
రామచంద్రపురం రూరల్/రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు సమీపాన కన్న తండ్రే తన బిడ్డలను పంట కాలువలోకి తోసేసిన ఘటన సోమవారం జరిగింది. బంధువులు, ద్రాక్షారామ పోలీసుల కథనం ప్రకారం.. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజు గృహోపకరణాలను వాయిదాలపై అందించే వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి ఒక వ్యక్తి రూ.30 లక్షలు బాకీ పడ్డాడు. మరోవైపు అప్పులు అధికంగా ఉండడంతో ‘‘అందరం కలిసి చనిపోదామని’’ భార్య విజయతో తరచూ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో బావమరిది సురేంద్ర కొంత ఆర్థిక సాయం చేశాడు. అయినా సరే చనిపోదామనే రాజు అంటూండేవాడు. ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి అప్పులు తీరుద్దామని విజయ చెబితే పరువు పోతుందని అనేవాడు.
పిల్లలను నమ్మించి..
రాజు కుమారుడు రామసందీప్ (10), కారుణ్యశ్రీ (6) రామచంద్రపురంలోని భాష్యం స్కూలులో నాలుగు, ఒకటో తరగతులు చదువుతున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లి పిల్లలను బైక్పై ఎక్కించుకున్న రాజు.. ఇంటికి కాకుండా, వెంటూరు నుంచి కాలువ గట్టు మీదుగా నెలపర్తిపాడు శివారు గణపతినగరం సమీపాన ఉన్న పంట కాలువ వద్దకు తీసుకెళ్లాడు. గట్టుపై దాదాపు 350 మీటర్ల దూరం వెళ్లాక పిల్లలను హఠాత్తుగా కాలువలోకి తోసేశాడు. సుడిలో చిక్కుకుని కారుణ్యశ్రీ గల్లంతవగా.. కాలువ గట్టున ఉన్న తుప్పలను పట్టుకుని వేలాడి సందీప్ ప్రాణాలు దక్కించుకున్నాడు.
అతడు బయటకు వచి్చ, అటుగా వెళ్తున్నవారికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారు ద్రాక్షారామ పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ ఎం.లక్ష్మణ్ ఫైర్ సిబ్బందిని రప్పించి, గాలింపు చేపట్టగా సాయంత్రానికి కారుణ్యశ్రీ మృతదేహం లభ్యమైంది. తల్లి విజయ, అమ్మమ్మ, మావయ్య ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, పిల్లలను కాలువలోకి నెట్టేశాక రాజు బైక్పై పరారైనట్లు సమాచారం. అతడి ఆచూకీ లేకపోవడంతో భార్య విజయ, బంధువులు ఆందోళన చెందుతున్నారు.
‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’
రోజూ మాదిరిగానే తండ్రి రాజు తమను పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాడని చిన్నారులు భావించారు. అయితే, దారి మారడాన్ని గమనించిన కుమారుడు సందీప్ ‘నాన్నా ఎక్కడకు వెళ్తున్నాం?’ అని ప్రశ్నించగా.. ‘అప్పులున్నాయి. మనం చనిపోదాం’ అని రాజు చెప్పాడు. ‘నాన్నా చంపొద్దు ప్లీజ్’ అంటూ సందీప్ భయంతో ఏడుస్తూ వేడుకున్నా రాజు వినలేదు. కాగా, చెల్లెలి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో కుతుకులూరులో ఉండే సురేంద్ర ఆదివారం తమ ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మవారి జాతరలో కారుణ్యశ్రీతో దుస్తులు, గాజులు పెట్టించాడు. ఇంతలోనే ఇలా జరగడంతో సురేంద్ర తీవ్రంగా కలత చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment