దానిపై నేను మాట్లాడేదేముంది
- మా న్యాయవాదులు చూసుకుంటారు
- ఓటుకు కోట్లు కేసుపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ‘దానిపై నేను మాట్లాడడమేంటి.. మా న్యాయవాదులు చూసుకుంటారు.. అయినా ఆ కేసులో ఏముందని మాట్లాడడానికి.. మీడియానే అధ్యయనం చేసి చెప్పాలి’ అంటూ ఓటుకు కోట్లు కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంగళవారం దుర్గా ఘాట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటుకు కోట్లు కేసుపై స్పందించాలని విలేకరులు కోరగా.. నేరుగా సమాధానం చెప్పకుండా పైవిధంగా స్పందించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని తెలంగాణ ఏసీబీని ప్రత్యేక కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నా విలేకరుల సమావేశంలో పెద్ద విషయం కాదన్నట్లు బాబు వ్యవహరించారు.
రెండేళ్లలో కరువును అధిగమిస్తాం..
రెయిన్గన్లు ఆపరేట్ చేయడానికి విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకురావాలని కోరారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామంలో స్వచ్ఛంద సేవకులు ముందుకురావాలన్నారు. మహారాష్ట్ర నుంచి మరో 15 వేల రెయిన్ గన్లు తీసుకువస్తున్నామని చెప్పారు. కరువు ఎప్పుడొస్తుందనేది కూడా సాంకేతికత సాయంతో ముందుగానే కనిపెట్టే పద్ధతులను అనుసరిస్తామన్నారు.