నేను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటా
అవసరమైతే తాను కూడా వచ్చి ఇక్కడ కేసులు పెట్టించుకుంటానని, దివీస్ బాధిత ప్రజలందరికీ అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దివీస్ ఫార్మా సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు స్థానిక ఎమ్మెల్యే మీద 22 కేసులు పెట్టారని, వాటిలో 7 హత్యాయత్నం కేసులని చెప్పారు. అసలు వీళ్లకు హత్యాయత్నం కేసులంటే ఏంటో తెలుసా అని ఆయన ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్ బాధితులను పలకరించేందుకు వచ్చిన ఆయన.. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
దానవాయిపేట, చుట్టుపక్కల బాధిత గ్రామాలు గత 82 రోజులుగా ఈ ఫ్యాక్టరీ వద్దని చెబుతూ గట్టిగా ఉద్యమబాట పట్టినా, ఈ ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టాలు ఇవీ అని చెప్పినా వినని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
పైగా మీకు తోడుగా ఎవరైనా ఉంటే, మీరు పడుతున్న బాధలను ప్రభుత్వానికి అర్థం కావాలని గట్టిగా నిలదీస్తే.. పెట్టని కేసు లేదు.
82 రోజులుగా ఈ గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు.
మీకు అండగా నిలబడినందుకు ఎమ్మెల్యే రాజా మీద 22 కేసులు పెట్టారు. వాటిలో ఏడు హత్యాయత్నం కేసులట.
అసలు హత్యాయత్నం అంటే ఏంటో కూడా వీళ్లకు తెలుసో లేదో తెలియట్లేదు
మీకు అండగా నిలబడేందుకు కమ్యూనిస్టు పార్టీ నేత మధు వచ్చారు. ఆయన పార్టీ రాష్ట్ర ఇన్చార్జి, రాష్ట్ర కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు
ఆయనను కొట్టుకుంటూ వ్యాన్ దగ్గరకు తీసుకెళ్లారు. ఇక్కడికొస్తే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు అన్నట్లు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాసినా పట్టించుకోలేదు
ఆడవాళ్లని కూడా చూడకుండా కొట్టి, పైపెచ్చు కేసులు పెట్టారు
ఈ ఫ్యాక్టరీని ఎందుకు వీళ్లంతగా వ్యతిరేకిస్తున్నారు, దీనివల్ల కాలుష్యం వీళ్ల జీవితాలను ఎంతగా చిన్నాభిన్నం చేస్తుందో రాష్ట్రం మొత్తానికి చెప్పాలి
చంద్రబాబుకు మనసు మారాలి, ఇక్కడ ఫ్యాక్టరీ కడుతున్న యాజమాన్యం మనసు మార్చుకుని ఇక్కడినుంచి వెనక్కి వెళ్లాలి
చంద్రబాబు గూబ అదిరేలా.. ఆయన మనసు మారేలా మనం పడుతున్న బాధలు ఆయనకు చెబుదాం
హేచరీలలో 20-25 వేల మంది పనిచేస్తున్నారు. వీళ్లంతా వాటిమీద ఆధారపడి బతికే పరిస్థితి ఉంది. ఈవాళ ఒకే ప్రాంతంలో 250 హేచరీలు ఉన్నాయంటే.. ఇలాంటి ఆక్వాజోన్ బహుశా దేశంలోనే ఎక్కడైనా ఉందో లేదో.
ఇంత పెద్ద ఉత్పత్తి ఇక్కడ జరుగుతోంది, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి.
దేశం మొత్తానికి మత్స్య ఉత్పత్తుల ఎగుమతి వల్ల 33వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యం వస్తుంటే, అందులో రొయ్యల ద్వారా వచ్చే ఆదాయం 23వేల కోట్లు.
ఇలాంటి చోట్ల ఉన్న హేచరీలలో తయారైన రొయ్య పిల్లలే అంత మొత్తాన్ని సంపాదిస్తున్నాయి. మొత్తం సీడ్లో సగం ఒక్క ఈ ప్రాంతం నుంచే వస్తోంది.
14 వేల కోట్ల రూపాయల ఆదాయం ఈ ప్రాంతం నుంచే వస్తోందంటే.. ఇంత ప్రాధాన్యం గల రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి, వీటిని కాపాడాలని చూడాలి.
సముద్రపు నీరు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే హేచరీలు పెట్టగలరు. కానీ ఈ ఫ్యాక్టరీకి సముద్రం నీరు అవసరం లేకపోగా, సముద్రం లోకి కలుషిత నీళ్లను ఈ ఫ్యాక్టరీ పంపుతుంది
హేచరీలు బతకాలంటే, సముద్రపు నీరు కావాలి.. అదే ఈ ఫ్యాక్టరీకి మాత్రం తమ కలుషిత నీటిని పంపడానికి సముద్రపు నీరు కావాలి.
