బీటెక్ మాత్రమే చేసిన టెకీలకు షాకింగ్ న్యూస్!
ముంబై: అసలే భారీ ఉద్యోగాల కోత వార్తలతో ఆందోళనలో పడిపోయిన సాఫ్ట్వేర్ల ఇంజనీర్లకు పిడుగులాంటి కబురు ఇది. ముఖ్యంగా బీటెక్ తోనే సరిపెట్టుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సెటిల అయిన వారికి ఇది షాకింగే. కేవలం బీటెక్ డిగ్రీ ఉంటే సరిపోదనీ ఎంటెక్ తోపాటు, ప్రత్యేక నైపుణ్యాలను కూడా కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి యువతకు భవిష్యత్లో ఐటీ సెక్టార్లో జాబ్స్ కష్టంగా ఉంటుందని ప్రముఖ టెక్ నిపుణుడు వ్యాఖ్యానించారు. ఐటీ కంపెనీలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన పోస్ట్గ్రాడ్యుయేట్ల ఎంపిక పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించనున్నాయని ఎన్ఎస్ఈ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు , మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, టీవీ మోహన్ దాస్ పాయ్ చెప్పారు. నైపుణ్యం గల నిపుణులతో పోస్టు గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలనే కంపెనీలు కోరుకుంటాయని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రస్తుత చైర్మన్ పాయ్ చెప్పారు.
ఐటి సెక్టార్ లో మంచి ఉద్యోగం పొందడానికి బి టెక్ డిగ్రీ సరిపోదని ఇన్ఫోసిస్ మాజీ హెచ్ ఆర్ హెడ్ మోహన్ దాస్ పేర్కొన్నారు. ఇందుకు ఎంటెక్తో పాటు, స్పెషలైజేషన్ చేయాలని సలహా ఇచ్చారు. కాలేజీ విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు. అంతేకాదు అదనపు తరగతుల ద్వారా సొంత కోడింగ్ టెక్నాలజీ అలవర్చుకోవాలన్నారు. ఎందుకంటే కంపెనీలు మీకు ఆరు నెలలు జీతం ఇచ్చి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా లేవన్నారు. తద్వారా ఆయా కంపెనీలు సమయం, డబ్బు ఎందుకు వృధా చేసుకుంటాయని ఆయన ప్రశ్నించారు. కోడింగ్ లో నైపుణ్యం సాధిస్తేనే కంపెనీలు ఎంపిక చేసుకుంటాయన్నారు. గత రెండు దశాబ్దాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) పరిశ్రమలో ఫెషర్స్ జీతాల గురించి అడిగినప్పుడు, ఇది "గొప్ప విషాదం" గా పాయ్ పేర్కొన్నారు. ఎందుకంటే మొత్తం పరిశ్రమ వృద్ధి మందగించిందని తెలిపారు.
సరఫరా (సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంఖ్య) పెరిగిపోయింది, కానీ దానికి దగ్గ డిమాండ్ లేదన్నారు. ఐటిలో గ్లోబల్ వ్యయం ఈ ఏడాది కేవలం రెండు శాతం మాత్రమే పెరగనుందని అంచనా వేశారు.( అంతకు ముందు 3-4 శాతం ఉన్నది) ఇది కూడా ప్రభావం చూపిస్తుందన్నారు. అలాగే ఐటీ ఉద్యోగాల సంక్షోభ వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఐటీ పరిశ్రమలో విస్తృత ఉద్యోగ నష్టాలను సూచించే నివేదికలన్నీ అతిశయోక్తులను కొట్టిపారేశారు. దీనికి డాటాను పరిశీలించాలన్నారు. ఐటీ యూనియన్లనుకూడా తప్పుబట్టారు. ఎవరూ వారికి మద్దతు ఇవ్వడంలేదన్నారు. అలాగే యూనియన్లతో పాటు వెళ్ళే వ్యక్తులు ఎప్పటికీ ఉద్యోగాలు పొందలేరని హెచ్చరించారు.