ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ టీడీపీ మహిళా నేత
అట్లూరు: ఎర్రచందనం దుంగలను తరలిస్తూ టీడీపీ మహిళా నేత ఒకరు పోలీసులకు పట్టుపడ్డారు. వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం భాకరాపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకురాలు ఏకుల రాజేశ్వరి శుక్రవారం తన స్కార్పియో వాహనంలో ఎర్రచందనం దుంగలతో బద్వేలువైపు బయల్దేరారు. ఓ మహిళ ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారమందడంతో అట్లూరు పోలీసులు అప్రమత్తమై.. కడప-బద్వేలు మార్గం మధ్యలో ఆమె వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.
వాహనంలో 16 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దీంతో ఆమెను అరెస్ట్చేసి పోలీసుస్టేషన్కు తరలించి.. కేసు నమోదు చేశారు. తాను టీడీపీ నేతనని, కావాలంటే నిర్ధారించుకోండంటూ ఆమె టీడీపీ ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడించారు. ఆ తర్వాత ఆమెను వదిలిపెట్టాలంటూ టీడీపీ ప్రముఖులనుంచి పోలీసులపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. దిక్కుతోచని పోలీసులు ఆమె అరెస్ట్ విషయాన్ని గోప్యంగా ఉంచారు.