ఇది సమంజసమేనా అని గత 82 రోజులుగా ఇక్కడివాళ్లంతా ధర్నాలు చేస్తున్నారు
ఫ్యాక్టరీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని అందరికీ తెలుసు. కానీ, ఒక్క ఫ్యాక్టరీ వల్ల 20 వేల మందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందంటే దానివల్ల మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా
ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఫార్మాసిటీ ఉంది. దివీస్ ఫ్యాక్టరీని అక్కడకు తీసుకెళ్లి పెట్టుకోవచ్చు
ఒక మునిసిపాలిటీకి తాగడానికి కావల్సిన 60 లక్షల లీటర్ల మంచి నీళ్లను ఈ ఫ్యాక్టరీ తీసుకుని, అందులో 55 లక్షల లీటర్ల కలుషిత నీళ్లను సముద్రంలోకి వదిలేస్తుంది
అదే జరిగితే మత్స్యకారులు వేటకు పోయే పరిస్థితి ఉండదు
ఇంతటి దారుణమైన పరిస్థితిలో మత్స్యకారుల బతుకులు అగమ్యగోచరంగా తయారవుతాయి
హేచరీల మీద దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికే ఉన్నాయి. వాళ్లంతా ఏమైపోతారనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు
ఇక్కడైతే దివీస్కు 5 లక్షలకే ఎకరా భూమిని ధారాదత్తం చేస్తున్నారు
రైతుల దగ్గర భూములు లాక్కుని దివీస్కు అప్పగిస్తున్నారు. దాదాపు 250 కోట్ల విలువైన భూములను 30 కోట్లకే ఇచ్చేస్తున్నారు. మిగిలిన 200 కోట్లను చంద్రబాబు, దివీస్ పంచుకుంటున్నారు
దివీస్ సంస్థ ఫార్మాసిటీకి వెళ్లి పెడితే, అక్కడ కాలుష్య నియంత్రణ ప్లాంటులు ఉన్నాయి. అక్కడైతే ఎకరా 50-70 లక్షలు కట్టాలి, ఈటీపీల మీద కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆలోచించి, ఇక్కడ మన ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మన ప్రాంతంలో ఫ్యాక్టరీ పెడుతున్నారు
దీనిపై ప్రజలు, రైతులు పోరాటం చేసి, గట్టిగా అడుగుతున్నారు.
ప్రభుత్వం ఉంది కదాని చంద్రబాబు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు
చంద్రబాబు ఇన్నేళ్లలో పెట్టిన పరిశ్రమలు కూడా ఏమీ లేవు
పూర్తిగా అమ్ముడుపోయి, ఎవరికి నష్టం జరిగినా తనకు పర్వాలేదు, తనకు వచ్చేది వస్తే చాలన్నట్లు ఉన్నారు
పరిశ్రమ వల్ల వేలాదిమందికి నష్టం జరుగుతున్నా, వందల కొద్దీ హేచరీలు మూతపడుతున్నా.. ఆయన పట్టించుకోరు
చంద్రబాబుకు, దివీస్కు ఉన్న లావాదేవీలు ఏంటో మాకు తెలియదు గానీ, పరిశ్రమ ఇక్కడ పెడితే మాత్రం దానివల్ల అంతా నష్టమే
గ్రామాలు పరిశ్రమను ఆశీర్వదిస్తేనే అది దేదీప్యమానంగా నడుస్తుంది
చంద్రబాబుకు, మీకు ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.
మీ పొల్యూషన్ అంతా పైపులైన్లతో సముద్రంలోకి విడిచిపెడితే హేచరీలు ఉండవు, మత్స్యకారులు ఉండరు
దేశం మొత్తానికి ఆక్వాహబ్గా 50 శాతం సీడ్ను అందిస్తున్న ఈ వ్యవస్థను నాశనం చేయొద్దని దివీస్ సంస్థను కోరుతున్నా
దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపోయి ఫార్మాసిటీలో మీ పరిశ్రమ పెట్టండి, అలా పెడితే అందరం స్వాగతిస్తాం
దానివల్ల మీకు, రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది
అయినా వినకుండా దివీస్ ఇక్కడే ఫ్యాక్టరీ పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు
కచ్చితంగా పోరాడతాం, ఇక్కడున్న ప్రజలకు తోడుగా నిలబడతాం
చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండేళ్ల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుంది.
ఇలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే.. మేం వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ ఇక్కడినుంచి తీసేస్తాం
పోలీసు సోదరులను కోరుతున్నాం.. మీరు వేసుకున్న యూనిఫాంను, నెత్తిమీద ఉన్న సింహాలను గౌరవించండి. వాటి వెనకాల ఉన్న గుంటనక్కలు చెప్పినట్లు నడుచుకోవద్దని కోరుతున్నాం
అవసరమైతే ఇంకో 22 కేసులు పెట్టించుకుంటాం... కావాలంటే రాజాతో పాటు నేను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మొత్తం మీకు అండగా ఉంటుంది.