గ్రామస్థాయి నుంచి ఇంటర్నెట్ సేవలు
కోవూరు: గ్రామస్థాయి నుంచి ఇంటర్నెట్ సేవలు నిర్వహించాలన్న ఆలోచన తలంపుతోనే సాతి ప్రోగామ్ కింద పొదుపు సంఘాల సభ్యులకు ఇంటర్నెట్లో శిక్షణ ఇస్తున్నామని డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి పేర్కొన్నారు. స్థానిక సంఘమిత్ర కార్యాలయంలో గురువారం డిజిటల్ లిట్రసీ ప్రోగామ్ను ఆమె జిల్లాలో తొలిసారిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ అవసరాలతో పాటు సమగ్ర సమాచారం తెలుసుకోవడం ద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయాలన్న లక్ష్యంతో డిజిటల్ లిట్రసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. జిల్లాలో 8 కేంద్రాలు గుర్తించామన్నారు. 244 ఇంటర్నెట్ సాతిలను తయారుచేసి వీరి ద్వారా 3.60 లక్షల మంది పొదుపు సంఘాల సభ్యులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి వీరందరికీ ఇంటర్నెట్లపై పట్టు సాధించే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏదైనా ఒక వస్తువును తయారుచేసి దానికి సరైన మార్కెటింగ్ చూపించడంలో ఇంటర్నెట్ ఎంతో కీలకభూమిక పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమం మూడు నెలల పాటు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సాతి ప్రాజెక్ట్ మేనేజర్ రాజు, శ్రీనివాసరావు, ఎంపీడీవో జాలిరెడ్డి, ఎంఈవో జగన్నాథశర్మ, ఏసీ కనుపూరు శ్రీనివాసులు, కోవూరు, కొడవలూరు, విడవలూరు, సంగం, అల్లూరు మండలాల ఏపీఎంలు, సంఘమిత్ర అధ్యక్ష, కార్యదర్శులు కలిచేటి కృపావతి, సుగుణమ్మ, సీసీలు పాల్గొన్నారు. అనంతరం సాతి కో ఆర్డినేటర్లకు స్మార్ట్ ఫోన్తో పాటు ట్యాబ్లను పంపిణీ చేశారు.