సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా ఆఫర్
ముంబై, సాక్షి: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా 60 ఏళ్లు లేదా అంతకు పైబడిన వయసుగలవారికి టికెట్ ధరలో 50 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. ఇది ఎకానమీ క్లాస్కు మాత్రమే వర్తించనుంది. బేస్ ధరలో 50 శాతం చెల్లించడం ద్వారా టికెట్ను బుక్ చేసుకోవచ్చు. ఈ పథకాన్ని పొందగోరే వ్యక్తులు వయసును నిర్ధరించే వోటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ లేదా ఏ ఇతర ఐడెంటిటీ కార్డ్ను కలిగి ఉండాలి. దేశంలో ఏ ప్రాంతానికైనా టికెట్ను బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా వర్గాలు ఈ సందర్భంగా తెలియజేశాయి. ప్రయాణ సమయానికి(డిపార్చర్కు) కనీసం వారం రోజుల ముందువరకూ ఈ ఆఫర్ను వినియోగించుకునేందుకు వీలుంటుందని వెల్లడించాయి.
పిల్లలకూ
రెండేళ్ల వయసులోపు పిల్లలకు సైతం టికెట్ ధరలో తగ్గింపు అమలుకానున్నట్లు ఎయిర్ ఇండియ వర్గాలు వెల్లడించాయి. అయితే ఒక బిడ్డకు మాత్రమే అదికూడా రూ. 1,250 కూపన్, పన్నులు వర్తిస్తాయని తెలియజేశాయి. ఎయిర్ ఇండియా నిర్వాహక విమానాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నాయి. మిగిలిన పూర్తి వివరాలకు ఎయిర్ ఇండియా వెబ్సైట్ను సందర్శించమని తెలియజేశాయి. కాగా.. బేస్ ధరకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని, ఫ్యూయల్ సర్చార్జీ, సర్వీస్ ఫీజు తదితరాలలో తగ్గింపు లభించకపోవచ్చని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు.