breaking news
beauty industry
-
బర్త్ డే నాడు కొత్త బిజినెస్లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!
బాలీవుడ్ భామ, ఆదిపురుష్ హీరోయిన్ బర్త్డే గాళ్ కృతి సనన్ సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తన సొంత స్కిన్కేర్ బ్రాండ్ను గురువారం లాంచ్ చేసింది. ప్రముఖ బ్రాండ్ mCaffeine మాతృ సంస్థ PEP టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తన బ్యూటీ బ్రాండ్ హైఫెన్తో బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే న సొంత ప్రొడక్షన్ హౌస్, బ్లూ బటర్ఫ్లై ఫిల్మ్స్ను ప్రారంభించిన కృతి సనన్ ఇక బిజినెస్ ఉమన్గా రాణించాలనుకుంటోంది. ఈ వెంచర్ ద్వారా బ్యూటీ వ్యాపార ప్రపంచంలో ఇతర సెలబ్రిటీల సరసన చేసింది. (హానర్ లవర్స్కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్ఫోన్తో రీఎంట్రీ!) జూలై 27 తన బర్త్ డే సందర్భంగా కృతి సనన్ పీఈపీ టెక్నాలజీస్తో భాగస్వామ్యంతో హైఫెన్ అనే ప్రీమియమ్ స్కిన్కేర్ లైన్ను పరిచయం చేసింది. హైఫెన్ బ్రాండ్ ద్వారా వినియోగదారులకు అధిక-నాణ్యత చర్మ సంరక్షణ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యం అని పేర్కొంది. దీనికి సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్యూటీ బ్రాండ్ లాంచ్ వీడియోలో కృతి అద్భుతంగా కనిపించింది. చర్మ సంరక్షణపై తనకున్న అభిరుచిని పాషన్గా మార్చుకోవడానికి ఎలా సిద్ధంగా ఉన్నానో తెలిపింది. హైఫన్లో PEP టెక్నాలజీస్ 30 కోట్లతో మెజారిటీ వాటాదారుగా ఉంటుంది. కృతి సనన్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్గా ఉండనుంది. (ప్రపంచంలో టాప్ రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీ ఏదో తెలుసా? ) హైఫన్ మూడు ముఖ్యమైన రోజువారీ ఉత్పత్తులైన బారియర్ కేర్ క్రీమ్, గోల్డెన్ అవర్ గ్లో సీరమ్ , ఆల్ ఐ నీడ్ సన్స్క్రీన్ SPF 50 PA++++ని విడుదల చేసింది. అయితే ఈ బ్రాండ్ కొంతమంది బ్యూటీ లవర్స్ను ఆకట్టుకోగా, మరికొంతమంది నెటిజన్లు రియాక్షన్ భిన్నంగా ఉంది. దీపికా పడుకోన్ బ్రాండ్ను కాపీ చేసిందనికొందరు వ్యాఖ్యానించగా, టాక్స్ ఎగ్గొట్టడానికి ఇదో కొత్త ఎత్తుగడని మరికొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) కృతి సనన్ వర్క్ ఫ్రంట్ ఇక కరియర్ పరంగా నిర్మాతగా కృతి సనన్ తన తొలి చిత్రం "తీన్ పట్టి" తో ప్రేక్షకుల ముందుకు రానుంది. టైగర్ ష్రాఫ్తో కలిసి మోస్ట్ ఎవైటెడ్ మూవీ "గణపత్"లో కూడా కనిపించనుంది. దీంతోపాటు షాహిద్ కపూర్ సరసన మరోప్రాజెక్ట్కు పనిచేస్తోంది. -
బ్యూటిఫుల్ సక్సెస్ మంత్ర
సక్సెస్ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎందుకంటే అది ఆనందాన్నిస్తుంది కాబట్టి. ఆనందాలు మళ్లీ మళ్లీ కావాలి... కొత్త కొత్త రూపాల్లో రావాలి... ఇదీ సంగీతారాజేశ్ ఆకాంక్ష. స్పెషల్ ఎడ్యుకేషన్లో నిస్వార్థసేవ. ఫ్యాషన్ ఇండస్ట్రీకి కొత్త నడక. బ్యూటీ ఇండస్ట్రీ అధ్యయనం. మహిళలకు మార్కెట్ పాఠాల బోధన. అన్నింటిలో రాణిస్తున్న... ఆమె ‘సక్సెస్ మంత్ర’ ఏమై ఉంటుంది? ఓ ముప్పై– నలభై ఏళ్ల కిందట... ‘ఇది ఇంపోర్టెడ్ శారీ, మా అన్న సింగపూర్ నుంచి తెచ్చాడు’ అని ఒకరు హోదా ఒలకబోసేవారు. ‘నాది కూడా ఇంపోర్టెడే. ఫలానా నగరంలో స్మగుల్డ్ గూడ్స్ దొరుకుతాయి’ అని మరొకరు... మీకు నేనేమీ తీసిపోను అన్నంత ధీమాగా. అప్పట్లో ఇలా నడిచేవి సగటు మహిళల కబుర్లు. వాళ్లలో ఎవరికీ స్మగుల్డ్ గూడ్స్ కొనడం చట్టరీత్యా నేరమనే విషయం తెలియదు కూడా. సింథటిక్ మోజుతోపాటు ఇలాంటి హోదాల ప్రదర్శనలో మన సంప్రదాయ వస్త్రాలు తెరమరుగయ్యాయి, క్రమంగా వస్త్రాల తయారీదారులు కనుమరుగవడం కూడా మొదలైంది. అలాంటి సమయంలో గ్లోబలైజేషన్ రూపంలో వచ్చింది ఓ పెనుమార్పు. మన చేనేతలకు విదేశాల్లో అందుతున్న గౌరవాలను స్వయంగా చూసిన మన మహిళలే మన సంప్రదాయ చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్లయ్యారు. నిర్లిప్తంగా మిగిలిపోయిన చేనేత, హస్తకళాకారుల వైపు చూసింది భారతీయ ఫ్యాషన్ ఇండస్ట్రీ. అలాంటి సమయంలో పెన్ కలంకారీని పునరుద్ధరించడానికి స్వచ్ఛందంగా సేవ చేశారు సంగీతా రాజేశ్. అంతకంటే ముందు ఆమె పిల్లల చదువు వారి మానసిల్లోసానికి, మే«ధావికాసానికి దోహదం చేయాలి తప్ప బడి అంటే భయపడేలాగ ఉండకూడదని స్పెషల్ కిడ్స్ కోసం ప్రత్యేకమైన కరిక్యులమ్ తయారు చేశారు. పిల్లల్లో మేధావికాసానికి మన తాతమ్మల నుంచి ఇంట్లో ఆడుకున్న బోర్డ్గేమ్స్ దోహదం చేస్తాయని ఆచరణ లో చూపించారామె. సోషల్ మీడియా లో లక్షలాది ఫాలోవర్లున్న ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ఇప్పుడు తాజాగా ‘మనిషిని సమాజంలో ఆత్మవిశ్వాసం తో ముందుకు నడిపించే సాధనం అందంగా కనిపించడం కూడా’ అని మరో ప్రయోగానికి తెర తీశారు. ♦ స్పెషల్ పాఠాలు ‘‘నేను మధురైలో పుట్టాను, దిండిగల్లో పెరిగాను. హైదరాబాద్లో స్థిరపడిన తమిళ కుటుంబంలోని అబ్బాయితో పెళ్లయింది. అలా పాతికేళ్ల కిందట హైదరాబాద్కి వచ్చాను. నేను స్పెషల్ ఎడ్యుకేటర్ని, స్పెషల్ చిల్డ్రన్కి స్పీచ్ థెరపీ, వాళ్లకు కాన్సెప్ట్ అర్థమయ్యేటట్లు టీచింగ్ మెటీరియల్, ప్రత్యేకమైన టీచింగ్ మెథడాలజీతో క్లాసులు చెప్పి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పరీక్షలు రాయించి మెయిన్ స్ట్రీమ్కి పంపించడం నా బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్. అందులో బిజీగా ఉన్నప్పుడు కలంకారీ మీద ఆసక్తి కలిగింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో నిష్ణాతులు చేసే పెన్ కలంకారీ మీద అధ్యయనం చేశాను. వాళ్ల చేతిలో కళ ఉంది, నా దగ్గర సృజన ఉంది. ఆ రెండింటినీ కలుపుతూ కొత్త ప్యాటర్న్స్ తెచ్చాం. వాటి ఖరీదు ఎక్కువే. కానీ ఒక చీర అమ్మగలిగానంటే దానిని తయారు చేసిన కుటుంబం నెలంతా ఆకలి లేకుండా జీవించగలుగుతుంది. పెన్ కలంకారీని ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాను. వీవర్స్కి ప్రయోజనం కల్పించడంలో నా లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత చాలామంది ఇదే పంథాను అనుసరించారు. పెన్ కలంకారీ కళాకారుడికి సూచనలు ఇస్తూ... ♦ పంచడానికే జ్ఞానం! నేను ప్రధానంగా టీచర్ని కావడంతో నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను నాలో దాచుకోలేను. జ్ఞానం ఉన్నది పలువురికి పంచడానికే అన్నట్లు ఉంటాను. వినడానికి నా ఎదురుగా ఎవరూ లేకపోతే ఫేస్బుక్లో చెబుతాను. అలా తొమ్మిదేళ్ల కిందటే నేను ఎఫ్బీ వేదికగా కాస్ట్యూమ్ ప్రజెంటేషన్ ఇచ్చాను. కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఆన్లైన్లోకి వచ్చేసింది. నాకు అప్పటికే ఎనిమిది లక్షల ఫాలోవర్లున్నారు. ఆ టైమ్లో నాకు అసలైన చాలెంజ్ నా వ్యాపారాన్ని కొనసాగించడం కాదు, నా ఉద్యోగులకు జీతాలివ్వడం. రెండు వారాలు మినహా మిగతా కోవిడ్ సమయమంతా పని చేశాను. అప్పుడు షోరూమ్లు, మాల్స్లో జనం కనిపించలేదు, కానీ ఆన్లైన్లో చాలా ఎక్కువగా కొనుగోళ్లు చేశారు. ♦ అదే నా సక్సెస్ సూత్ర నేను కోవిడ్ టైమ్లో సూరత్, జైపూర్కు వెళ్లి అక్కడి నుంచి లైవ్లో డిస్ప్లే చేశాను. గంటల్లోనే కొనుగోళ్లు జరిగాయి. స్టాక్ అక్కడి నుంచే నేరుగా డెలివరీ ఇచ్చేశాను. ఒక రవాణా ఖర్చు, ఒక స్టేట్ జీఎస్టీ తగ్గిపోతే ఎంత ఆదానో ఆలోచించండి. విదేశాలకు వెళ్లాల్సిన స్టాక్ ఆగింది, మార్కెట్ చేసి పెట్టమని అడిగిన వాళ్ల స్టాక్ను ఆన్లైన్లో అమ్మేశాను. దాంతో స్టాక్ కొనుగోలుకు డబ్బు పెట్టాల్సిన అవసరం రాలేదు. అటు ఉత్పత్తిదారులు, నేను– నా ఉద్యోగులు, వినియోగదారులు... అందరికీ ప్రయోజనమే. అందుకే విన్ విన్ డీల్ ఎప్పుడూ సక్సెస్ అవుతుందని నమ్ముతాను. గృహిణులు కొంతమంది ఇంట్లోనే చిన్న స్థాయిలో దుస్తులు, ఇతర ఇంటికి అవసరమైన వస్తువుల వ్యాపారం చేస్తున్నారు. కానీ అదంతా అవ్యవస్థీకృతంగా ఉంది. అలాంటి హోమ్ సెల్లర్స్ను ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఔత్సాహిక మహిళలకు బోధన తరగతులలో పాఠాలు చెప్తున్నాను. వ్యాపారం కోసం ఓ సొంత ఫోన్ నంబరు, బ్యాంకు అకౌంట్ నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలలో శిక్షణ, మార్కెట్ మెళకువలతోపాటు డెడ్స్టాక్ను ఎలా డీల్ చేసే సులువు కూడా నేర్పిస్తున్నాను. హోమ్ సెల్లర్స్ చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే... స్నేహితులు, బంధువులలో కస్టమర్లను వెతుక్కోవడం. ఆ పొరపాటు వల్ల స్నేహితులు, బంధువులు దూరమవుతారు తప్ప, లాంగ్ టర్మ్ కస్టమర్లను ఏర్పరుచుకోవడం సాధ్యం కాదు. ప్రొఫెషన్నీ, కుటుంబ బంధాలను కలపకూడదు’’ అని తాను నేర్చుకున్న, అనుసరించిన సక్సెస్ సూత్రను వివరించారు సంగీతారాజేశ్. స్పెషల్ చాలెంజ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని బాగా అధ్యయనం చేశాను, కాబట్టే బ్యూటీకి ఉన్న ఆదరణ, మేకోవర్ అవసరాన్ని కూడా తెలుసుకోగలిగాను. ఫ్యాషన్, బ్యూటీ... ఈ రెండూ ఒకదానితో ఒకటి కలగలిసి ఉంటాయి. అందం అనేది మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సాధనం. మరి అలాంటప్పుడు అందాన్ని పెంచుకోవడానికి ఎన్నెన్నో అధునాతన సాధనాలు అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో అందంగా కనిపించడం అనే ఆకాంక్షకు ఎవరైనా ఎందుకు దూరంగా ఉండాలి? నేను వయసులో ఉన్నప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీతో పరుగులు పెట్టాను, రిటైర్మెంట్ లేకుండా ఒకచోట స్థిమితంగా ఉంటూ నిర్వహించుకోవడానికి ఇప్పుడు కొత్త కెరీర్లోకి అడుగుపెట్టాను. ఇందులో కూడా సక్సెస్ అయ్యి, మరో ఐదేళ్లలో కొత్త తరానికి పాఠాలు చెప్పే స్థాయికి చేరుతాను. నేను కెరీర్ రోల్స్ ఎన్ని మార్చినా స్పెషల్ ఎడ్యుకేటర్ రోల్లో కొనసాగుతూనే ఉంటాను. – సంగీతారాజేశ్, స్పెషల్ ఎడ్యుకేటర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
చర్మం ఒలిచేస్తున్నారు!
⇒ నేపాల్లో ఒళ్లు గగుర్పొడిచే దందా ⇒ కాస్మొటిక్ వ్యాపారానికి యువతులు, మహిళల బలి ⇒ వేశ్యావాటికలకు తరలిస్తూ అమ్మాయిల చర్మం ఒలుచుకుంటున్న వైనం ⇒ మత్తు మందు ఇచ్చి.. మంచానికి కట్టేసి.. తోలు తీసుకుంటున్న దారుణం ⇒ భారత్లో కాస్మొటిక్ ఆపరేషన్ల కోసం తెల్ల చర్మానికి పెరుగుతున్న గిరాకీ ⇒ దనవంతుల శరీర సౌష్టవం పెంపు, సౌందర్య శస్త్రచికిత్సలలో వినియోగం ⇒ భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి.. మళ్లీ అక్కడ్నుంచి కాస్మొటిక్ ఉత్పత్తులుగా దిగుమతి చర్మం తీసుకునే మహిళకు చెల్లించేది... (రూ.) 5,000 - 10,000 ఏజెంటుకు చెల్లించేది... (రూ.) 30,000 - 50,000 వంద చదరపు అంగుళాలు.. లక్ష రూపాయలు..! ఇది చర్మం విలువ! మనిషి చర్మం. అందునా మహిళ చర్మం.. నేపాలీ మహిళ చర్మం విలువ!! భారత్లో ధనవంతుల సౌందర్య శస్త్రచికిత్సలకు, కాలిన గాయాల సర్జరీలకు ఈ చర్మాన్ని ఉపయోగిస్తున్నారు. భారత కాస్మొటిక్ సర్జరీ మార్కెట్లో చర్మానికి రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. ఆరోగ్యవంతమైన, తెల్లని చర్మం కావాలి. దీంతో నేపాలీ యువతులు, మహిళల చర్మాన్ని నిలువునా ఒలుస్తున్నారు. ఇప్పటికే నేపాలీ యువతులు, మహిళల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వారిని వేశ్యలుగా మారుస్తూ ఇండియా తదితర దక్షిణాసియా దేశాలకు అక్రమ రవాణా చేస్తున్న మాఫియా.. ఇప్పుడు ఈ కొత్త దందాకు వారినే బలిపశువులుగా వాడుకుంటోంది. మహిళల చర్మాన్ని దౌర్జన్యంగా ఒలుచుకుని డబ్బు చేసుకుంటున్నారు. ఒళ్లు గగుర్పొడిపించే ఈ దారుణ దందా గురించి సోమాబసు అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ నేపాల్, భారత్లో పర్యటించి పరిశోధించి వెలుగులోకి తీసుకువచ్చారు. తాజాగా ఒక వెబ్సైట్లో ప్రచురించిన ఈ పరిశోధనాత్మక కథనంలోని ముఖ్యాంశాలివీ.. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ మాదకద్రవ్యాల మత్తులో ముంచేసి.. ఈ పార్లర్లు, వేశ్యావాటికల్లో విటుల విపరీత పోకడలు, పైశాచిక కోరికలకు ఈ మహిళలు సహకరించడానికి వీలుగా మాదకద్రవ్యాలు, మత్తు మందులు ఇచ్చి వారిని మంచానికి కట్టివేస్తారు. ఆ మత్తు ప్రభావం నుంచి బయటపడి మెలకువ వచ్చేసరికి ఈ మహిళల శరీరాలు గాయాలతో నెత్తురోడుతూ ఉంటాయి. వీపు, పొత్తి కడుపు, తొడలు అన్ని భాగాల్లో చర్మం లేకుండా గాయాలు తేరి ఉంటాయి. దీంతో వారు వెంటనే ప్రాణభయంతో పరుగులు పెడతారు. అవన్నీ విటులు పైశాచిక ఆనందం కోసం చేసిన గాయాలని అనుకుంటారు. తమ ఖర్మకు తమనే నిందించుకుంటూ ఆ వృత్తిలోనే కొనసాగుతారు. కాకపోతే వారికి అంతకుముందు ఉన్నంత డిమాండ్ ఉండదు. అయితే వారిలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. వారి శరీరం నుంచి చర్మం వలుచుకున్నారని, నిర్దాక్షిణ్యంగా దోచుకున్నారని, దాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని! తర్వాత తెలిసినా వారు చేయగలిగిందేమీ లేదు.. మౌనంగా రోదించడం తప్ప!! తెల్ల చర్మానికి గిరాకీ ఎక్కువ మనుషుల చర్మానికి, ముఖ్యంగా తెల్లని మేనిఛాయ గల మహిళల చర్మానికి చాలా డిమాండ్ ఉంది. 100 చదరపు అంగుళాల చర్మపు ముక్కకు ఢిల్లీ, ముంబై నగరాల్లో రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకూ ధర పలుకుతుంది. ఆ చర్మాన్ని చిన్న చిన్న పాథలాజికల్ ల్యాబ్లకు అమ్ముతారు. అక్కడ చర్మం టిష్యూను శుద్ధి చేసి.. అమెరికాకు జీవ అవయవాలను సరఫరా చేసేందుకు లైసెన్స్ ఉన్న పెద్ద ల్యాబ్లకు సరఫరా చేస్తారు. అందులో కొన్ని ప్రముఖ ల్యాబ్లు కూడా ఉన్నాయి. అమెరికాలో ఈ శుద్ధి చేసిన చర్మాన్ని.. ‘అల్లోడెర్మ్’ లేదా అటువంటి ఉత్పత్తులుగా అభివృద్ధి చేస్తారు. తిరిగి ఇతర దేశాలతో పాటు భారత్కు ఎగుమతి చేస్తారు. వీటిని పురుషాంగ పరిమాణం పెంపు, మహిళల వక్షోజాల పరిమాణం పెంపు, పెదవులు సరిచేయడం, కాలిన గాయాలను సరిచేయడం వంటి శరీరాకృతి సౌందర్య, సౌష్టవాలను పెంపొందించే కాస్మొటిక్ సర్జరీల్లో ఉపయోగిస్తారు. ఈ సర్జరీలకు ఇప్పుడు భారత్లో గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. సమ్మతితోనూ చర్మం తీసుకుంటారు ఈ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. పురుషుల్లో చాలామంది మద్యపానం, ధూమపానం చేస్తుంటారు కాబట్టి.. వారి కన్నా మహిళల చర్మం, కిడ్నీలు ఎక్కువ ఆరోగ్యవంతంగా ఉంటాయి కాబట్టి.. మహిళలనే ఎక్కు వగా ఇందుకోసం ఎంచుకుంటారు. పైగా నేపాలీ మహిళల చర్మం తెల్లగా ఉండటంతో దాన్ని కాకాసియన్ జాతి వ్యక్తి చర్మంగా నమ్మించగలగడం వల్ల కూడా వారు ఎక్కువగా బాధితులవుతున్నారు. కొందరు మహిళల నుంచి వారి సమ్మతితోనే చర్మం తీసుకుంటున్నారు. నిజానికి నేపాల్లో చాలా మంది పేదరికం, అప్పుల వల్ల కిడ్నీలు, చర్మం అమ్ముకోవడం మామూలుగా మారింది. మానవ అవయవాల విక్రయం నేపాల్ చట్ట ప్రకారం నేరం. ఇండియాలో కూడా ఈ క్రయవిక్రయాలు నిషిద్ధం. అయితే.. రిజిస్టర్ చేసుకున్న అవయవ దాతల నుంచి మాత్రం అవయవాలను, టిష్యూలను తీసుకోవచ్చు. దీంతో చర్మం తీసుకోవడం కోసం అటు నేపాల్లో, ఇటు ఇండియాలో నకిలీ ధ్రువపత్రాలను కూడా తయారు చేస్తున్నారు. బాధితులకు మిగిలేది శూన్యం కాస్మొటిక్ సర్జరీ కోసం చర్మం కావలసిన వారు ముందుగా ఇండియాలో లేదా నేపాల్లో ఒక ఏజెంటును సంప్రదిస్తారు. అవసరమైన చర్మపు రంగు ఫొటో, సదరు వ్యక్తి రక్తపు గ్రూపు వివరాలతో పాటు.. నిజమైన కస్టమరో కాదో నిర్ధా రించుకోవడానికి చికిత్సకు సంబంధించిన పత్రాలు చూపాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో ‘శాంపిల్’ చర్మం పంపిస్తారు. అడ్వాన్సుగా కొంత మొత్తం తీసుకుంటారు. ‘‘ఏ మహిళ చర్మం తీసుకుంటారో.. ఆ మహిళకు రూ.5,000 నుంచి రూ. 10,000 చెల్లిస్తారు. ఆ చర్మం శాంపిల్ను పంపించిన మొదటి ఏజెంటుకు రూ.30 వేల నుంచి రూ.50 వరకు లభిస్తాయి. ఆ మహిళను భారత్-నేపాల్ సరిహద్దుల వరకూ తీసుకెళ్తారు. అక్కడ్నుంచి మరో ఏజెంటు వారిని సరిహద్దు దాటించి భారత్కు తీసుకెళ్లి మూడో ఏజెంటుకు అప్పగిస్తారు. ఆ మూడో ఏజెంటు ఆమె నుంచి చర్మం ఒలిచే ఏర్పాట్లు చేస్తాడు. ఆ చర్మాన్ని తాము దానం చేశామని, అమ్మలేదని సదరు మహిళలు ధ్రువపత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది’’ అని 40 ఏళ్ల ట్రాఫికర్ ప్రేమ్ బాస్గాయ్ చెప్పాడు. నేపాల్లోని కాబ్రేపాలన్చౌక్ జిల్లాలో కిడ్నీలు విక్రయిస్తున్న కేసులో ఇతడిని గత ఏడాది అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. నైట్ క్లబ్బులు, మసాజ్ పార్లర్లలో వేశ్యలుగా నేపాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు చాలా మంది దుర్భర దారిద్య్రంలో మగ్గు తున్నారు. వారి పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు ఏజెంట్లు.. వారిని వేశ్యలుగా మార్చి ఈ థామెల్తోపాటు ఇతర పర్యాటక ప్రాంతాల్లోని నైట్ క్లబ్బులు, మసాజ్ పార్లర్లకు తీసుకువస్తారు. ఆ మహిళలు మూడు నెలల ‘జీతం’ ఆ ఏజెంట్లకు కమీషన్ కింద చెల్లించాలి. దక్షిణాసియా దేశాల నుంచి.. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే పురుషులు ఇక్కడ విటులు. యువతి కాస్త చక్కగా ఉంటే ఒక్కో ‘సిటింగ్’కి రూ.5,000 వరకూ చెల్లిస్తారు. కానీ కొంత కాలానికే చాలా మంది యువతుల శరీరాలు గాయపడతాయి. ఇలా గాయపు మచ్చలున్న వారికి రూ.300 నుంచి రూ.500 దక్కడమే ఎక్కువ. ఇక ఆ మహిళలు కండోమ్ ఉపయోగించాలని పట్టుబడితే అదీ ఇవ్వరు. అలాగే చాలా మంది నేపాలీ మహిళలను భారత్లోని కోల్కతా, ముంబై ప్రాంతాల్లోని వేశ్యావాటికలకు తరలించడం షరా మామూలే. బాధితులే ఏజెంట్లుగా... కుసుమ్ శ్రేష్ఠ అనే మహిళ వయసు 40 ఏళ్లు. ఆమె ఖట్మాండుకు 62 కి.మీ. దూరంలోని నువాకోట్ గ్రామంలో నివసిస్తున్నారు. తన చర్మాన్ని ఒక ఏజెంటుకు అమ్మారు. ఆ ఏజెంట్లకు చాలా బలమైన నెట్వర్క్ ఉందని, ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సాహసిస్తే వారి కుటుంబాన్ని హింసిస్తారని భయంభయంగా చెప్పారు. నిజానికి చాలా కుటుంబాలు జీవనాధారం కోసం చిన్న చిన్న పనులు చేయడానికి ఈ ఏజెంట్ల మీద ఆధారపడతారు. అలా కిడ్నీలు, చర్మం అమ్ముకున్న బాధితులు కూడా ఆ తర్వాత ఏజెంట్లుగా మారుతున్న ఉదంతాలూ ఉన్నాయి. ప్రేమ్ బాస్గాయ్ అలాగే ఏజెంటుగా మారాడు. తొలుత అతడు, అతడి భార్య తమ కిడ్నీలు అమ్ముకున్నారు. ఆ డబ్బులు అయిపోయాక.. ఇతరులను కిడ్నీలు అమ్మడానికి ఒప్పించి కమీషన్ తీసుకునే ఏజెంటుగా మారాడతడు. ఎదురు తిరిగితే చంపేసి కాల్వలో తొక్కేస్తారు! కాబ్రేపాలన్చౌక్ జిల్లా ‘నేపాల్ కిడ్నీ బ్యాంకు’గా పేరుపడింది. ఇక్కడి జనంలో చాలా మంది కిడ్నీలు అమ్ముకున్న వారు ఉన్నారు. ఇక్కడ్నుంచి దాదాపు 300 కిడ్నీలు అక్రమ రవాణా చేసినట్లు బయటపడినా.. కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. చర్మం విక్రయాల పరిస్థితీ ఇంతే. ఈ రాకెట్ చాలా పకడ్బందీగా అనేక అంచెల్లో ఉండటం ఒక ఎత్తయితే.. ఆ విషయం ఎక్కడైనా బయటపెడితే తమతో పాటు తమ కుటుంబ సభ్యులకూ జరిగే ప్రాణహాని గురించిన భయం మరొక ఎత్తు. దీంతో బాధితులు ఎవరూ ఎక్కడా నోరు విప్పడానికి ఇష్టపడరు. ‘‘ఎవరు ఫిర్యాదు చేస్తారు? అక్కడ ప్రాణానికి విలువ లేదు. కస్టమర్లను సుఖపెట్టడానికి నిరాకరించిన మహిళలను లేదంటే పారిపోవడానికి ప్రయత్నించిన మహిళలను చంపేసి మురుగు కాల్వల్లో తొక్కేసిన ఘటనలు నా కళ్లతో చూశాను. ఒక కస్టమర్ నా రెండేళ్ల కుమారుడి నాలుకను సిగరెట్తో కాల్చాడు. నా కుమారుడికి ఇప్పుడు ఏడేళ్లు. అయినా ఇంకా సరిగ్గా మాట్లాడలేడు. ఆ కూపాల నుంచి మమ్మల్ని రక్షించి పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చినప్పుడు.. గతం గురించి మేం మాట్లాడం. దాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తాం. అలాంటి భయానక సంఘటనలేవీ జరగలేదని మాకు మేం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం’’ అని రేఖ అనే మహిళ వివరించారు. ఆమె వయసు 30 ఏళ్లు దాటింది. ఆమె కిడ్నీని విక్రయించారు. ముంబై, కోల్కతాల్లోని వేశ్యావాటికలకు ఆమెను అమ్మేశారు. నేపాల్ రాజధాని ఖట్మాండు నగరంలో థామెల్ ప్రాంతం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కళ్లు తెరుస్తుంది. అప్పుడిక అక్కడ ప్రతీదీ అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. నైట్ క్లబ్బులు వెలుగులీనుతుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే.. భారత విలాస పురుషులకు ఇదో చిన్న లాస్ వేగాస్ వంటిది. ఇక్కడ చాలా మంది ‘ఏజెంట్లు’ ఉంటారు. వాళ్లలో 14-15 ఏళ్ల బాలురు కూడా ఉంటారు. వీధుల్లో పురుష పర్యాటకులకు ఇక్కడి నైట్ క్లబ్బుల్లో లభించే ‘సేవల’ గురించి చెబుతూ వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ పార్లర్లలో నేపాల్ యువతులు, మహిళలు పురుషులకు కావలసిన ‘సేవలు’ అందిస్తారు.