country Developing
-
ఏటా 7.8 శాతం వృద్ధి అవసరం
న్యూఢిల్లీ: భారత్ అధిక ఆదాయ దేశంగా 2047 నాటికి (అభివృద్ధి చెందిన దేశం) అవతరించాలంటే ఏటా 7.8 శాతం సగటు వృద్ధిని, వచ్చే 22 ఏళ్లపాటు సాధించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇందుకు గాను ఆర్థిక రంగ, భూమి, కార్మిక మార్కెట్కు సంబంధించి సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుందని విశ్లేషించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ 2000 నుంచి 2024 మధ్య కాలంలో వృద్ధిని సగటున 6.3 శాతానికి వేగవంతం చేసుకుందంటూ.. గత విజయాలు భవిష్యత్తు లక్ష్యాలకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ‘‘2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరించాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యం ఎప్పటి మాదిరే సాధారణ పనితీరుతో సాధ్యపడదు. తలసరి ఆదాయం ప్రస్తుత స్థాయి నుంచి ఎనిమిది రెట్లు వృద్ధి చెందాలి. అందుకోసం వృద్ధి మరింత వేగాన్ని అందుకుని, వచ్చే రెండు దశాబ్దాల పాటు స్థిరంగా కొనసాగాలి. అలాగే, ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలు సరిపోవు. సంస్కరణలను మరింత విస్తరించడంతోపాటు, వేగవంతం చేయాలి. అప్పుడే 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్ మారుతుంది’’అని ప్రపంచబ్యాంక్ నివేదిక సూచించింది. విధానపరమైన చర్యలు, పెట్టుబడులు పెంచడం, నిర్మాణాత్మక పరివర్తనతోపాటు మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనపై భారత్ దృష్టి సారించాలని పేర్కొంది.చిలీ, కొరియా, పోలండ్ నిదర్శనాలు.. ‘‘చిలీ, కొరియా, పోలండ్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో మరింతగా అనుసంధానం కావడం ద్వారా మధ్యస్థ ఆదాయం నుంచి అధిక ఆదాయ దేశాలుగా విజయవంతంగా మారాయి. వాటి నుంచి ఈ విషయంలో పాఠాలు నేర్వాలి’’అని ప్రపంచబ్యాంక్ భారత్ డైరెక్టర్ ఆగస్టే టానో కౌమే పేర్కొన్నారు. 2000 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు రెట్లు పెరిగిందని, జీడీపీలో తలసరి ఆదాయం సైతం మూడు రెట్లు అధికమైనట్టు ప్రపంచబ్యాంక్ నివేదిక గుర్తు చేసింది. ఇందుకు మిగిలిన ప్రపంచంతో పోల్చితే భారత్ వేగంగా వృద్ధి చెందినట్టు తెలిపింది. ఇది కఠిన పేదరికం గణనీయంగా తగ్గేందుకు, సేవలు, మౌలిక సదుపాయాల విస్తరణకు దోహదం చేసినట్టు వివరించింది. గత విజయాల మాదిరే భారత్ తన సంస్కరణలను వేగవంతం చేసి, భవిష్యత్తులో మరింత అధిక వృద్ధిని సాధించాల్సి ఉంటుందని కౌమే పేర్కొన్నారు.అధిక యువ జనాభా సౌలభ్యం నేపథ్యంలో మెరుగైన ఉపాధి అవకాశాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, కార్మిక శక్తిలో మహిళల ప్రతినిధ్యాన్ని 35.6 శాతం నుంచి 2047 నాటికి 50 శాతానికి పెంచడం అవసరమని ఈ నివేదికకు సహ రచయితగా వ్యవహరించిన ఎమిలీయా స్కాక్, రంగీత్ ఘోష్ అభిప్రాయపడ్డారు. ‘‘మౌలిక వసతులు మెరుగుపడాలి. ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. కార్మిక మార్కెట్ నిబంధనలను క్రమబదీ్ధకరించాలి. నిబంధనల భారాన్ని తగ్గించాలి. ఇలా చేయడం వల్ల ఉత్పాదకతతోపాటు పోటీతత్వం పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ చర్యలతో భారత్ థాయిలాండ్, వియత్నాం, చైనాతో సమానంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటుంది’’అని ప్రంపచబ్యాంక్ నివేదిక సూచించింది. -
సంస్కరణలు కొనసాగుతాయ్
న్యూఢిల్లీ: బడ్జెట్ అంటే ఏదో ఖర్చుల పద్దుగా పరిమితం కాకుండా అందరికీ ప్రయోజనాలను సమానంగా అందించేందుకు ఉపయోగపడే బ్లూప్రింట్గా గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం మార్చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్ను సంపన్న దేశంగా తీర్చిదిద్దే దిశగా సంస్కరణల అమలు ఇకపైనా వేగవంతంగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్ విధానాల్లో మోదీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసిందని మంత్రి వివరించారు. ఇలాంటి పారదర్శక బడ్జెట్లు ఉండే దేశాల విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ మొదలైనవి సానుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. తద్వారా దేశానికి అంతర్జాతీయంగా విశ్వసనీయత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో (గతంలో ట్విటర్) చెప్పారు. ట్యాక్స్పేయర్లు తమ కష్టార్జితం నుంచి కట్టే ప్రతి రూపాయిని సమర్ధవంతంగా ఉపయోగించేందుకు, ప్రజా ధనం విషయంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. -
భారత్ పురోగతిపై యువత అభిప్రాయాలకు పెద్దపీట
న్యూఢిల్లీ: భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై యువత అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తుందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. భారతదేశం 2047 నాటికి దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారవుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిని వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ‘‘భారతదేశం తన చరిత్రలో కీలక మలుపులో ఉంది’’ అని ఆయన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ పేర్కొన్నారు. యథాతథ విధానాలు వ్యాపార రంగం పురోగతికి దోహదపడవని అన్నారు. యువతసహా ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాలను పంపడానికి ఒక వెబ్ పేజీ ఒక నెలపాటు లైవ్లో ఉంటుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. -
జాతీయ ఉద్యమాల్లో పాల్గొనాలి
సుల్తాన్బజార్ : ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనడం ద్వారా దేశ అభివృద్ధికి దోహద పడాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యర్శి పి. మురళీధర్రావు అన్నారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో శనివారం కింగ్కోఠిలోని భారతీయ విద్యాభవన్లో ‘తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాద రాజకీయాలు- ప్రాస్పెక్ట్స్ ఛాలెంజెస్’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ను రక్షించుకునేందుకు తెలుగు సైనికులు తమ జీవితాలను అర్పిస్తున్నారన్నారు. సరైన నాయకత్వం లేని దేశం అవకాశాలను అందిపుచ్చుకోలేదని, ప్రపంచంలోని పోటీని తట్టుకోలేక అవకాశాలు, అర్హతలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలకు దేశస్థాయి ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడే దేశ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ నాయకత్వం, ఉనికి కోసం మరో రాష్ర్టంపై అరోపణలు చేయడం దారుణమన్నారు. కొన్ని లోపాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిందన్నారు. ఉద్యమాలకు దూరమై, కేవలం ఎన్నికల గురించే మాట్లాడినందునే కాంగ్రెస్ నష్టపోయిందన్నారు. బీజేపీకి వర్గ, కుల రహితమైన భవిష్యత్తుతో కూడిన ఏజెండా ఉందన్నారు. రాహుల్గాంధీ కాంగ్రెస్పార్టీని పునర్మించలేరని ఆయన పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణంతో ప్రపంచమంత విచారంగా ఉంటే మతతత్వ రాజకీయ నాయకులు యాకుబ్ మెమనే కనిపించారని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్ మత రాజకీయాలకు కాకుండా దేశ రాజకీయాలకు దగ్గరగా ఉండాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజ్ఞ భారతీ అధ్యక్షులు డాక్టర్ ఎల్. రాజభాస్కర్రెడ్డి, ఏపీ, తెలంగాణ ఛైర్మన్ టి. హనుమాన్చౌదరితో పాటు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు.