గాల్లో ఎగిరే పాము!
కోయంబత్తూర్: తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో ఓ అరుదైన పామును గుర్తించారు. కాలంపలయం గ్రామానికి చెందిన వెంకటేశన్ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుంటుండగా.. ఓ చెట్టు మీద నుంచి మరో చెట్టుమీదకు అహారం కోసం గాల్లో ఎగురుతున్న పామును గుర్తించాడు. దీంతో ఆశ్చర్యపోయిన అతను.. స్థానికంగా ఉన్న పాములు పట్టే వారికి సమాచారం ఇవ్వడంతో దానిని పట్టుకున్నారు.
ఆ పామును అటవీశాఖ అధికారులకు అప్పగించగా వారు దానిని పరిశీలించి.. అరుదైన క్రిసోపీలియా రకానికి చెందిన సర్పంగా గుర్తించారు. ఆగ్నేయ దేశాలైన వియత్నాం, కంబోడియాలలో ఈ రకమైన సర్పాలు కనిపిస్తాయని వారు తెలిపారు. బూడిద వర్ణంలో ఉండి, నల్లటి మచ్చలతో కూడిన ఈ సర్పం.. గాల్లో ఒకేసారి 20 ఫీట్ల దూరం వరకు ఎగురుతుందని వారు వెల్లడించారు. అటవీ శాఖ అధికారులు దానిని పుతుపతి అటవీ ప్రాంతంలో వదిలేశారు.