Co-operates
-
సైన్స్ అభివృద్ధికి సహకరిస్తాం
‘నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్’లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు : సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. శనివారమిక్కడి బీజీఎస్ కళాశాలలో నిర్వహించిన ‘నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్’ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ రంగంలో అనేక అద్భుత విజయాలు సాధించిన రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్తలకు అన్ని విధాలైన ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పురోభివృద్ధికి గాను రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి చిన్నారులు అన్ని అంశాల్లోనూ ఎంతో శక్తి, సామర్థ్యాలను, చురుకుదనాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. అంతేకాక విభిన్న అంశాలను తెలుసుకునేందుకు వారికి ఎక్కువ అవకాశాలు సైతం ఉన్నాయని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ప్రవేశించిన విద్యార్థులు తమ విజ్ఞానాన్ని దేశ అభివృద్ధి కోసం వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే కర్ణాటక బయోటెక్నాలజీ రంగంలో అత్యుత్తమ ప్రగతిని సాధించిందని, అయినా ఇంకా అభివృద్ధిని సాధించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అనంతరం ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు మాట్లాడుతూ...సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. సైన్స్ అంశాల్లో నైపుణ్యాలు సాధించిన చిన్నారులకు ఉత్తమ కెరీర్ అవకాశాలు సైతం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విజ్ఞాన రంగ అభివృద్ధిని అనుసరించే దేశ అభివృద్ధి కూడా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్షవర్థన్, ఆదిచుంచనగిరి మఠం పీఠాధిపతి నిర్మలానంద స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే కార్మికులకు అండగా ఉంటా
మంత్రి తలసాని సికింద్రాబాద్: రైల్వే కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం చిలకలగూడలోని దక్షిణమధ్యరైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశానికి తలసాని హాజరై ప్రసంగించారు. రైల్వే సమస్యలను కార్మిక సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే కేంద్రంపై వత్తిడి తెచ్చి పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దక్షిణమధ్యరైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాదీయ కార్యదర్శి మర్రి రాఘవయ్య మాట్లాడుతూ రైల్వేలో విదేశీ పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకోకుంటే సమ్మె తప్పదన్నారు. రైల్వేను ప్రైవేటీకరించేది లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటన మోసపూరితమైందేన్నారు. ఉద్యోగ నియామకాల్లో కాంట్రాక్టు వ్యవస్థ, విదేశీ పెట్టుబడుల ఆహ్వానం ఫలితంగా రైల్వే వ్యవస్థ ప్రై వేటీకరణ దిశగా అడగులు వేస్తుందని చెప్పారు. రాజకీయ పార్టీలు తమ ఓటుబ్యాంకు నిమిత్తం లేనిపోని రాయితీలను ఇచ్చి లాభాల బాటలో పయనించాల్సిన రైల్వేను నష్టాల బాటలోకి దింపి రైల్వే వ్యవస్థ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. చైనా, జపాన్ వంటి దేశాల పెట్టుబడులను రైల్వేశాఖలోకి ఆహ్వానించడం ద్వారా రానున్న రోజుల్లో కార్మికులు, ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు ప్రనాకర్ ఆండ్య్రూ, వర్కింగ్ కమిటీ ప్రతినిధులు ఆదం సంతోష్కుమార్, ఉమానాగేంద్రమణి, జీ.మోహన్రావు, ఏ.రాజగోపాల్, భరణిభానుప్రసాద్, రవిశంకర్ ముక్తేవి, శ్రీహరి, వీరభద్రయ్య, రఘురామ్, రుద్రారెడ్డి, పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు.