బాహుబలి-2కు లైన్క్లియర్..
బాహుబలి-2 చిత్ర విడుదలకు నెలకొన్న చిక్కులు సమసిపోయాయి. కొద్ది రోజులుగా ఈ చిత్ర విడుదలపై గందరగోళ పరిస్థితి నెలకొంది. సమస్య కోర్టు గుమ్మం వరకూ వెళ్లింది. వివరాల్లోకెళితే బాహుబలి ఘన విజయం తరువాత దానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం బాహుబలి-2. ప్రబాస్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సృష్టికర్త రాజమౌళి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నై హైకోర్టులో ఏసీఈ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.
అందులో శ్రీ గ్రీన్ ప్రొడక్షన్ అధినేత సవరణన్ బాహుబలి-2 చిత్ర తమిళనాడు విడుదల హక్కులను పొందారన్నారు. ఆయన 2016లో రూ.1.18కోట్లు రుణం అడిగారని, ఆ మొత్తాన్ని తాము ప్రభుదేవా స్టూడియోస్ పేరు మీద ఇవ్వడం జరిగిందన్నారు. ఆ మొత్తాన్ని రూ.10 లక్షలు వడ్డీతో సహా బాహుబలి-2 విడుదలకు ముందు చెల్లిస్తానని సవరణన్ పిబ్రవరిలో అగ్రిమెంట్ రాసి ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు మాట మార్చిన సరవణన్ బాహుబలి-2 చిత్ర విడుదల తరువాత డబ్బు చెల్లిస్తానంటున్నారని, తమకు సొమ్ము చెల్లించేవరకు బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది.
బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించడానికి నిరాకరించిన న్యాయమూర్తి ఈ పిటిషన్కు బదులు దాఖలు చేయాల్సిందిగా శ్రీ గ్రీన్ ప్రొడక్షన్ అధినేత సవరణన్కు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ కేసు మంగళవారం విచారణకు రాగా ఇరు తరఫు న్యాయవాధులు కోర్టుకు హాజరై సమస్యను కోర్టు బయట పరిష్కరించుకున్నట్లు తెలియజేయడంతో విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.