం తర్వాత, టాటా గ్రూప్ ప్రతి బాధిత కుటుంబానికి రూ .1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్‌ భవనాన్ని పునర్నిర్మిస్తామని వాగ్దానం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండడం, ఎయిర్ ఇండియా భద్రతా ప్రోటోకాల్స్‌ను సమీక్షించడంలో టాటా గ్రూప్‌ నిబద్ధతను చైర్మన్‌ ఎన్ చంద్రశేఖరన్ నొక్కి చెప్పారు.టాటా గ్రూప్.. వందల ఏళ్ల చరిత్రటాటా గ్రూపును 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ఉక్కు, ఆటోమొబైల్స్ నుండి టెలికమ్యూనికేషన్స్, విమానయానం వరకు వివిధ పరిశ్రమలను విస్తరించి భారతదేశపు అతిపెద్ద సమ్మేళనంగా టాటా గ్రూప్‌ అభివృద్ధి చెందింది. దశాబ్దాలుగా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి ఐకానిక్ వ్యాపారాలను టాటా గ్రూప్‌ నిర్మించింది.జేఆర్‌డీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాను 1932లో జేఆర్‌డీ టాటానే టాటా ఎయిర్ లైన్స్ పేరుతో స్థాపించారు. ఇది భారతదేశ విమానయాన పరిశ్రమకు నాంది పలికింది. 1953లో భారత ప్రభుత్వం ఈ విమానయాన సంస్థను జాతీయం చేసింది. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ నిర్వహణ వ్యయాలు, పెరుగుతున్న పోటీ ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయింది.దాదాపు 69 ఏళ్ల తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూప్ తన ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించే లక్ష్యంతో 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఎయిరిండియాను తిరిగి పొందింది. అప్పటి నుండి టాటా అనేక ప్రధాన మార్పులను అమలు చేసింది.ఫ్లీట్ విస్తరణ..నవీకరణలు - ఎయిర్ ఇండియా 2023లో ఎయిర్‌బస్, బోయింగ్ నుండి 470 విమానాలకు రికార్డు స్థాయి ఆర్డర్లను ఇచ్చింది. తరువాత 2024 డిసెంబర్ లో అదనంగా 100 జెట్లను ఆర్డర్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ను ఆధునీకరించడానికి 400 మిలియన్‌ డాలర్ల రెట్రోఫిట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది.మెగా విలీనం - 2024 నవంబర్‌లో టాటా ఎయిర్ ఇండియాను విస్తారా, ఎయిర్ ఇండియా ఎస్‌ప్రెస్‌తో విలీనం చేసింది. ఇది 30 శాతం దేశీయ మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద విమానయాన సమూహాన్ని ఏర్పాటు చేసింది.ఆపరేషనల్ పునరుద్ధరణ - టాటా Vihaan.AI ప్రవేశపెట్టింది. ఇది ఫ్లీట్ ఆధునీకరణ, టెక్నాలజీ అప్ గ్రేడ్ లు, కస్టమర్ సర్వీస్ మెరుగుదలలపై దృష్టి సారించే పంచవర్ష పరివర్తన ప్రణాళిక.మార్గ విస్తరణ - ఎయిర్ ఇండియా ఇప్పుడు 191 విమానాలను నడుపుతోంది. 43 దేశీయ, 41 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. వీటిలో ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement