beechupalli
-
బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని తెలంగాణ ఆయిల్ఫెడ్ నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. దీంతో 16 ఏళ్ల క్రితం మూతపడిన ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీ మళ్లీ జీవం పోసుకోనుంది. 2003లో ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు దాన్ని మూసి వేయగా, ఇప్పుడు పునరుద్ధరణ జరుగుతుండటంతో ఆయిల్ఫెడ్ వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీని అప్పట్లోనే రూ. 11.26 కోట్లతో నిర్మించారు. వేరుశనగ నూనె, కేక్ ఆయిల్ తయారు చేసేవారు. దాన్ని జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్డీడీబీ) ఆర్థిక సహకారంతో నిర్మించారు. అయితే అది మూతపడినా ఎన్డీడీబీ నుంచి తీసుకున్న అప్పును పూర్తిస్థాయిలో చెల్లించలేదు. అయితే ఇప్పుడు దాన్ని తెరవాలంటే ఎన్డీడీబీకి తీసుకున్న అప్పును చెల్లించాల్సి ఉంది. ఒకేసారి చెల్లించేలా (వన్టైం సెటిల్మెంట్) ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకోవాలని ఆయిల్ఫెడ్ నిర్ణయించింది. అయితే ఎన్డీడీబీ రూ. 7.5 కోట్లు కావాలని కోరుతుండగా, ఆయిల్ఫెడ్ మాత్రం రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్లతోనే సెటిల్ చేసుకోవాలని భావిస్తుంది. ఈ మేరకు ఆయిల్ఫెడ్ ఎండీ నిర్మల, సీనియర్ మేనేజర్ సుధాకర్రెడ్డి మంగళవారం ఎన్డీడీబీ అధికారులతో సమావేశమయ్యారు. రోజుకు 200 మెట్రిక్ టన్నుల నూనె 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వేరుశనగ సాగుచేసే రైతులకు మరింత ఆదాయం సమకూర్చడం, రాష్ట్రంలో ప్రజలకు తక్కువ ధరకే వేరుశనగ నూనె అందించడం కోసం ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. వివిధ రకాల అడ్డంకులు అధిగమించి 1990లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ ఫ్యాక్టరీ పరిధిలో దాదాపు 135 మంది ఉద్యోగులు పనిచేశారు. రోజుకు 200 మెట్రిక్ టన్నుల వేరుశనగ నూనెసహా ఇతరత్రా నూనెలనూ ఉత్పత్తి చేసేవారు. ఎంతో దిగ్విజయంగా నడుస్తున్నప్పటికీ సంస్కరణల పేరుతో 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఫ్యాక్టరీని మూసివేశారు. దాన్ని అక్రమంగా మూసివేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అనేకమంది కార్మికులను తొలగించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరికి వీఆర్ఎస్ ఇచ్చి తీసేశారు. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని మూసివేయడంపై అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేశాయి. ఫ్యాక్టరీని తెరిచాక మళ్లీ వేరుశనగ నూనెతో పాటు పామాయిల్, ఇతరత్రా నూనెలను కూడా ఉత్పత్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ పాత ఫ్యాక్టరీ యంత్రాలు బాగానే ఉన్నాయని, మరో కోటిన్నర రూపాయలు ఖర్చు చేస్తే ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో నడు స్తుందని అంటున్నారు. అందుకోసం కొందరు ఉద్యోగులను కూడా తీసుకోనున్నారు. -
ముగిసిన కృష్ణా పుష్కరాలు
-
ముగిసిన కృష్ణా పుష్కరాలు
బీచుపల్లి : తెలంగాణలో కృష్ణా పుష్కరాలు వైభవంగా ముగిశాయి. బీచుపల్లి ఘాట్ లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు లు కృష్ణమ్మకు ముగింపు హారతినిచ్చారు. ఈ హారతి కార్యక్రమంతో కృష్ణా పుష్కరాలు ముగిశాయి. పన్నెండు రోజుల పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 2 కోట్ల 50 లక్షల మంది పుష్కర స్నానమాచరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కోటి 80 లక్షలు, నల్లగొండ జిల్లాలో 70 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. పుష్కరాల్లో భక్తులకు విశిష్ట సేవలందించిన అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందిని మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, జెడ్పీ ఛైర్మన్ బండారు భాస్కర్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
‘బీచుపల్లి’ ప్రయాణం భారమే!
– ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు పార్కింగ్ స్థలం కేటాయించని తెలంగాణ – కర్నూలు నుంచి సమీపంలో ఉన్న ఘాటు అదే – శ్రీశైలం కంటే రెట్టింపు భక్తులు వెళ్తారని ఆర్టీసీ ప్రణాళిక కర్నూలు(రాజ్విహార్): బీచుపల్లి పుష్కర ఘాట్కు ప్రయాణం భారం కానుందా... ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. ఆలయ, ఘాటు సమీపంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, స్టాపింగ్కు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. కర్నూలుకు సమీపంలో ఉన్న పుష్కర ఘాటు కావడంతో స్థానిక అధికారులు రోజుకు 40 బస్సులు ప్రత్యేకంగా నడిపేందుకు చర్యలు చేపట్టారు. గత వారం పది రోజుల నుంచి ఇక్కడి అధికారులు తమ సర్వీసులకు స్థలం కేటాయించాలని విన్నపాలు చేస్తున్నా ప్రయోజనం లేకుండాపోయింది. శ్రీశైలంతోపాటు సంగమేశ్వరంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల పనులు పూర్తి స్థాయి కాకపోవడం, దూర ప్రయాణం వంటి కారణాలతో భక్తులు బీచుపల్లికి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు నుంచి బీచుపల్లికి ప్రతి రోజు 40 బస్సులు చొప్పున నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీసీటీఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. మురుగుతున్న నిధులు: బీచుపల్లి వద్ద పార్కింగ్కు స్థలం కేటాయించకపోవడంతో నిధులు మురుగుతున్నాయి. అక్కడ పలు అభివద్ధి పనులు చేపట్టేందుకు రూ.5లక్షలు మంజూరయ్యాయి. శాటిలైట్ బస్స్టేషన్ ఏర్పాటుతో పాటు పష్కరాలకు వచ్చే భక్తులకు సమాచారాన్ని అందించేందుకు అనౌన్స్మెంట్ సెంటర్, ముత్ర శాలలు, మరుగదొడ్లు, వలంటీర్లు ఉండే సెంటర్ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బస్సుల సౌకర్యార్థం రోడ్డు చదును, విస్తరణ పనులు చేసుకోవాల్సి ఉంది.