'చంద్రబాబు బీసీల ఉసురు తీస్తున్నారు'
రామచంద్రపురం: తెలుగుదేశం బీసీల పార్టీ అని పదేపదే ప్రకటించే సీఎం చంద్రబాబు బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, పైగా వివిధ రూపాల్లో బీసీల ఉసురు తీస్తున్నారని ఏపీ బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు.
తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాబు కావాలంటే బాబు రావాలి అని ఎన్నికల ముందు ఊదరగొట్టిన టీడీపీ.. తీరా అధికారంలోకి వచ్చాక బీసీ యువత అత్యధికంగా ఉపాధి పొందుతున్న కాంట్రాక్టు ఉద్యోగాలను ఊడబెరుకుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీసీలపై దాడులు పెరిగాయని, ఏలూరు ఇందుమతి హత్య తదితర సంఘటనలు సీఎం దృష్టికి తీసుకువెళ్లినా తీసుకున్న చర్యలు శూన్యమని తెలిపారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. మంజునాథ కమిషన్ ఏమి చెబుతుందోనని అందరూ ఎదురు చూస్తుంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న హోంమంత్రి కాపులకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ఏవిధంగా చెబుతారని ప్రశ్నించారు.