British court
-
ఆంటీ అనకూడదు
లండన్: తనను ఆంటీ అని పిలవడం సుతరామూ ఇష్టంలేదని ఎన్నోసార్లు చెప్పినా పదేపదే అదే పదంతో పిలిచి ఇబ్బంది పెట్టిందంటూ ఘనామూలాలున్న నర్సుపై పెట్టిన పరువునష్టం దావాలో భారతీయమూలా లున్న మహిళ బ్రిటన్ కోర్టులో విజయం సాధించింది. ‘‘61 ఏళ్ల ఇల్డా ఎస్టీవ్స్ మనో భావాలు దెబ్బతిన్నాయి. పరువునష్టం కింద 1,425.15 బ్రిటన్ పౌండ్ల(దాదాపు రూ.1,76,700)ను ఆమెకు వెస్ట్ లండన్ నేషనల్ హెల్త్ సర్వీస్ విభాగం తక్షణం చెల్లించాలి’’ అని యాజమాన్యాలు, ఉద్యోగుల మధ్య కేసులను విచారించే వాట్ఫోర్డ్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి జార్జ్ ఎలియోట్ తీర్పు చెప్పారు. ఈ కేసు వాదోపవాదనలు గత ఏడాది పూర్తికాగా గత నెలలో వివరణాత్మక తీర్పును వెలువర్చిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్వదేశంలో వయోధికులను గౌరవసూచకంగా ఆంటీ అని పిలవడం ఆనవాయితీగా వస్తోందని ఘనా దేశస్తురాలైన ఛార్లెస్ ఒపోంగ్ అనే మహిళా నర్సు చేసిన వాదనలను ముగ్గురు సభ్యుల ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ఇల్డా ఎస్టీవ్స్ వయసు 61 ఏళ్లు. అయినాసరే ఆమెకు ఆంటీ అని పిలవడం ఇష్టంలేదు. ఆ విషయం ఆమె నీకు చాలా సార్లు చెప్పింది. పేరుతోనే పిలవాలని సూచించింది. అయినా నువ్వు పదేపదే పనిగట్టుకుని ఆంటీ అని పిలిచావు. తన డ్యూటీ సమయం అయిపోయాక నీకు బాధ్యతలు అప్పగించేటప్పుడు, కారిడార్లలో అదేపనిగా ఆంటీ ఆంటీ అని పిలిచావు. అది ఇల్డాకు ఏమాత్రం నచ్చలేదు. నీ మాటలు ఆమెను గాయపరిచాయి. పనివాతావరణాన్ని నువ్వు కాస్తంత పాడుచేశావు’’ అని ధర్మాసనం ఛార్లెస్ ఒపోంగ్ను మందలించింది. ఈమె ప్రవర్తనకు ఎన్హెచ్ఎస్దే పరోక్ష బాధ్యత. అందుకే ఈ పరువునష్టం చెల్లింపును ఎన్హెచ్ఎస్ చెల్లించాల్సిందే’’ అని కోర్టు చెప్పింది. అయితే జాత్యహంకారం, ఉద్దేశపూర్వకంగా వేతనంలో కోత వంటి ఆరోపణలను మాత్రం కోర్టు కొట్టేసింది. -
నా కమీషన్ ఇప్పించండి
లండన్: భారత్లో మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధాల కొనుగోలు మధ్యవర్తి సంజయ్ భండారీ పదేళ్ల క్రితం నాటి తన కమీషన్ సొమ్ము ఇప్పించండంటూ బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు. భారత వాయుసేనకు చెందిన మిరాజ్–2000 రకం యుద్ధవిమానాల నవీకరణ కాంట్రాక్ట్.. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆయుధాల సంస్థ ‘థేల్స్ గ్రూప్’కు దక్కేలా మధ్యవర్తిగా వ్యవహరించానని ఆయన కోర్టులో పేర్కొన్నారు. 2008 నుంచీ థేల్స్ కోసం పనిచేస్తున్నానని, అధునాతన మిరాజ్ విమానాలను భారత్కు విక్రయించేలా మధ్యవర్తిత్వంలో భాగంగా నాటి భారత రక్షణ శాఖ ఉన్నతాధికారితో భేటీని ఏర్పాటుచేశానని పిటిషన్లో ప్రస్తావించారు. భారత్ ప్రతిష్టాత్మంగా కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను తయారుచేసే దసాల్ట్ ఏవియేషన్కు థేల్స్ సంస్థే కీలకమైన ‘ఏవియోనిక్స్’ ఉపకరణాలను సరఫరా చేస్తుండటం గమనార్హం. 2.4 బిలియర్ యూరోల(దాదాపు రూ.20వేల కోట్ల) విలువైన మిరాజ్ కాంట్రాక్ట్లో మధ్యవర్తిగా వ్యవహరించినందుకు మొత్తంగా 2 కోట్ల యూరోలు(దాదాపు రూ.167 కోట్లు) ఇస్తానని థేల్స్ సంస్థ హామీ ఇచ్చిందని, కానీ కేవలం 90 లక్షల యూరోలే(దాదాపు రూ.75 కోట్లు) ఇచ్చి చేతులు దులిపేసుకుందని ఆయన వెల్లడించారు. సంస్థ నుంచి మిగతా కమిషన్ ఇప్పించాలని ఆయన పారిస్ సమీపంలోని నాంటయర్లోని ‘ట్రిబ్యునల్ డీ కామర్స్’ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని బ్రిటన్కు చెందిన ‘ది డైలీ టెలిగ్రాఫ్’ వార్తా సంస్థ ఇటీవల ఒక కథనం ప్రచురించింది. భారత వాయుసేనకు రఫేల్–బి, రఫేల్–సి రకం యుద్ధవిమానాల సరఫరాకు సంబంధించిన చర్చల్లో ఫ్రాన్స్ కన్షార్షియంలో థేల్స్ ఉంది. యూపీఏ హయాంలో యుద్ధవిమానాల ఆధునికీకరణ ఒప్పందం వేళ భండారీకి, కాంగ్రెస్కు సత్సంబంధాలు కొనసాగాయని బీజేపీ ఆరోపించింది. రక్షణ కొనుగోళ్లు జరిగిన ప్రతీసారి ముడుపులపై కాంగ్రెస్ దృష్టిపెట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వ్యాఖ్యానించారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, భండారీ మంచి మిత్రులని ఆరోపించారు. -
బ్రిటన్లో ‘బారసాల’ వివాదం!
బ్రిటన్లో ఓ బారసాల వివాదం కోర్టుకెక్కింది. పుట్టిన బిడ్డకు వెంటనే పేరు పెట్టకపోవటం తల్లిదండ్రులను న్యాయస్థానం మెట్లు ఎక్కించింది. మన హిందు మత సంప్రదాయాల ప్రకారం ‘బారసాల’ వేడుక నిర్వహించిన తర్వాతగానీ పిల్లలకు పేరు పెట్టరు. అప్పటివరకు తమ బిడ్డలను ఏదో ఒక ముద్దు పేరుతో తల్లిదండ్రులు పిలుచుకుంటారు. ఇది మన దగ్గర సార్వసాధారణం. అయితే ఇదే సంప్రదాయం బ్రిటన్లో నేరమైంది. బ్రిటన్కు చెందిన ఓ హిందూ దంపతులు తమ చిన్నారికి పుట్టిన ఐదు నెలల తర్వాత కూడా పేరు పెట్టకపోవడాన్ని తప్పుబడుతూ బ్రిటన్ కోర్టు తీర్పునిచ్చింది. చిన్నారికి పేరు పెట్టకపోవడం ‘భావోద్వేగపరంగా హాని చేయడమేనని’ పేర్కొంటూ.. శిశువును సోషల్ కేర్ సెంటర్కి అప్పగించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో హెర్ట్ఫోర్డ్కు చెందిన హిందూ దంపతులు అప్పీల్ కోర్టును ఆశ్రయించారు. హిందూ మత సంప్రదాయం ప్రకారం బారసాల వేడుకను ఘనంగా నిర్వహించి చిన్నారికి పేరు పెడతామని, అప్పటివరకు తమకు అనుమతి ఇవ్వాలని వారు కోర్టును వేడుకున్నారు. అంతవరకూ తమ బిడ్డను తమ నుంచి వేరు చేయవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
తాజ్మహల్ హోటల్పై బ్రిటన్ కోర్టులో దావా
లండన్: భారత వాణిజ్య రాజధాని ముంబైలోని తాజ్మహల్ ప్యాలెస్ హోటల్పై బ్రిటన్ కోర్టులో దావా దాఖలయింది. 26/11 ముంబై దాడిలో బాధితుడయిన బ్రిటన్ పౌరుడు విల్ పికె(33) ఈ దావా వేశారు. యాజమాన్యం నుంచి తగిన పరిహారం ఇప్పించాలని కోరారు. దీనిపై బ్రిటన్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. భద్రతా దళాల ముందస్తు హెచ్చరికలు పట్టించుకోకుండా హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే ఉగ్రవాదులు దాడి చేయగలిగారని ఫిర్యాదీ ఆరోపించారు. టాటా గ్రూపుకు చెందిన తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లో భ్రదత సవ్యంగా లేదని పేర్కొన్నారు. హోటల్లో కేవలం ఒక్క మెటల్ డిటెక్టర్ మాత్రమే ఉందని తెలిపారు. 2008, నవంబర్ 26న ముంబైలో ఉగ్రవాదులు సాగించిన మారణహోమంలో 166 మంది మృతి చెందారు. దాడి సమయంలో విల్ తన స్నేహితురాలు కెలీ డోలితో కలిసి తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లో ఉన్నారు. ఉగ్రవాదుల దాడి నుంచి వారు ప్రాణాలతో తప్పించుకున్నారు. హోటల్స్లో అతిథుల భద్రత గాల్లో దీపంగీ మారిందని విల్ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత విషయంలో హోటల్ యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు.


