bharath fire on america
-
దేవయాని కేసులో అమెరికాకు చుక్కెదురు
న్యూయార్క్ భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే కేసులో అగ్రరాజ్యం అమెరికాకు చుక్కెదురు అయ్యింది. ఆమెపై నమోదు అయిన ఆరోపణణలను న్యూయార్క్ కోర్టు కొట్టేసింది. భవిష్యత్లో ఎలాంటి అభియోగాలను నమోదు చేయొద్దంటూ న్యాయస్థానం రూలింగ్ ఇచ్చింది. దౌత్యాధికారిగా దేవయానికి పూర్తిస్థాయిలో రక్షణ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. వీసా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అమెరికాలోని న్యూయార్క్లో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్గా పనిచేసిన దేవయాని ఖోబ్రాగాదే (39)ను డిసెంబర్ లో అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుమార్తెను స్కూలు వద్ద దింపేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరూ చూస్తుండగానే చేతికి సంకెళ్లు వేసి తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం మాన్హట్టన్ ఫెడరల్ కోర్టులో ఆమెను హాజరు పరచగా న్యాయస్థానం 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 1.55 కోట్లు) పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది. తన ఇంట్లో పనిచేస్తున్న మహిళకు సంబంధించిన వీసా పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపైనే ఖోబ్రాగాదేను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. దేవయాని గతేడాది న్యూయార్క్లోని భారత కాన్సులేట్లో చేరారు. అంతకుముందు జర్మనీ, ఇటలీ, పాక్లలో పనిచేశారు. -
అమెరికా ద్వంద్వ నీతి
న్యూఢిల్లీ: తమ దేశ వేతన చట్టం నిబంధనలకన్నా భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే తన పనిమనిషికి తక్కువ జీతం ఇచ్చారనే అభియోగాలపై ఆమెను అరెస్టు చేసిన అమెరికా...భారత్లో మాత్రం ఈ నిబంధనను యధేచ్ఛగా ఉల్లంఘిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న భారత సిబ్బందికి, దౌత్యవేత్తలు వ్యక్తిగతంగా నియమించుకున్న పనిమనుషులకు అత్తెసరు జీతాలు ఇస్తున్నారని పేర్కొన్నాయి. న్యూయార్క్ సహా అమెరికాలోని మరే ఇతర నగరంలోనైనా రాయబార కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కనీస వేతనం గంటకు 9.47 డాలర్లు చెల్లించాలనే నిబంధన ఉండగా భారత్లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో డ్రైవర్లు, వంటమనుషులుగా పనిచేసే మన దేశ సిబ్బందికి నెలకు కేవలం రూ. 12 వేల నుంచి 15 వేల మధ్యే (అంటే 200 నుంచి 250 డాలర్లు) చెల్లిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్లు అమెరికా భూభాగం పరిధిలోకి వస్తాయి కాబట్టి ఈ లెక్కన అమెరికా రాయబారులు వారి స్వదేశం రూపొందించిన కనీస వేతన చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని ఆ వర్గాలు వివరించాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 23లోగా సమర్పించాలంటూ మన విదేశాంగశాఖ అమెరికా రాయబార కార్యాలయాన్ని కోరినా ఇప్పటివరకూ స్పందించలేదని తెలిపాయి. మరోవైపు దేవయానిపై ఫిర్యాదు చేసిన పనిమనిషి సంగీతా రిచర్డ్ను స్వదేశానికి పంపాల్సిందిగా భారత్ కోరినా పట్టించుకోని అమెరికా...ఏకంగా సంగీత కుటుంబానికి టీ వీసాలు (మనుషుల అక్రమ రవాణా బాధిత కుటుంబాలకు ఇచ్చేవి) జారీ చేసి రప్పించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, దేవయాని కేసు వ్యవహారంపై చర్చించేందుకు విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సోమవారం ఢిల్లీలో సమావేశం కానుంది. మన దేశ సిబ్బందికి అమెరికా రాయబార కార్యాలయాలు చెల్లిస్తున్న వేతనాల వివరాలనూ తనిఖీ చేయనుంది. -
అమెరికాతో దౌత్య వివాదం
భారత దౌత్యాధికారి (డిప్యూటీ కాన్సుల్ జనరల్) దేవయాని ఖోబ్రాగడెను వీసా అక్రమాల ఆరోపణలపై అరెస్టుచేసిన అమెరికా.. ఆమెతో అత్యంత అవమానకరంగా వ్యవహరించటంపై భారత్ కన్నెర్ర చేయటం, తీవ్రంగా స్పందిస్తూ ప్రతిచర్యలకు దిగటం.. అగ్రరాజ్యం అమెరికాకే కాదు మన దేశ దౌత్యనిపుణులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతిపక్షాల నుంచి తరచూ తీవ్ర దాడిని ఎదుర్కొనే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో మాత్రం ప్రశంసలు అందాయి. గతంలోనూ భారత దౌత్యాధికారులకు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం వంటి అత్యంత ప్రముఖులకు పలుమార్లు ఇటువంటి అవమానాలు ఎదురైనప్పటికీ.. సాధారణంగా నసుగుడు స్వరంతో నిరసన తెలిపి సరిపుచ్చే భారత్.. ఈసారి తీవ్రంగా ప్రతిస్పందించటం కొట్టొచ్చినట్లు కనిపించిన మార్పు. ఉన్నతస్థాయి అధికారి అయిన దేవయానికి దౌత్యరక్షణ ఉందన్న విషయాన్ని విస్మరించి మరీ.. డిసెంబర్ 12వ తేదీన సాధారణ నేరస్థులను అరెస్టుచేసినట్లు ఆమెకు నడిరోడ్డుపై సంకెళ్లు వేసి మరీ అమెరికా పోలీసులు అరెస్ట్చేశారు. రెండున్నర లక్షల డాలర్ల పూచీకత్తుతో ఆమెను బెయిల్పై విడుదల చేశారు. భారత్ నుంచి దేవయాని ఇంట్లో పని మనిషిగా వచ్చిన సంగీతఫిలిప్స్ వీసా విషయంలో దేవయాని అక్రమాలకు పాల్పడ్డారని, ఆమెకు అమెరికా చట్టాల ప్రకారం చెల్లించాల్సిన వేతనాలను చెల్లించకుండా వేధిస్తున్నారని దేవయానిపై అమెరికా మోపిన అభియోగాలు. ఈ ఉదంతంపై భారత్ అనూహ్యంగా స్పందించింది. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి భద్రత తగ్గించివేసింది. బారికేడ్లను తొలగించింది. మరోవైపు దేవయానిని న్యూయార్క్ ఐరాసలోని భారత శాశ్వత మిషన్కు బదిలీ చేసి పూర్తిస్థాయి దౌత్యరక్షణ కల్పించింది. భారత్ అనూహ్య స్పందనతో కంగుతిన్న అమెరికా.. ఈ దౌత్యవివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఒప్పుకుంది. ఫలితంగా కేసు విచారణకు దేవయాని హాజరుకాకుండా మినహాయింపు లభించింది.