California shooting
-
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
అమెరికాలో కాల్పుల కలకలం
కాలిఫోర్నియా : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఉత్తర కాలిఫోర్నియాలోని మారు మూల ప్రాంతమైన థెహామా కౌంటీలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ట్రక్పై వచ్చిన దుండగుడు రాంచో థెహామా ఎలిమెంటరీ స్కూల్ గేట్ను ఢీకొట్టి స్కూల్పైకి కాల్పులు జరిపాడు. బుల్లెట్ల శబ్ధాలతో స్కూల్ ఆవరణ మారుమోగిపోయింది. భయాందోళనలతో విద్యార్థులు, టీచర్లు తరగతి గదుల్లోని డెస్కులు, బెంచ్ల కింద తలదాచుకున్నారు. అనంతరం ఇష్టానుసారంగా దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, పదిమందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ తర్వాత పోలీసులకు దుండగుడికి మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో దుండగుడిని మట్టుపెట్టారు. దుండగుడు కాల్పులు జరపడానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
ఆమె భారత్కు రాలేదు: ప్రభుత్వం
న్యూఢిల్లీ: కాలిఫోర్నియా కాల్పుల నిందితురాలు తష్ఫీన్ మాలిక్ 2013లో భారత్ వచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర నిఘా సంస్థలు స్పష్టం చేశాయి. సౌదీ హోంమంత్రిత్వ శాఖ అధికారులు తష్ఫీన్ భారత్ను సందర్శించిందని పేర్కొన్న నేపథ్యంలో నిఘా వర్గాలు ఆమె గురించి ఆరా తీశాయి. ఇందుకు సంబంధించి ఇమ్మిగ్రేషన్, వీసా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. పాకిస్థానీ మహిళ అయిన తష్ఫీన్కు చెందిన రెండు పాస్పోర్టుల (ఒకటి పాకిస్థాన్, మరొకటి రియాద్ జారీ చేశాయి) వివరాలు ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో నమోదు కాలేదని నిఘా అధికారులు బుధవారం నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో తష్ఫీన్ భారత్ మీదుగా మరో దేశానికి వెళ్లి ఉంటుందని, అలాంటి సందర్భంలోనే ఆమె వివరాలు ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో నమోదుకావని ఓ అధికారి తెలిపారు. 'ఒక పాకిస్థాన్ పౌరుడు ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, నిఘా నేత్రం నుంచి తప్పించుకొని వెళ్లే వీలు లేదు. వారి విషయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. కాబట్టి ఆమె అసలే భారత్కు రాకపోయి ఉండొచ్చు. లేదా మరో దేశానికి వెళ్లేందుకు కనెక్టింగ్ విమానం ఎక్కేందుకు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు' అని ఆ అధికారి వివరించారు. తష్ఫీన్ మాలిక్ రెండుసార్లు సౌదీ అరేబియా వెళ్లిందని, ఆ తర్వాత ఓసారి బ్రిటన్లో పర్యటించి.. అనంతరం భారత్ వెళ్లిందని సౌదీ హోంమంత్రిత్వశాఖ అధికారులు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తష్ఫీన్ మాలిక్, ఆమె భర్త సయెద్ రిజ్వాన్ ఫరుక్ గతవారం కాలిఫోర్నియాలో కాల్పులతో విరుచుకుపడి 14మందిని హతమార్చారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అమెరికా పోలీసులు కాల్పులకు ప్రేరేపణ ఏమిటి అన్న అంశాన్ని శోధిస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ మహిళ అయిన తష్ఫీన్ నేపథ్యం, ఆమె గత జీవితాన్ని క్షుణ్ణంగా వెలుగులోకి తీసుకువస్తున్నారు. -
భారత్పైనా ఆ మహిళా ఉగ్రవాది కన్ను!
న్యూయార్క్: కాలిఫోర్నియా కాల్పుల ఘటనలో నిందితురాలైన పాకిస్థానీ మహిళ తష్ఫీన్ మాలిక్ (27) ఓసారి భారత్ను కూడా సందర్శించిందట. 2103లో ఆమె సౌదీ అరేబియా నుంచి భారత్ వచ్చి ఉంటుందని, ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికా వెళ్లిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. తష్ఫీన్ మాలిక్ రెండుసార్లు సౌదీ అరేబియా వెళ్లిందని, ఆ తర్వాత ఓసారి బ్రిటన్లో పర్యటించిన ఆమె అనంతరం భారత్ వెళ్లిందని సౌదీ హోంమంత్రిత్వశాఖ అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఓ కథనం ప్రచురించింది. 2008 జూన్లో తన తండ్రిని కలిసేందుకు తష్ఫీన్ మాలిక్ సౌదీ అరేబియా వచ్చిందని, ఆయనతోపాటు దాదాపు తొమ్మిది నెలలు గడిపి.. ఆ తర్వాత తిరిగి పాకిస్థాన్ వెళ్లిపోయిందని సౌదీ హోంమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మన్సౌర్ తుర్కీ తెలిపారు. 2013 జూన్ 8న ఆమె మరోసారి పాక్ నుంచి సౌదీ వచ్చిందని, మళ్లీ అక్టోబర్ 6న సౌదీ నుంచి భారత్ వెళ్లిందని ఆయన తెలిపారు. అయితే ఆమె భారత్ వస్తే ఎక్కడుంది? ఎన్ని రోజులపాటు గడిపిందనే వివరాలు ఆ కథనంలో వెల్లడించలేదు. తష్ఫీన్ మాలిక్, ఆమె భర్త సయెద్ రిజ్వాన్ ఫరుక్ గతవారం కాలిఫోర్నియాలో కాల్పులతో విరుచుకుపడి 14మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అమెరికా పోలీసులు కాల్పులకు ప్రేరేపణ ఏమిటి అన్న అంశాన్ని శోధిస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ మహిళ అయిన తష్ఫీన్ నేపథ్యం, ఆమె గత జీవితాన్ని క్షుణ్ణంగా వెలుగులోకి తీసుకువస్తున్నారు. మహిళ ఉగ్రవాదిగా భావిస్తున్న తష్ఫీన్ భారత్ వస్తే.. ఇక్కడ ఆమె లక్ష్యమేమిటి? భారత్పైనా దాడులకు ఏమైనా ప్రయత్నాలు జరిగాయా? అన్న అంశాన్ని తాజా కథనంలో నేపథ్యంలో భద్రతా వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. -
ఆమె చర్యకు సిగ్గుపడుతున్నాం!
కరొర్ లాల్ ఎసాన్ (పాకిస్థాన్): కాలిఫోర్నియాలో కాల్పులతో మారణహోమం సృష్టించిన పాకిస్థానీ మహిళ తష్ఫీన్ మాలిక్ చర్య పట్ల ఆమె దూరపు బంధువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె చర్య తమను సిగ్గుపడేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తష్ఫీన్ మాలిక్ లో చిన్నప్పటి నుంచి మతఛాందస ఛాయలు కనిపించేవని, ఆమె ఇంతటి ఘాతుకానికి ఒడిగడుతుందని తాము అనుకోలేదని ఆమె క్లాస్ మెట్లు, టీచర్లు చెప్తున్నారు. తష్పీన్ మాలిక్ (28), ఆమె భర్త సయెద్ ఫరుక్ (28) అమెరికా కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినోలో ఓ సోషల్ సర్వీసు కేంద్రంపై కాల్పులు జరిపి 14మందిని హతమార్చారు. వారిని ఖలిఫత్ స్వయం ప్రకటిత సైనికులుగా పేర్కొన్న ఐఎస్ఐఎస్.. వారి చర్యపై ప్రశంసలు కురిపించింది. పాకిస్థాన్ లోని తష్పీన్ దూరపు బంధువులు మాత్రం ఈ ఘటనపై షాక్ వ్యక్తం చేశారు. ఆమె మేనమామ, మాజీ రాష్ట్ర మంత్రి మాలిక్ అహ్మద్ అలి ఔలాఖ్ మాట్లాడుతూ పాక్ సెంట్రల్ పంజాబ్ ప్రావిన్సులోని కరార్ లాల్ ఎసాన్ ప్రాంతానికి చెందిన తష్పీన్ కుటుంబం 1989లో సౌదీ అరేబియా వెళ్లిందని, తష్ఫీన్ తండ్రి గుల్జార్ మాలిక్ ఒక ఇంజినీర్ అని, తమ కుటుంబంలో సన్నిహిత బంధువుల పెళ్లిలు జరిగినా.. ఆయన ఎప్పుడు సౌదీ నుంచి తిరిగి రాలేదని తెలిపాడు. 'మా మేనకోడలు చేసిన చర్య గురించి విని షాక్ తిన్నాం. సిగ్గుపడ్డాం. అంతా దారుణానికి పాల్పడాల్సిన అవసరమేముంది? మేం నమ్మలేకపోతున్నాం' అని ఆయన ఓ వార్తాసంస్థకు తెలిపారు. -
కాలిఫోర్నియాలో దాడి మా మద్దతుదారుల పనే
-
'కాలిఫోర్నియాలో దాడి మావాళ్ల పనే'
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ కాల్పులతో మారణహోమం సృష్టించిన ఇద్దరు దంపతులు తమ మద్దతుదారులేనని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో మరణించిన ఆ ఇద్దరిని అమరవీరులుగా గుర్తించాల్సిందిగా కోరుతూ తాము భగవంతునికి ప్రార్థనలు జరుపుతామని ఐఎస్ఐఎస్ గ్రూపు రేడియో అల్-బయన్ రేడియో తెలిపింది. బుధవారం తెల్లవారుజామున సయెద్ రిజ్వాన్ ఫరుక్, తష్ఫీన్ మాలిక్ దంపతులు కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినోలో ఓ హాలీడే పార్టీపై కాల్పులు జరిపి 14మందిని హతమార్చారు. ఈ ఘటనలో 21మంది గాయపడ్డారు. ఈ ఘటనకు తమదే బాధ్యతని, సిరియాలోని తమ ప్రాబల్య ప్రాంతాలపై దాడులు చేస్తుండటంతో ప్రతీకారంగా ఈ దాడి జరిపినట్టు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మద్దతుదారులు ట్విట్టర్లో ప్రకటించారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద హస్తముందని అమెరికా పోలీసులు కూడా అనుమానిస్తున్నారు.