'మా' ఎన్నికల ఫలితాలకు లైన్ క్లియర్
ఈసారి అత్యంత వివాదాస్పదంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ('మా') ఎన్నికల ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. ఫలితాల విడుదలను నిలిపివేయాలంటూ సినీ నిర్మాత ఓ కళ్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ను సిటీ సివిల్ కోర్టు కొట్టేసింది. ఎన్నికల అధికారి ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే కౌంటింగ్ నిర్వహించుకోవచ్చని తెలిపింది.
'మా' అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీపడగా, ఎన్నికలు మార్చి 29వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. 702 మంది సభ్యుల్లో 394 మంది మాత్రమే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే, ఎన్నికలను నిలిపివేయాలని నిర్మాత ఓ కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కోర్టు కొట్టేసింది. దాంతో ఇప్పుడు ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించడంతో, కౌంటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే, శుక్ర లేదా శనివారాల్లో ఈ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు.
కాగా.. ఓ కళ్యాణ్పై సిటీ సివిల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాలను ఆపలేమని తేల్చి చెప్పింది. కళ్యాణ్కు రూ. 10 వేల జరిమానా కూడా విధించింది. వ్యవహారాన్ని రచ్చకీడ్చారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.