భళా భోకనాల్ దత్తు!
రియో డీ జనీరో:తొలి ఒలింపిక్స్లో పాల్గొన్న భారత రోయర్ దత్తు భోకనాల్ అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సీ/డీ సెమీ ఫైనల్ స్కల్స్లో రెండో స్థానంలో నిలిచి ఫైనల్-సీకి అర్హత సాధించాడు. 2 వేల మీటర్ల రేసును 7:19.02 నిమిషాల్లో పూర్తి చేసి శభాష్ అనిపించాడు. దీంతో ఈరోజు జరిగే ఫైనల్ -సీ పోరుకు భోకనాల్ సిద్ధమయ్యాడు. అయితే ఇది సీ/డీ స్కల్స్ ఈవెంట్ కావడంతో భోకనాల్కు పతకం దక్కే అవకాశం లేదు. కేవలం ఫైనల్ -ఏకు అర్హత సాధించిన వారికి మాత్రమే ఇక్కడ పతకం దక్కనుండగా.. భోకనాల్ వరల్డ్ ర్యాంకింగ్ మాత్రం మెరుగుపడనుంది.
ఈ పోరులో పదిహేను వందల మార్కు వరకూ ఆధిక్యంలో ఉన్న భోకనాల్.. ఆ తరువాత కాస్త వెనుకబడి తృటిలో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. కాగా, హంగేరీకి చెందిన రోయర్ మోల్నార్ పీటర్వేరీ 7:18.88 లక్ష్యాన్ని పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో 6:59.89 నిమిషాల్లో పూర్తి చేసిన భోకనాల్ ఒలింపిక్ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసిన సంగతి తెలిసిందే.