CM Palanisami
-
సిలిండర్ పేలి.. బేకరీలో భారీ అగ్నిప్రమాదం!
చెన్నై: నగరంలోని ఓ బేకరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోడుంగయుర్ ప్రాంతంలోని మీనంబల్ వీధిలో ఉన్న బేకరీలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సిబ్బంది మంటలను ఆర్పుతున్న సమయంలోనే బేకరీలోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మొత్తం 48మందికి కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కిల్పాక్ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని తమిళనాడు ముఖ్యంమంత్రి పళనిస్వామితోపాటు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థికసాయంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం పళనిస్వామి హామీ ఇచ్చారు. -
ఓపీఎస్ వర్గంతో చర్చలకు కమిటీ
చెన్నై: అన్నాడీఎంకేలో చీలిక వర్గాలు విలీనం దిశగా మరో ముందడుగు పడింది. ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్) వర్గంతో చర్చలకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి(ఈపీఎస్) ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎంపీ ఆర్. వైద్యలింగం ఈ కమిటీ నేతృత్వం వహిస్తారు. మంత్రులు సెంగొట్టయన్, డి. జయకుమార్, సి. శ్రీనివాసన్ సభ్యులుగా ఉంటారు. ఓపీఎస్ వర్గంతో ఈ కమిటీ విలీన చర్చలు జరపనుంది. శశికళ వర్గాన్ని బయటకు పంపడంతో ఈపీఎస్ కూటమితో చర్చలకు పన్నీస్ సెల్వం మొగ్గుచూపారు. అయితే సీఎం పీఠం, పార్టీ పదవి తనకే కావాలని ఓపీఎస్ పట్టుబడుతున్నట్టు మీడియాలో ప్రచారం సాగుతోంది. పన్నీర్ సెల్వం వర్గం ఎటువంటి షరతులు విధించలేదని అంటూనే ముఖ్యమంత్రిని మార్చేది లేదని ఈపీఎస్ వర్గం చెబుతుండడం గమనార్హం. పార్టీని బతికించుకోవడానికే విలీనానికి సిద్ధపడ్డామని ఇరువర్గాల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య జరగనున్న చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.